24, మే 2015, ఆదివారం

మా ఊరి కవి గారు

 మా ఊరి కవి గారు
అతడంత ఆజాను బాహుడు కాదు. ఏ అయిదున్నర అడుగులో ఉండొచ్చు. వయస్సు అరవై పై మాటే. దాదాపు డభ్భై ఉండొచ్చు. పొడుగ్గా నెహ్రూ గారు  ధరించే లాంగ్ కోటు లాంటిది ధరించి ఉన్నారు. జేబులో జేబు గడియారం కూడా ఉన్నట్టే ఉంది. గుండ్రని ముఖం. ఉంగరాల జుత్తు. చేతిలో పొన్ను కర్ర చిద్విలాసంగా ఊపుకుంటూ  మా వీధిలో నడుస్తూ వస్తున్నారు. మా ఇంటి దగ్గరకు రాగానే వీధరుగు మీద నిల్చున్న నన్ను చూసి మీ తాతెలా ఉన్నాడ్రా?” అని అడిగి నా జవాబు కోసం ఎదురు చూడకుండా ఇంట్లోకి వచ్చేరు. ఎవరో దారి చూపిస్తే సావిట్లోంచి మా తాతగారు పడుక్కున్న పెద్ద గది లోకి ప్రవేశించేరు.  మా బాబాయిలెవరో మా తాతగారి మంచం పక్కనే కుర్చీ వేయగా దానిలో కూర్చుని మా తాతగారి వంక  పరిశీలించి చూసేరు. అప్పటికి దాదాపు 20 రోజులుగా జబ్బుతో ఉన్న మా తాతగారు  కృశించి పోయి పెరిగిన గడ్డం తోనూ కళ్ళు గుంటలు పడిపోయి బాగా నీరసంగా ఉంటూ జీవం లేని కళ్లతో ఒక సారి ఆ వచ్చిన వ్యక్తి ని చూస్తూ హీన స్వరంతో పలకరిస్తున్నట్లుగా చేతులు జోడించి నమస్కరించేరు. వారు దాదావు సమ వయస్కులే. ఆ వచ్చినాయన మా తాతగారి చేతులు పట్టుకుని  ఒరే జోగయ్యా..నీకేం భయం లేదురా. నువ్విప్పుడప్పుడే పోవురా. మరో పదేళ్ళయినా బతుకుతావు. ఊరికే అధైర్య పడకు అంటూ  అక్కడ  ఆ గది లోనే కిందను కూర్చుని  గుడ్ల నీరు కుక్కుకుంటూ తాము ధరించిన సైను పంచల్ని నోటికడ్డంగా పెట్టుకుని బెక్కుతున్న మా తాతగారి విధవ చెల్లెండ్రిద్దర్నీ చూసి మీరేఁవిటే ఇలా? వీణ్ణి ధైర్యంగా బతకనివ్వరేఁవిటే? మీరలా ఉండకూడదు అని వారిని గద్దించి  మా నాన్న గారి వైపు చూస్తూ  మీ నాన్న కేం భయం లేదురా నాది పూచీ.. అయినా వైద్యం చేయిస్తున్నారుగా. మన ఆదినారాయణ  ( డా. ఆదినారాయణ ఆ రోజుల్లో మా ఊళ్ళో పేరొందిన MBBS  డాక్టరు గారు రోజూ వచ్చి మా తాతగారిని చూసి వైద్యం చేసి వెళ్ళే వారు) చేతి చలవ మంచిదే. వెళ్ళొస్తాన్రా ఎవరూ దిగులు పడకండి అంటూ అందరికీ ధైర్యం చెబుతూ  బయటికి వెళ్ళి పోయారు.  మా Family doctor డా. ఆది నారాయణ గారి మీద  మా ఇంట్లో అందరికీ గురి ఉన్నా, ఇప్పుడు వచ్చి వెళ్ళి నాయన ఇచ్చిన ధైర్యంతో అందరి ముఖాల్లోనూ కళ వచ్చింది. దానికి  అతని జ్యోతిష్యం మీద మా మా వాళ్ళందరికీ ఉన్న గురే కారణం అని వేరే చెప్పనక్కర లేదు.
( ఆయన చెప్పి నట్లే ఆ తర్వాత మా తాతగారొక పదేళ్ళు హాయిగా బ్రతికేరు)
ఆయన  పార్వతీ పురంలో మా కంచరి వీధికి  చివరగా ఉండే గొల్ల వీధిలో ఉండేవారు. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు industries department లో వీవీంగ్ సూపరింటెండెంట్ గా పని చేసేవారట. ఆ రకంగా ఉద్యోగంలో ఉన్న కాలం లో మద్రాసులోనో మరెక్కడో ఉంటూ వచ్చినా రిటైరయ్యాక మాత్రం  గొల్లవీధి లోనే వారి స్వగృహం లోనే ఉండేవారు. అందువల్ల బజార్లోకి గాని మరెక్కడికి గాని పోవలసి వచ్చినా మా యింటిముందునుంచే పోవలసి రావడంతో వారిని అంతకు ముందు చాలాసార్లే చూసేను. అదీ గాక వారింటికీ మా యింటికీ శుభకార్యాల్లో రాక పోకలుండేవి కూడా. అయితే అవన్నీ నా చిన్నతనంలో కావడంతో నాకు సరిగా గుర్తు లేవు. పైన చెప్పిన ఉదంతం బాగా గుర్తుండి పోవడానికి కారణం అది నేను కాలేజీలో ఆఖరు సంవత్సరం చదువుతున్న 1960 కావడం, అప్పటికి నాకు మా విశ్శి బాబు ( విశ్వనాథం బాబాయి) గారి ద్వారా  సాహిత్యమంటే కొంత అభిలాష కలగడం- ఆ వ్యక్తి పట్ల కొంత ఆసక్తినీ గౌరవాన్నీ కలుగ జేసాయి. ఇంతకీ ఆయనెవరో చెప్ప లేదు కదూ?  ఆయనే శ్రీ అనంత పంతుల రామలింగస్వామి గారు.  మా ఊరి కవిగారు. నాటి సాహితీ లోకంలో సుప్రసిధ్ధులు. వారి గురించే నేనిప్పుడు చెప్ప బోయేది.
శ్రీ రామలింగ స్వామి గారు సాంప్రదాయ వాదులు. తెలుగులో అనేకమైన పద్యకృతులు రచించారు. 1930 ప్రాంతంలో తెలుగు సాహిత్యం ఉధృతంగా వస్తున్న భావకవిత్వం అందరు సాంప్రదాయవాదుల్లాగే ఈయనకీ నచ్చలేదు. సాంప్రదాయవాదులందరూ భావకవిత్వాన్ని అభావకవిత్వమని ఆడిపోసుకుంటూ అక్కడితో ఆగి పోయినా, భావకవిత్వానికి నిరసనగా గ్రంథాల్ని ప్రచురించిన ఇరువురిలో ఒకరు ఉమాకాన్త పండితులు కాగా రెండో వారు ఈ రామలింగస్వామి గారే.
భావకవిత్వాన్ని అధిక్షేపిస్తూ వచ్చిన గ్రంథాల్లో   అనంత పంతుల వారి  శుక్ల పక్షము బహుళ ప్రచారము పొందినది. భావకవిత్వ ప్రచారాన్ని తన భుజస్కంథాల మీద వేసుకుని ఊరూరా తిరిగి సభలు పెట్టి ప్రచారం చేసిన శ్రీ కృష్ణ శాస్త్రిగారి కృష్ణ పక్షాన్ని ముఖ్యంగా ఎద్దేవా చేస్తూ వ్రాసినదిది. భావ కవిత్వాన్ని ఎగతాళి చేస్తూ ఈ శుక్ల పక్షంలో ఒక చోట-
కొండమీద విన్న గూగూలు
కొండ క్రింద గన్న వాగూలు
అప్పన్న చెవి నున్న పోగూలు
అన వేమా రెడ్డి ఈగూలు  అని వ్రాస్తారు.
మరొక చోట  భావ కవిత్వాన్ని అవహేళన చేస్తూ ఈయన చెప్పి ఈ పద్యం ప్రసిధ్ధమైంది-
రెండు కాకులు కూర్చుండె బండమీద
నొండెగిరిపోయె
నందొండు మిగిలె
రెండవది పోయె పిదప నందొండు లేదు
బండ మాత్ర మందుండి పోయె.
( ఛాందసంగా సాంప్రదాయ దృష్టితో చూడడం వలన వీరికి భావ కవిత్వమంటే ఏహ్యత కలిగింది కాని  భావ కవిత్వం ఇటువంటి ఈసడింపులని తట్టుకుని 5,6 దశాబ్దాలు నిలబడిందంటే వీరి సంకుచితమైన సాంప్రదాయ దృష్టి సరైనది కాదని అవగతమౌతుంది)
అనంత పంతుల వారి  భావకవిత్వ  ద్వేషం పక్కన పెడితే వారు రచించిన ఇతర గ్రంథాలు భువన విజయము, శ్రీ కృష్ణ చరిత్రము, వికట వాణి  మొదలైనవి వీరిని కవిగా లబ్ధ ప్రతిష్టుణ్ణి చేసాయి. ఇందులో శ్రీ కృష్ణ చరిత్రము శ్రీ పాద కృష్ణ ముర్తి శాస్త్రి గారి జీవిత చరిత్రమట. అనంత పంతుల వారు వ్యంగ్యానికి పెట్టింది పేరు .  తెనాలి రామలింగని వలెనే  ఈ రామలింగ స్వామి గారికి కూడా వికట కవి అనే బిరుదు ఉంది. మీద కాకుల పద్యం చూసేరుగా. ( అసలు మా ఇజీనారం జిల్లానే ఇగటాలకు పుట్టినిల్లేమో)
ఈ కవి గారి  రచనా పాటవానికి మచ్చుతునక లన దగ్గ రెండు పద్యాలను ఉటంకిస్తాను.  చూడండి. మొదటిది శ్రీ కృష్ణ దేవ రాయల గురించి చెప్పినది.

 కలిత సారస్వత కలశాబ్ధి వీచుల
       నెలిమితోఁ జెలిమితో నీఁది యీఁది
ఘన మల్ల యుద్ధరంగస్థలోపరి మేటి
       మల్లుర తోడుత మలసి మలసి
దండభోగాసంహతాది సర్వ వ్యూహ
       భిద్రహస్యంబులు వెదకి వెదకి
రాజకీయ రహస్య రాజిత జ్ఞానంబు
విజ్ఞుల సంగతిఁ బెనిచి పెనిచి
యాత్మ జనపాలనా సేవనానురోధ
సకల సాధన సామాగ్రి సంతరించి
రాజ్య పథగామి యగుఁ చుండె రాయలంత
ప్రజలు శ్రీకృష్ణుఁడని తన్నుఁ బ్రస్తుతింప.

క్షితి భర్తయుఁ గృతిభర్తయు
నతులిత కృతికర్త, వైరి హర్త, ప్రజాస
న్నుత వర్తియు, ధృతకీర్తియు
ధృత సంపన్మూర్తి కృష్ణదేవనృపతియే.

రాజా! వైభవజితధన
రాజా! తనుకాంతి విజితరాజా! విద్వ
ద్రాజా! ధృతజితభూభృ
ద్రాజా! రాహుత్తరాజ! రాజకరాజా!

తిరమౌ తావక దేశభక్త కలసద్విద్యా సుధారక్తికిన్
పరరాడ్భంజన శక్తికిన్, సకల దిగ్వ్యాప్తప్రధాసక్తికిన్
గురుసేవాస్థిరసక్తికిన్, బుధజనాకూత ప్రియప్రోక్తికిన్ 
చిరవాంఛాఫలసార భుక్తికి మదాశీర్వాద ముర్వీశ్వరా! 

రెండవది- శ్రీ ఓలేటి బుచ్చి బాబు  ( మన Face Book మిత్రులు శ్రీ శ్రీనివాస భాను గారి అన్నయ్యగారు, ప్రముఖ నాటక ప్రయోక్త) గారి కోరిక మేరకు కవిగారు నటరాజును స్తుతిస్తూ అచ్చ తెలుగులో వ్రాసి ఇచ్చిన సీస పద్యం – ( 1960ప్రాంతాల్లో వ్రాసినది)                     
సీ. మలచూలి నరమేన నిలిపి పేరెలమిమై
చలిగొండ చరులందు మెలగువాడ
నేమ్మేని నిండ నేనికతోలు  మొలమీదు
పులితోలు హవణించి  పొలయువాడ
చలువ గందము రోసి వెలిబూది మై పూసి
చిలువ పేరును మెడం గలుగు వాడ
జడలందు నినువాక ముడివైచి మరి వెల్గు
పూవటు సిగ మీద పూను వాడ
 తే.గీ. సంకు నొక చేత, నొక చేత జింక, నొక్క
కేల ముమ్మొన వాలొక్క కేల డక్క
బెరసి యురళించి యాటాడు వేస కాడ
మేటి యాటల రేడ నీ కేటి కోలు

నటరాజు మీద అచ్చ తెలుగులో ఇంత కన్నగొప్ప పద్యం ఎవరు వ్రాయగలరు
? ( రాస్తే గీస్తే మళ్ళా మా అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారే వ్రాసి ఉండాలి.) మా ఊరి కవి గారికివే నా నివాళులు.
(శ్రీ అనంత పంతుల వారి గురించి ఒక విపులమైన వ్యాసం వ్రాయాలని నాకు ఎప్పటి నుంచో ఉన్నా, నేను చదివిన విషయాలన్నీ సేకరించి ఉంచుకోక పోవడం వల్లా ఆయన పుస్తకాలు నాకిప్పుడు లభ్యం కాకపోవడం వల్లా  ఆ పని చేయలేక పోతున్నందుకు నాకు అసంతృప్తి గానే ఉంది.  కాని శ్రీ గుమ్మా రామలింగ స్వామిగారు ఈ మధ్యన వ్రాయమని అడగడంతో అసమగ్రమైనా ఒక వ్యాసం వ్రాస్తేనే మంచిదనిపించి  వ్రాసేను. ఇది చదివి వారిని గురించిన ముచ్చట్లు తెలిసిన వారెవరైనా చెప్పక పోతారా అని నా ఆశ. దీనిలోని అచ్చ తెలుగు పద్యాన్ని నాకు అందజేసిన  తమ్ముడు భానూకి ధన్యవాదాలు. సెలవు. )



4, మే 2014, ఆదివారం

అయిదు మార్కుల తమాషా కథ




ఇదేమో నిజంగా జరిగిన కథ. నాకు చాలా తమాషాగా అనిపించింది. మీరూ వినండి. సరదాగా ఉంటుంది. కథంతా విన్నాక ఎక్కడ జరిగిందో చివర్లో చెబుతాను.
                                           *****
ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ ఇంట్లోకి ప్రవేశించడం వాళ్ళ నాన్న చూసేడు. ఆయనో పెద్ద మోతుబరి రైతు. 200 ఎకరాల ఆసామీ. చిన్నప్పుడు అమరము, బాల రామాయణము, పెద్ద బాలశిక్ష దాకా చదువుకున్నాడు. ఏడుస్తున్న కొడుకును కారణం అడిగితే తనకు  కేవలం అయిదు మార్కులు తక్కువ వచ్చినందున  పరీక్ష  ఫెయిల్  చేశారని  చెప్పాడు. వాడిని కాసేపు సముదాయించి, ఛర్నాకోల తీసుకుని తానే స్వయంగా గుర్రం బండి తోలుకుంటూ స్కూలు చేరుకుని ఎక్కడయ్యా హెడ్మాస్ట్రుఅంటూ ఒక గావుకేక పెట్టాడు. ప్యూను దారి చూపించగా హెడ్మాస్టరుగారి రూము చేరుకుని బయటే నిలబడి ఏవఁయా హెడ్మాస్ట్రూ..ఐదు మార్కులు..అనావస్యం ( అంటే After all అని అర్థంట) ఐదు మార్కులు తక్కువొస్తే మావాణ్ణి ఫెయిల్ చేశావట? అని గట్టిగానే అడిగాడు.( లేక అరిచాడు).
ఆ హెడ్మాస్టరు గొప్ప చాకచక్యము, సమయ స్ఫూర్తి కలవాడేమో, తన కుర్చీ లోంచి లేచి వచ్చిపెద్దయ్య గారు ఎండలో పడి వచ్చారు. ఈ కుర్చీలో కూర్చోండి తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ ప్యూనుని పిలిచి మన డ్రిల్లు మాస్టారి రూములో కొబ్బరి  బోండాలున్నాయి కదా ఒకటి తీసుకురా. అలాగే వస్తూ వస్తూ మన సైన్సు మాస్టార్ని కూడా వీళ్ళబ్బాయి కొశ్చను పేపరు ఆన్సరు పేపరు కూడా పట్టుకుని రమ్మను. అన్నారు.
మోతుబరి మాత్రం హెడ్మాస్టరు గారు తనకిచ్చిన గౌరవానికి పొంగి పోకుండా నేనిక్కడ కూర్చోడానికి రాలేదు. అనావస్యం అయిదు మార్కులు తక్కువొచ్చాయని మా వాడి గొంతు కోశావు కదా? అదేంది సంగతని అడగడానికొచ్చాను అన్నాడు.
హెడ్మాస్టరు గారేమీ కంగారు పడకుండా పెద్దయ్యగారు అలసి పోయున్నారు. కాస్తంత స్థిమిత పడండి. తర్వాత మాట్లాడుకుందాం అంటూ ప్యూను తెచ్చిచ్చిన కొబ్బరి బోండాన్ని ఆయన చేతికందించారు. ఆ మోతుబరి ఇంకా అసహనం గానే ఆ బోండాంలో ఉన్న స్ట్రాని అవతల విసిరేసి  కొబ్బరి బోండాన్ని ఎత్తి పట్టుకుని దాన్లోని నీళ్ళన్నీ ఒక్క గుక్కలో తాగేసి అక్కడ పడేసి ఛర్నాకోలని హెడ్మాస్టరు టేబిలు మీద పడేసి ఇప్పుడైనా  చెప్పవయ్యా సంగతేంటన్నట్లు హెడ్మాస్టరు వైపు చూసేడు.
హెడ్మాస్టరు ఆ మోతుబరి  పక్కనే స్టూలు మీద కూర్చుంటూ సైన్సు మాస్టరు తెచ్చిచ్చిన ప్రశ్నా పత్రాన్ని ఆయనకు చూపిస్తూ ఇది మీవాడి కొశ్చన్ పేపరు. దీని మీద కుడివైపున ఏమి వ్రాసి ఉందో మీరో చూడండి అంటూ చూపించారు. చదవడం వచ్చిన మోతుబరి గారు మొత్తం 100 మార్కులు అంటూ చదివాడు ”. అప్పుడు హెడ్మాస్టరుగారు చూసేరు కదా 100 మార్కులకీ మీవాడికి ఎన్నొచ్చేయో మీరే చూడండి. అంటూ ఆ అబ్బాయి ఆన్సరుషీటుని ఆయనకు చూపిస్తూ  మీ వాడికి వచ్చినవి ఎన్ని? తొంభై తొమ్మిదా? తొంభై ఎనిమిదా? తొంభయ్యా?  పోనీ 80..70...60...50...40.. ఇవేవీ కావు కదా?  కేవలం 30 మార్కులు. మీరే చూసేరు కదా?  మీ వాడికి తక్కువొచ్చింది 100 లో 30 పోతే 70. డభ్భయి మార్కులు తక్కువ వొచ్చిన వాణ్ణి ఎలా  పాసు చెయ్యమంటారో మీరే చెప్పండి? అన్నాడు.
హెడ్మాస్టరు చెప్పింది విన్నాక మోతుబరి ముఖంలో కోపమంతా మాయమైంది. గుబురు మీసాల వెనుక చిరు నవ్వు కూడా మెరిసింది.  ఔను మరి ..రెండో మూడో మార్కులు తక్కువైతే నువ్వే ఎట్టాగో అట్టా నువ్వే సర్దేసి ఉండేటోడివి కదా?  ఏకంగా డభ్భై మార్కులు తక్కువొస్తే నువ్వు మాత్రం ఏం జేస్తావులే సామీ? అంటూ మళ్ళా కోపంగా  మరి మా దొంగ నాయాల అయిదే తక్కువైనాయని చెప్పేడే...డభ్భై మార్కులు తక్కువ తెచ్చుకునింది కాక నాతో అయిదే మార్కులు తక్కువొచ్చినయ్యని అబధ్ధాలు కూడా చెబుతాడా?  వాని వీపు  ఇప్పుడే సాపు జేస్తా.. అంటూ కుర్చీ లోంచి లేచి బయటకు నడిచాడు. హెడ్మాస్టరు గారు ఇదిగో ఇది మర్చిపోయారు అంటూ మోతుబరి తన టేబిలు మీద పెట్టిన ఛర్నా కోలను తీసి అందిస్తే తీసుకుంటూ మా బాగా గుర్తు చేశావు . ఇప్పుడు దీనితోనే గదా పని బడేది అంటూ తన బండి వైపునడిచాడు.
                                                            ****
ఆ తర్వాతేమయ్యిందో నాకు తెలీదు. ఎందు చేతనంటే ఈ ముచ్చటని తన చిన్నతనంలో తాను తొమ్మిదో తరగతి చదువుతుండగా జరిగిందనీ, ఆ అబ్బాయి తన క్లాసుమేటేననీ చెప్పిన ప్రముఖ రచయిత డా. కేశవరెడ్డిగారు ఆ తర్వాతేమయిందో చెప్పలేదు. (అయినా అది మన ఊహకందని విషయం కాదుకదా?)  ఆ హెడ్మాస్టరుగారి పేరు  తనకి స్పష్టంగా గుర్తుందనీ వారు శ్రీ బి. పద్మనాభ రెడ్డిగారనీ మాత్రం చెప్పారు.
                                                  ****
ఈ ముచ్చటని రికార్డు చేసిన డా. కేశవ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సరదా ముచ్చటనాకు నచ్చింది. మరి మీకు కూడా నచ్చితే సంతోషమే. సెలవు.
                                                  **** 
                                                            

5, ఏప్రిల్ 2014, శనివారం

మా తెలుగు తల్లికీ మల్లె పూదండా...(దండ లోని దారం కథ..)




మనం తెలుగు నేల మీద ఉన్నా దేశాంతరాలలో ఉన్నా , ఏ తెలుగు సాంస్కృతిక కార్యక్రమమైనా మా తెలుగు తల్లికీ మల్లె పూదండా ..మా కన్న తల్లికీ మంగళారతులూ..  అంటూ తెలుగు తల్లికి జేజేలు పలుకుతూ ప్రారంభిస్తాము. తెలుగు తల్లి విగ్రహానికి వేసిన మల్లెల మాల ధవళకాంతులీనుతూ కనిపిస్తూనే ఉంటుంది. ఆ మల్లెల సౌరభాలు దశదిశలా వ్యాపిస్తూనే ఉంటాయి. కానీ తెలుగు తల్లి మెడని మల్లెలు అలంకరించి మనల్ని అలరించడానికి కారణమైన ఆ సూత్రం—అదే- ఆ దారం మాత్రం కన్పించదు. దాని గురించి ఎవరమూ ఏ వేళా ఆలోచించం కూడా. పాట విని రసడోలలో తేలిపోతూ ఎదురుగా నిల్చొని పాడుతున్న గాయకుణ్ణి మెచ్చుకుంటూ మురిసి పోతాం. కాని దండలో దారం లాగా కనిపించని ఆ కవిని మాత్రం పట్టించుకోం. ఎప్పుడో అర్థశతాబ్దికి పూర్వమే, మనకి స్వాతంత్ర్యం రాకపూర్వమే మన తెలుగు తల్లి మెడలో వాడని ఆ మల్లె పూదండ వేసిన కవిగారి గురించి కొంచెం తెలుసుకుందాం.
ఈ గీతాన్ని వ్రాసిన కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్య గారు. వీరిని నేను 1960-70లలో ఒకసారి చూసేను. వీరి అన్న(లేక తమ్ముడు) గారైన కృష్ణమాచారిగారు అప్పట్లో నేను పనిచేసే ఆడిట్ ఆఫీసు (A.G’s Office, Hyderabad) లో అకవుంట్స్ ఆఫీసరుగా పనిచేస్తూ ఉండేవారు. ఒక సాయంత్రం ఆఫీసు పని ముగిసేక మా రంజని గ్రంథాలయంలో శ్రీ సుందరాచారి గారితో ఇష్టాగోష్టి ఏర్పాటు చేసేరు. రంజని గ్రంథాలయానికి కేటాయించబడ్డ ఆ మారుమూల పాతకాలపు హాలులో పట్టుమని పాతికమందిమి కూడా లేమనే నాకు గుర్తు. ఏమయితేనేం అలా ఆ కవిగారిని చూడడం వారితో ముచ్చటించగలగడం నాకింకా లీలగా గుర్తుంది. వారు పొడగరి కాదు. అర్భకంగా అయిదూ అయిదున్నర అంగుళాల ఆసామీ. మిగిలిన వివరాలేమీ నాకిప్పుడు గుర్తు రావడం లేదు. వారి అన్నతమ్ముడైన మా కొలీగ్ శ్రీ కృష్ణమాచారిగారు మాత్రం మన లోక్ సభ స్పీకర్ గా పని చేసిన శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగారి అల్లుడని మాత్రం తెలుసు. 1974లో నేనూ శ్రీ కృష్ణమాచారిగారూ  ఒక ఆడిట్ నిమిత్తం ఒంగోలు వెళ్ళి అక్కడ రహదారి బంగళాలో కలసి ఉండడం ఆయనతో చేసిన సాహితీ గోష్టి కొంచెం కొంచెంగా గుర్తుకొస్తున్నాయి. (ఈ విషయం ఎందుకు చెప్పానంటే సుందరంబాడి వారింట్లోనే సాహితీ వాసనలు గుబాళిస్తూ ఉండి ఉంటాయేమోననే ఊహ రావడం వల్లనే )
సుందరాచారి గారి గురించి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన స్వేఛ్చాలోలుడు. ఎవరినీ లెక్క జేసే మనిషి కాడట. అందువల్లనే ఏదో విషయంలో తన పై అధికారులతో విభేదించి తాను పని చేస్తున్న డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన రచనలమీదే ఆధారపడి జీవించాడట. మతి స్థిమితం లేని ఆయన భార్య కంచిలో ఎవరో బంధువుల ఆశ్రయంలో ఉండేదట. పుస్తకాలు రాసి వాటిని అచ్చేసుకుని ఊరూరా తిరిగి అమ్ముకుంటూ కాలం గడిపే వాడట. ఎన్ని కష్టాలు పడ్డాడో బ్రతుకెలా ఈడ్చుకొచ్చాడో?  ఏ దుర్భర జీవితం ఆయనను పురిగొల్పిందో కాని తాగుడు వ్యసనానికి  పూర్తిగా బానిసైపోయి పూర్తిగా స్పృహ లేని స్థితిలో తిరుపతి వీధుల్లో తనువు చాలించారట. గుణ లేశం ఎక్కడ కనిపించినా మెచ్చుకుంటూ, వెలిగే దివ్వెలకు నూనె పోస్తూ, గట్ల మథ్య
ఇమడలేని వరద వెల్లువలా జీవించిన ఆయన జీవితమనే గంభీర విషాదాంత నాటకానికి ఆవిధంగా తిరుపతి వీధుల్లో తెరపడిందంటారు ఆయన గురించి బాగా తెలిసిన  ప్రఖ్యాత కథకులు కీర్తి శేషులు శ్రీ మధురాంతకం రాజారాం గారు. శ్రీ సుందరాచారి గారికీ,  తన ఈ పై పాటకీ సంబంధించిన ఆసక్తిదాయకమైన ఓ ముచ్చట- శ్రీ రాజారాం గారు చెప్పినదే -అందరూ తెలుసుకోవలసినది ఒక్కటీ చెప్పి ముగిస్తాను.
1976లో ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం  తొలి తెలుగు ప్రపంచ మహా సభలు హైదరాబాదులో ఘనంగా  నిర్వహించారు. ఆ సందర్భంగా మా తెలుగు తల్లికీ మల్లె పూదండా.. గీతాన్ని తెలుగు వారి జాతీయగీతంగా నిర్ణయించడంతో పాటు ఆ పాటని మొదటిసారి గ్రామఫోను రికార్డులో పాడిన విదుషీమణి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారిని ప్రత్యేకంగా లండనునుంచి రప్పించి సభల ప్రారంభగీతంగా పాడించారట. అందుకోసం లండను నుంచి విమానంలో వచ్చిన సూర్యకుమారిగారు నేరుగా  ఫైవ్ స్టార్ హోటల్లో దిగి బస చేసి సభాప్రాంగణానికి కారులో వచ్చి పాట పాడేసి తిరిగి కారులో తెలుగు నేల మట్టైనా కాళ్ళకు అంటుకోకుండా వెళ్లిపోయారట. ఆ సభకు వచ్చిన సాహితీ పరులు కొందరు  మన ఈ రాష్ట్రీయగీతాన్ని రచించిన కవి గారి గురించి ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం గురించి చాలా విచారించారట. అలా విచారిస్తున్న రాజారాం గారికి ఆ రాత్రి పది గంటల సమయంలో  స్టేడియం సోపాన పంక్తుల మీంచి నడుచుకుంటూ ఒక్కడూ వెళ్ళి పోతున్న సుందరాచారిగారు కనిపించారట. రాజారాం గారు పలకరించగానే ఆయనతో   నన్నింత నిర్లక్ష్యం చేస్తారట్రా వీళ్లు? ఊరుకుంటానట్రా? మండలి వేంకట కృష్ణారావుకు కబురు పంపించాను.  రేపు ఉదయం ఆరుగంటలకు కలవమన్నారు అంటూ వెళ్లి జనంలో కలసి పోయారట. మరునాడు ఆయన మండలి కృష్ణా రావు గారిని కలవగానే ఆయన   కవి గారి చిరునామా తెలియకపోవడంతో అలా జరిగిందనీ దానికి చాలా చింతిస్తున్నామనీ చెప్పి మరునాడు మహా సభల్లో  ఆయనను తగురీతిని సత్కరించడంతో పాటు కవిగారికి జీవితాంతం వర్తించేలా జీవనభృతిని కూడా ఏర్పాటు చేసారట. నాటి విద్యాశాఖా మంత్రి   ప్రపంచ తెలుగు మహా సభల నిర్వాహకులు అయిన మండలి వారి సంస్కారం గొప్పది. అయితే ఆయన పెద్ద మనసుతో కవిగారికేర్పాటు చేసిన ఆ జీవన భృతి (ఆ రోజుల్లో నెలకు 250 రూపాయలు) కవి గారికి మంచి కంటే చెడే ఎక్కువ చేసిందనీ అంతకు ముందు చేతిలో పైకం లేక తక్కువగా తాగే కవిగారు చేతిలో సొమ్ము గలగల లాడటంతో విపరీతంగా తాగి  ఆరోగ్యం పాడుచేసుకున్నారంటారు శ్రీ మధురాంతకం రాజారాం గారు. కవిగారు ఎలా కాలం చేసినా కలకాలం మిగిలే పాట ఒకటి మనకి మిగిల్చి పోయారు.
వేద్దాము వేద్దాము మన తెలుగు తల్లికీ మల్లె పూదండలూ...
చేద్దాము చేద్దాము మన కవిగారికీ కోటి దండాలూ...
( కవిగారితో తనకు గల పరిచయాన్ని రికార్డు చేసిన శ్రీ రాజారాం గారికి  కృతజ్ఞతలతో- సెలవు.)