17, డిసెంబర్ 2011, శనివారం

నాలుగు సంస్కృత శ్లోకాలూ.....పుంజీడు తెలుగు కందాలూ...

 ( ఒక నాలుగు ప్రసిధ్ధమైన సంస్కృత శ్లోకాలను తెలుగులో కంద పద్యాలలో చెప్పాను. చిత్తగించండి.)
మూలం:
అసారే  ఖలుసంసారే సారం శ్వశుర మందిరం,
హిమాలయే హరశ్శేతే, హరిశ్శేతే మహోదధౌ

ఈశ్వరుడా హిమగిరిని,
మేశ్వరుడా పాలకడలి మేడలు  కాగా
శాశ్వత నివాస ముండిరి
ఆ శ్వశురుల గృహ సుఖముల నాస్వాదిస్తూ 
(తెలియని వారికోసం- శ్వశురుల గృహములు అంటే మామగారిళ్లు. అచ్చతెలుగులో చెప్పాలంటే-- అత్తారిళ్ళు)


మూలం:
గజానాం మంద బుధ్ధిశ్చ  సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్


అజగరములు అతి నిద్రయు
గజరాజులు మందబుధ్ధి కలిగియు నుంటన్
ద్విజుల లోని అనైక్యత
సుజనుల కుపకారమనుట సూనృత మేగా   
(తెలియని వారికోసం-- అజగరములు అంటే కొండ చిలువ వంటి పెద్ద పాములు)
             
మూలం:
అతి పరిచయాదవజ్ఞా సంతత గమనాదనాదరో ఙవతి
మలయే భిల్ల పురంధ్రీ చందన తరుకాష్ట మింధనంకురుతే
   
అతి సామీప్యమనర్థము
అతి విలువైనట్టి  మంచి గంధపు చెట్లన్
మతియింపక మలయాద్రిని
అతివలు వంట చెరకుగను వాడెదరకటా     
                                          
మూలం:
దుర్జన పరిహర్తవ్యో విద్యయా2లంకృతో2పిసన్
మణినా భూషిత సర్ప కిమసా నభయంకరం

తోరపు మణి యున్నదనుచు
క్రూరపు మిన్నాగు దరికి కూడదు పోవన్
చేరిన కాటేయగలదు
దూరముగానుండవలయు  దుష్టులకెపుడున్            

సెలవు.