25, ఆగస్టు 2011, గురువారం

నేనూ..ముళ్లపూడీ..బాపూ.మాఅమ్మాయీ..



నాకాలేజీ రోజుల (1957-61) నుంచీ నాకు బాపూ అన్నా ముళ్ళపూడి అన్నా భలే ఇష్టం ఉండేది. ఒకరకంగా వీరాభిమానినే. అయితే వారిని ఎప్పుడూ కలుసుకోవడంగాని ఉత్తర ప్రత్తుత్తరాలు జరపడం గాని జరుగలేదు. ఇలా ఉంటే 1990 లో ఒకసారి ఇన్కమ్ టాక్స్ లో ఆడిట్ ట్రైనింగ్ నిమిత్తం మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఉండగా సరదాగా ముళ్ళపూడి గారికి ఫోన్ చేసాను,కలుసుకోవడానికి వీలు పడుతుందా అని.. తప్పకుండా సాయంత్రం రండి అని ఆహ్వానించేరు. ఆనందంగా మా బావమరది కోటీశ్వర రావుని తీసుకుని ఎల్డామ్స్ రోడ్లో ఉన్న వారి ఆఫీసుకి వెళ్ళాను. మేము వేళ్ళే సరికే లాన్స్ల్ లో ఒక చిన్న రౌండ్ టేబిలూ మూడు కుర్చీలు వేయించి ఉన్నారు. మమ్మల్ని సాదరంగా అహ్వానించి కూర్చోబెట్టారు.ఏదో పది నిమిషాలు మాట్లాడి పంపించేస్తారనుకున్నాను గానీ సుమారు గంటన్నర సేపు మాట్లాడుకున్నాము.మధ్యలో రెండుసార్లు టీలు. టేబిలు మీద టిన్నుతో పెట్టిన సిగరెట్లు కాల్చుకుంటూఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము .అప్పట్లో పెళ్ళి పుస్తకం సినిమా తీయబోతున్నట్టున్నారు. స్క్రిప్ట్ రడీగా ఉందనీ షూటింగ్ హైద్రాబాదులో జరుగుతుందనీ  మేము వచ్చి చూడవచ్చనీ అన్నారు.  నా
అభిమాన రచయితని కలుసుకోవడం అలా జరిగింది.ఆయన సింప్లిసిటీ ఆత్మీయతా
ఇప్పటికీ కళ్ళముందు కదలాడతాయి.  మేం వచ్చేస్తుంటే  శ్రీ రమణ గారిక్కడే ఉన్నారు చూస్తారా అని కూడా అడిగేరు. నాకు ఎం తో ఉత్సాహంగా ఉన్నా  మాకు వేరే పనులుండడంతో అప్పుడది వీలు పడలేదు. బాపూ గారక్కడ లేకపోవడంతో వారిని కలవడం వీలు పడలేదు.
                                      అయితే బావూ గారిని కలవడం మరో పదహారు సంవత్సరాల తర్వాత కుదిరింది. 1996 డిశంబరు 31  --1997 జనవరి 1 లలో ముళ్ళపూడి  బావూల జంట షష్ఠి పూర్తి  వంగూరి చిట్టన్ రాజు ఫౌండేషన్ వారు హైద్రాబాదులో నిర్వహించారు. అక్కడకి నేను మాఅమ్మాయి కలిసి  వెళ్ళడం జరిగింది. లోపల ఏదో సభజరుగుతున్నా  ముళ్లపూడి  బయటే నిల్చుని ఉన్నారు. మేం ఆయనతో మాట్లాడుతుంటే  ఒక ఫొటోగ్రాఫరు కనిపించేడు ఏవో ఫొటోలుతీస్తూ. మా అమ్మాయి ముళ్లపూడి గారిని అడిగింది వారితో కలసి ఫోటో దిగాలనుందని. ఆయన అలాగే అంటూ  కొద్దిదూరంలో ఎవరితోనో మాట్లాడుతున్న బాపూగార్ని రండి మన వాళ్ళొచ్చేరు ఫొటో  దిగుదాం అని పిల్చేరు బాపూ గారు వస్తూనే ప్రక్కకు జరుగుతున్న నన్ను వారి మధ్యలో నిల్చోమన్నారు. కానీ వారిద్దరినీ విడదీయకూడదంటూ వారిద్దరినీ మధ్యన నిల్చోబెట్టి  ఇటునేనూ అటు మా అమ్మాయి నిల్చొని ఫొటో దిగేము.
                       పైనున్నది ఆఫొటోయే. తీపిగుర్తుగా మిగిలింది.

   వారిని గుర్తు చేసుకుంటూ ముచ్చటగా మూడు కంద పద్యాలు



బాపూ-రమణలకు

జేజే—

సుందరి కోసము వెదకుచు
ఎందును గానక విసుగుతొ నేనుండంగా
అందము బొమ్మై నిలిపిన
చందము నీకే తగునది శహబాస్ బాపూ                     

ఎన్నుదు నిన్నే హాస్యము
పన్నును చెన్నుగ కథలను పండించుటలో
నిన్నును మించిన వారల
నెన్నడు నే జూడ లేదు ఎమ్వీ రమణా                        

చాన్నాళ్ళ క్రితము నేన్మీ
చెన్నై లో తమను కలిసి చేసిన ఛాటిం
గిన్నాళ్ళైనా యెన్నడు
సన్నగిలక మది మురియును  సంతోషముతో