7, సెప్టెంబర్ 2011, బుధవారం

కక్కూసు కథ హి..లేక..షి...


నేను 1997 లో రిటైర్ అవకముందు హైదరాబాదు  ఏజీ ఆఫీసులో  34 సంవత్సరాలు పని చేసాను.  అప్పట్లో...(.ఇప్పటికీ కూడా) ... మా ఆఫీసు లో సాహితీ పరిమళం గుబాళిస్తూ ఉండేది/ ఉంటోంది. ఎందరో కవులూ సాహిత్యాభిలాషులూ  మరీ ముఖ్యంగా  కథా నాటక రచయితలు  ఎక్కువగా ఉండేవారు. బి.కె.ఎల్.ఎన్ ఆచార్య, ఇసుకపల్లి దక్షిణా మూర్తి, పరుచూరి వెంకటేశ్వర రావు, ఢి.ప్రభాకర్, పమ్మి వీరభద్రరావు గుమ్మా ప్రసన్నకుమార్ కె.కె.మీనన్  శంకరమంచి పార్థసారధి ..ఇలా ఎందరో..  నేను రచయితను కాకపోయినా వాళ్ళలో కొంతమందితో  స్నేహమూ,మిగిలినవారితో ముఖపరిచయమూ ఉండేది. రంజని అనే పత్రిక నేను ఆఫీసులో చేరిన రోజుల్నుంచీ  సాహితీ సేవ  చేస్తూ ఈనాటికీ నడుస్తోంది.మహాకవుల్నీ గొప్ప రచయితల్నీ ( దివాకర్ల వెంకటావధాని , విశ్వనాథ సత్య.నారాయణ ఉత్పల  మొదలైన కవులూ.. రావి శాస్త్రి కాళీపట్నం మొదలైన రచయితల్నీ)  పిలిపించి సభలు చేయడం మంచి పుస్తకాలు ప్రచురించడం వచన కవితా పోటీలు నిర్వహించడం వంటి ఉత్కృష్ట సాహితీ సేవ నేటికీ కొన సాగుతోంది.(తొలినాళ్లలో రంజనిలో నేనూ చిన్న చిన్న గేయాలు వ్రాసిన వాడినే)
ఈ విధంగా  సాహితీ సౌరభాలు విరజిమ్మే  చోటికి  మిత్రులను కలుసుకుందికి అనేకమంది రచయితలు వస్తూండేవారు. వారిలో నేటి నవ్య వార పత్రిక సంపాదకుడు జగన్నాథ శర్మ ఒకరు. శర్మది మా ఊరే కావడం.. మా వీధిలోనే పుట్టి పెరిగిన వాడవటం మాతమ్ములందరితోనూ స్నేహంగా ఉండడంతో  నాకంటే బాగా చిన్నవాడయినా నాకు  బాగా తెలుసు. ఒకసారి అతను సాహితీ మిత్రులను కలుసుకోవడానికి మా ఆపీసుకి వచ్చినప్పుడు అందరం కలసి గేటు దగ్గర ఖాన్ సాబ్ టీ కొట్లో టీ తాగుతున్నాము. ఇంతలో  ఒకాయన  పలానా రచయిత్రి తన కథలో కక్కూస్”  అనే పదం వాడిందనీ దాని అర్థమేమిటో తెలియదనీ అలాటి పదాలు ఎందుకు రాస్తారో అర్థం కాదనీ అన్నాడు. అక్కడున్న మిగిలిన వారికి కూడా ఆ పదం అర్థం తెలిసినట్టులేదు. తెలియక పోవడంలో విశేషం లేదు. ఎందుచేతంటే వారందరూ చిన్నవారు. బహుశా వారు పుట్టినప్పటికే ఆపదం  వాడుకలో కనుమరుగయిందనుకుంటాను.
నాకు ఆపదం అర్థం తెలుసు కనుక వారికి చెప్పాను. కక్కూస్ అంటే లెట్రిన్ అని.  ఆ పదం తమాషా ఏమిటంటే అది పోర్చుగీసు పదం. వాళ్లు మనదేశానికి  వర్తకానికి వచ్చి స్థావరాలు ఏర్పరచు కున్నప్పుడు. మన భాషలో చేరింది. అసలు ఆపదం  Kak+ House= kakhouse  “ కేక్ హవుస్ జనం పలుకుబడిలో కక్కూస్ గా మారింది.   నేను బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు  కొన్ని రైల్వే స్టేషన్లలో  లెట్రిన్ల నీద కక్కూస్ అని వ్రాసి ఉండడం చూసి ఉన్నాను.ఇప్పుడయితే ఈ పదం ఎక్కడా వినపడడం లేదుగాని ఇప్పటికీ మా ఇళ్లల్లో చిన్న పిల్లలు మల విసర్జన చేస్తే కేక్ వెళ్లాడంటూ ఉంటారు..  శుచి శుభ్రతల్ని పాటించే సంస్కారవంతుల ఇళ్లల్లో  కొన్ని పదాల్ని పలకడం    తప్పుగా భావిస్తారు. అసహ్యమని భావించే పదాలకి బదులుగా వేరే పదాల్ని వాడడం సర్వత్రా ఉన్నదే. అందుకనే  ఒకటికనీ,రెంటికనీ బహిర్భూమికనీ దొడ్డిలోనికనీ వ్యవహరిస్తూ ఉంటారు. (కన్యాశుల్కంలో కోమటాయన గుడ్డి మీద బాహ్యానికి వెళ్లాననడం గుర్తుందా?)  . మా ఇంట్లో మా చిన్నప్పుడు మేము పెట్టుకున్న ముద్దు పేరు
లండన్అని.... బాగుంది కదూ?   ( మేము తెలియకుండా పెట్టుకున్న పేరయినా దానికో సార్థకత  ఉన్నట్టుంది. సుమారు రెండు వందల ఏళ్లక్రితం లండన్ లో ఎవరింట్లోనూ లెట్రిన్లు ఉండేవి కావట.  అప్పుడప్పుడూ మనుషులు తోపుడు బళ్లతో వచ్చి  మల మూత్రాల్ని తీసుకు పోయేవారట. అంటే ఆరోజుల్లో లండన్ నగరమే ఓ పెద్ద కక్కూస్ లా ఉండి ఉంటుదనడం  -- తప్పేమి ఒప్పేయగున్
                                                                ఈ రోజుల్లో  టాయ్ లెట్లమీద  ఏమీ వ్రాసి ఉండదు. హి..ఆర్ షి..అతడు లేక ఆమె అని మాత్రం వ్రాసి ఉంటుంది. అర్థంచేసుకోగలరు. అసలు మన రైల్వే బస్టాండులలో  టాయ్ లెట్ల గురించి ఎక్కడా వ్రాసి ఉండక్కరలేదు.  చాలాదూరం వ్యాపించే వాటి దుర్గంధమే వాటి ఉనికిని చాటుతూ ఉంటుంది.
 (  ఇక్కడో రహస్యం చెప్పాలి. నేను  195760 ప్రాంతాలలో  భారతిలో ప్రచురించ బడిన శ్రీ తూమాటి దొణప్ప గారి వ్యాసం తెలుగులో బుడతకీచు నుడులు అనే దాన్ని చదివి ఉన్నాను. కక్కూస్ గురించి ఆయన వ్రాసిందే .  బుడతకీచు అనేది తెలుగు వారు పోర్చ్ గీ సు వారికి పెట్టుకున్న పేరు.ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు).........
  ఇదీ కక్కూస్ ల కథ...
. మళ్లీ కలుద్దాం....సెలవు....
    






వెంకట సుబ్బారావు మేడీజీ....



ఇదెక్కడో విన్నట్టుంది కదా? సాహితీ ప్రియులందరికీ ఇది కన్యాశుల్కం ప్రథమాంకంలో కాపర్సుకి కరువొచ్చినప్పుడు గిరీశం శిష్యుడు వెంకటేశానికి రాసుకోమని చెప్పిన పుస్తకాల లిస్టులోనిదని తెలుసు. సబ్జెక్టు పుస్తకాలు ఎనిమిది చెప్పి తొమ్మిదో పుస్తకంగా దీన్ని రాసుకోమంటాడు. దాని తర్వాత పదీ పూర్తి చెయ్యడానికన్నట్టు కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్టు అనీ రాసుకోమంటాడు. ఆఖరు దాని సంగతి నాకు తెలీదు గాని ఈ వెంకట సుబ్బారావు మేడీజీ మాత్రం గురజాడ వారి సృష్టి కాదు. ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో కూడా (అంటే నూరేళ్ళక్రిందటే )  ప్రతి సబ్జెక్టుకీ గైడ్లు ఉండేవన్నమాట.(మన తాతలందరూ మేము టెక్స్టు పుస్తకాలే చదివి పాసయే వాళ్ళమంటే మనం నమ్మనక్కరలేదు). ఆరోజుల్లో ఇలాంటి గైడ్లు ప్రచురించిన చారిత్రిక పురుషుడు  వెంకట సుబ్బారావు. వారి ఇంటి పేరు రెంటాల. వీరిని గురించి కూపీ లాగితే నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను.

రెంటాల వెంకట సుబ్బారావు కన్యాశుల్కం రచనా కాలానికి జీవించి ఉన్న వ్యక్తి. (అంటే 18901910 ) ప్రాంతంలోనన్నమాట.  ఆదిభట్ల నారాయణదాసుగారి మాటల్లో ఈయన ఆరోజుల్లో చెన్నపట్నం మైలాపూరు చెరువు ఉత్తర గట్టున నివశిస్తూ ఉండేవాడు. ఆరోజుల్లోనే ఈరకమైన మేడీజీ పుస్తకాలు (గైడ్లు) ప్రచురించి రెండు లక్షలార్జించేడట.బియేబియల్ చదువుకున్న విద్యాధికుడు. తెలివితేటలుకలవాడు మిక్కిలి రసికుడున్నూ.కడు ఉదారవంతుడు. తెలుగున గద్యపద్యములు మిక్కిలి చురుకుగనల్లగలడు. దొరలు మెచ్చునట్లింగ్లీషు వ్రాసి మాట్లాడగలడు.”   ఈ వెంకట సుబ్బారావుగారు నారాయణదాసు గారికి కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి ఆయన చేత సంగీత సభలు చేయించినట్టు,హరికథలు చెప్పించినట్లు వ్రాసుకున్నారు. దాసుగారి సభలమీద హిందూ పత్రికలో వ్యాసాలు కూడా వ్రాసేరట.

ఈ రెంటాల వెంకట సుబ్బారావు గారి గురించి మరికొంత సమాచారం నాకు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రజ్ఞాప్రభాకరములో దొరికింది. శాస్త్రిగారు మద్రాసు లోఉన్నప్పుడు కొంత కాలం మైలాపూర్ లోఉంటూ అక్కడల కపాలీశ్వర స్వామి గుడి దగ్గర ఒక పూటకూటింట్లో భోజనం చేసేవారట. అది నిర్వహించే స్త్రీ మూర్తి రెంటాల వారికి దూరపు బంధువనీ కొన్నాళ్లు ఆమెకు ఏ ఆసరా లేకపోతే ఆదుకున్నారనీ ఆవిడ స్వతంత్రంగా జీవించాలనే తలంపుతో పూటకూళ్ళిల్లు నిర్వహించడం మొదలు పెట్టిందనీ వ్రాసేరు. శాస్త్రిగారు సేకరించి సంకలించిన చాటు పద్యమణిమంజరి ప్రచురించడంలో రెంటాల వారు చాలా సహాయము చేసేరట. వేయి రిప్లై కార్డులమీద (కార్డు వెల కాని) నోటీసు పుస్తక మపేక్షించు వారు వ్రాయుటకు పై అడ్రసుతో అప్లికేషను ఫారము అచ్చు వేయించి అడ్రసులతో పోస్టు చేయించిరి. వెంటనే వేయి పుస్తకములు నమ్ముడుపోయెను.”  అని వ్రాసుకున్నారు.
                                                                    ఈ రెంటాల వెంకట సుబ్బారావు గారిని గురించి మనకి మరికొన్ని విషయాలు శ్రీ వల్లూరి సూర్యనారాయణరావుగారి స్వీయచరిత్రలో దొరుకుతాయి. దీని ద్వారా మనకు శ్రీ రెంటాల వెంకట సుబ్బారావు గారు ఆరోజుల్లోనే ప్రపంచంలో అతి పెద్దదైన ఫోటో స్టుడియోలలో రెండవ స్థానం పొందిన ఫుటో స్టుడియో నిర్వహించే వారని తెలుస్తోంది. ఇదికాక రెంటాలవారు షేక్స్పియర్ నాటకాలను గూర్చి ఇంగ్లీషులో ప్రకటించిన గొప్ప వ్యాఖ్యలు,విమర్శలు, అమెరికన్ విద్వాంసుల ప్రశంసనూ అబ్బురాన్నీ పొందేయట. 
శ్రీ వల్లూరి వారి స్వీయచరిత్రలో ఒక అధ్యాయం అంతా రెంటాల వారిని గురించే ఉందట.  శ్రీ సుబ్బా రావుగారి ఫొటో కూడా చూడవచ్చునట. ఈవిషయాలు శ్రీ అక్కిరాజు రమాపతి రావుగారు  తెలుగులో స్వీయచరిత్రలు జీవిత చరిత్రలు  అన్న వ్యాసంలో వ్రాసేరు. శ్రీ వల్లూరి వారి జీవిత చరిత్ర నాకు దొరకలేదు. దొరికితే ఒక అద్భుత వ్యక్తి గురించి ఇంకా చాలా విషయాలు తెలిసేవి. మిత్రులెవరైనా ఈకృషి చేయగలరని ఆశిస్తున్నాను.

సెలవు.