9, డిసెంబర్ 2011, శుక్రవారం

పిలుపులూ....మానవ సంబంధాలూ......


పిలుపూలూ..మానవ సంబంధాలూ... 
ఒకరినొకరు పిల్చుకోవడంలో ఎన్ని రకాలో? మా చిన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం. మా తాతగారిని  మా నాన్నగారూ వారి తమ్ములూ అందరూ బాబూ అని విలిచేవారు. వారందరిలోకీ పెద్దఅయిన మా నాన్నగారిని వారి తమ్ములు నాన్నా అని పిలిచేవారు. తండ్రి తరువాత తండ్రి అంతటివారని పెద్దన్నగారిని అలా పిలిచే వారేమో?.ఇటువంటి ఆచారం వాళ్ళకుటుంబాలలో కూడా ఉండేదని శ్రీ రాంభట్ల కృష్ణమూర్తిగారు వారి స్వీయ చరిత్రలో రాసేరు.
మా చిన్నప్పుడు ( నాకప్పుడు పదేళ్లలోపే) మా మాతామహుల ఇంటికి ఉరవకొండ  ( అనంతపురం జిల్లా) వెళ్తూ ఉండేవాళ్లం.. వారింటికి ఎదురుగా బస్టాండు ఉండేది స్టాండంటే మరేమీ లేదు. ఓ చెట్టు చుట్టూ బస్సులు ఆగుతుండేవి. అక్కడినుంచి బళ్లారికి పోయే బస్సులు వచ్చినప్పుడల్లా ఎవురప్పా బళ్లారి అనే అరుపులు విని పిస్తుండేవి. ఉత్తరాంధ్ర ప్రాంతంనుండి వెళ్లిన మాకు ఆ పిలుపులు వింతగా తోచేవి.  రాయలసీమలో తండ్రిని అప్పా అని పిలుస్తారని గౌరవ వాచకంగా అందరినీ అప్పా అంటారనీ అప్పుడుతెలిసింది.
అప్ప అనే తెలుగు పదం నిజానికి తల్లి తండ్రులకిద్దరికీ వర్తిస్తుంది.  అందుచేత భేదం సూచించడానికి తండ్రిని అప్పడు అనీ తల్లిని అప్పఅనీ  అనాలి..  లోకంలో అందరికీ తండ్రి అయిన శ్రీ వేంకటేశ్వరుని గురించి అప్పడిని కనుగొంటిఅంటారు శ్రీ అన్నమాచార్య. అయితే లోక వ్యవహారంలో తరువాతికాలంలో డు వర్ణం జారిపోయి అప్ప అనే పిలుపు మిగిలి ఉంటుంది. మా ఉత్తరాంధ్రలో మగవారి పేర్లకి అప్పడనీ అడవారి పేర్లకి అప్ప అనీ తగిలించి వ్యవహరించడం నేటికీ ఉన్న ఆచారమే . మారిషస్ లో తెలుగు మాట్లాడే వారి సంఘానికి అధ్యక్షుల పేరు శ్రీ రామస్వామి అప్పడు. చూడండి ఎన్నో తరాల క్రిందట దేశాంతరాలకు  తరలి పోయిన తెలుగు వారు మన సంస్కృతినీ ఆచార వ్యవహారాలనీ కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుతున్నతీరు.మాతృభూమిలో నివశిస్తున్న తెలుగు వారు    ఇది సిగ్గు పడాల్సిన విషయం. ( నాజూకు పేర్లు, అసలు అర్థమే లేని పేర్లు పెట్టుకోవడం మొదలయ్యాక  అప్పలూ అయ్యలూ మూర్తిలూ రావులూ  శర్మలూ శాస్త్రిలూ ఎక్కడా కనిపించడం మానేశారు. ఇప్పుడు పిలుపులగురించి మాట్లాడుకుంటున్నాం కనుక పేర్లగురించి మరోసారి).
                                                         మా చిన్నప్పుడు ఇంటిపేరుకి ప్రాధాన్యం ఉండేది. తోటి పిల్లలు బళ్లోకి వెళ్తున్నప్పుడు ఒరే పంతులా బళ్లోకి రారా అంటూ ఇంటిపేరు  పెట్టి కేకేసేవారు ఇలా ఇంటిపేరుతో పూర్తిగా వ్యవహరిచడం వల్ల మనకి తెలియని ప్రదేశాల్లో కూడా మన బంధువులని గుర్తించడానికి అవకాశం ఉండేది. ఇంటిపేరుని పొడి అక్షరాలకి పరిమితం చేసుకుని ఈ అవకాశాల్ని చెయిజార్చుకున్నాము.
యుక్త వయసులో స్నేహితులందరం ఒకరినొకరు గురూ..గురూ.. అని పిల్చు కోవడం తమాషాగా ఉండేది. పెద్దగా పరిచయం లేని వారిని పలకరించాల్సి వస్తే మాస్టారూ అని పిలవడం ఆనవాయితీ...( అవతలివారు ఉపాధ్యాయవృత్తిలో లేరని తెలిసినా సరే)
 భారత దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్లలో అందరినీ వరసలు పెట్టి పిలుచుకునే సదాచారం ఒకటి ఉంది. పల్లెటూళ్లలో అది నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. పిన్నిగారూ అనో అత్తయ్యగారూ పక్కింటావిడని పిలిచిన కొత్తకోడలు  వెంటనే వారికి ఆత్మీయురాలై కూర్చుంటుంది. పరాయి మగాళ్లందరినీ అన్నా అని పిలుచుకునే ఆడవారూ, పరాయి స్త్రీలనందరినీ అక్కాఅనో చెల్లెమ్మా అనో పిలుచుకునే సంస్కృతి ఎంత గొప్పదో కదా?                                                                           అయితే పాత కాలంలో అన్నీ మంచి ఆచారాలే ఉండేవా? అంటే లేదనే చేప్పాలిమంచి గతమున కొంచేమేనోయ్ అన్నాడు శ్రీ గురజాడ. రోజుల్లో భార్యని పేరు పెట్టి పిలవడంకూడా తప్పే. అసే, ఒసే, ఏమేవ్ అని పిలుచుకునే వారు. వేసిన తలుపు తీయమనడానికి కూడా తలుపు..తలుపు..అంటూ తలుపు తట్టేవారు. తలుపు తీయడం కాస్త ఆలస్యమయితే నోరు పారేసుకునే వారే గాని పేరు పెట్టి పిలిచిన పాపాన పోయేవారు కాదు. ఇప్పటికీ  ఉత్తర హిందూ స్ధానంలోని ఛాందస కుటుంబాలలో భార్యని ఏ బబ్లూకీ మా అనో పిలుస్తారు తప్ప భార్యపేరు ఉచ్చరించరు.
దేశంలో విద్యాసంస్కారాలు పెరిగాక  ఈమొరటుదనం తగ్గి  చక్కగా భార్యలను వారి పేర్లతో పిలుచుకుంటున్నారుమొగుడు పేరు ఉచ్చరించడానికి సిగ్గు పడే భార్యలిప్పుడిప్పుడు వారిని వారి పేర్లతో పిలుచుకుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉందితమను తాము మరీ నవనాగరీకులమనుకునే భామలు  భర్తల్ని అరే ఒరే అనికూడా అంటున్నారు.   చిన్నప్పుడు ......ఉన్నప్పుడు రాకొట్టడంపాడియేమో గాని నలుగుర్లో ఉన్నప్పుడు ఆపిలుపులు భావ్యమా అన్నది వారికి వారు వేసుకో వలసిన ప్రశ్న
 బాల్యమిత్రులు అరే ఒరే అని పిలుచుకోవడం పాడి. తెలంగాణాలో పిల్లలు రాబే..పోబే.. అనుకుంటారు. చిన్న పిల్లలు కలిసి మెలిసి ఉండేవారు  ఇలా పిలుచుకోవడంలో తప్పు పట్టాల్సిన పనేమీ లేదు. కాకపోతే కొత్తవారిని ఏ విధంగా సంబోధిస్తున్నారో గమనించి వారికి బుధ్ది చెప్పాల్సిన అవసరం ఉంది. యౌవనంలో మిత్రులైన వారు ఓయ్ అని పిలుచుకోవడం అలవాటే.. మరీ పెద్దయ్యాక మిత్రులైన వారు మీరు తమరు అనుకోవడం మరియాద.
బెంగాలీ వారు గౌరవ సూచకంగా మహాశయ్ అని సంబోధిస్తారు. తెలంగాణాలో నీ బాంచన్ కాల్మొక్త అనే పేదవారుకూడా ఎంతవారినైనా నువ్వు అనే సంబోధిస్తారు. ధీనిని అపార్థం చేసుకోవలసిన పని లేదు.ఇక్కడి సంఘం ఆమోదించిన  పిలుపది.
(ఇంగ్లీషు వారి You లాగా).
మన సినిమాల్లోకూడా పాత రోజుల్లో పాటల్లో రావే ప్రేమలతా.. అనో రావె రాధారాణీ.. అనో ఓహో జవరాలా అనో అందంగా పిలుచుకునే వారు. ఈ రోజుల్లో విద్యావంతులైన హీరో హీరోయిన్లుకూడా  “ రాయె రాయె అని పాడు కుంటున్నారు.  ఈ సంబోధనలలోని ఔచిత్యం ఆ సినిమా రచయితలూ దర్శకులే చెప్పాలి.

ఇద్దరు వ్యక్తుల మధ్య వారికున్న చనువును బట్టి వారి ఏకాంత సంభాషణలలో పిలుపులు ఎలాగున్నా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం హుందాగానూ పరస్పరగౌరవాభిమానాలను వ్యక్తపరిచేవిగానూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఆ సమాజం నాగరిక సమాజం అనిపించుకుంటుంది. మానవ సంబంధాలు పరిమళిస్తాయి.
సెలవు..