15, అక్టోబర్ 2012, సోమవారం

శ్రీరాముడు నడచిన దారుల్లో...


.
గడచిన రెండు పోస్టుల్లో  శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడో, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు కొన్నిఎప్పుడెప్పుడు జరిగాయో తేదీలతో సహా తెలుసు కున్నాం. శ్రీ రామ చరిత్రలో అతిముఖ్యమైనదీ సుదీర్ఘమైనదీ ఆయన చేసిన వనవాసం. పితృవాక్య పరిపాలనా కర్తవ్యదీక్షా కంకణధారుడై ఆయన తన 25వ ఏట ప్రారంభించి తనకు 39 ఏళ్లు వచ్చే వరకూ వనసీమలలోనే సంచరించాడు.శ్రీ రాముడు మనదేశంలో ఎంతోమందికి ఆరాధ్యదైవం కావడానికి ఆయన శూరత్వమే కాకుండా ఈ ధర్మ దీక్షయే ప్రధాన కారణం. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన అయోధ్యలో ప్రారంభించి దక్షిణాదిన రామేశ్వరం వరకూ ప్రయాణం చేశాడు.ఆతరువాత సేతు నిర్మాణం గావించి లంకలో రావణ సంహారం చేసాడు.ఇంత కాలం పాటు ఆయన ఏయే చోట్ల తిరిగాడో తెలుసు కోవాలంటే మనం కూడా ఆయన నడచిన దారుల్లోనే ప్రయాణించి ఆయన అడుగు జాడలేమైనా గుర్తించగలమేమో చూడాలి. నాతో రండి. ఆయన నడచిన దారుల్లోనే మనమూ ప్రయాణించి వద్దాము.
శ్రీ రాముడు తన వన వాస సమయంలో ఏఏ ప్రాంతాలలో తిరిగాడో తెలుసుకోవడానికి Dr.రామావతార్ గారు మొదలైన పరిశోధకులు చాలామంది రామాయణంలో శ్రీ వాల్మీకి వర్ణనలు ఆధారంగా అయోధ్య నుంచి రామేశ్వరం వరకూ విస్త్రృతంగా పర్యటించారు.ఆయాప్రాంతాలలో ప్రజలలో ఉండే ఐతిహ్యాలనూ ఇతర ఆధారాలనుబట్టి వారు మొదట 189 ప్రాంతాలనూ తరువాత మరోక 60 ప్రదేశాలనూ కనుగొన్నారట.ఈ వివరాలన్నీ శ్రీ రామావతార్ గారి  “శ్రీ రాముని అడుగు జాడల్లో  (In the foot steps of Shri Ram)
అనే పుస్తకంలో వివరించారు. 
శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యనుంచి బయలుదేరి మొదట అక్కడికి 20 కిలో మీటర్లు దూరం లోని తమసానదీ తటాన ఉన్న మాండా (Mandah) అనే ప్రాతాన్ని చేరుకున్నారు.ఆ తరువాత గోమతీ నదిని దాటి సరయూ తీరాన్ని చేరుకున్నారు. ఆతరువాత తమ కోసల దేశపు సరిహద్దులుదాటుతూ నిషాద రాజైన గుహుని సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు 20 కిలో మీటర్ల దూరంలోని నిషాద రాజ్యం లోని శ్రింగవేరపురం (Srigraur) చేరుకున్నారు.ఆ తర్వాత అక్కడనుండి బయలు దేరి త్రివేణీ సంగమ ప్రాంతంలో యమునా నదిని దాటి ఉత్తర-మధ్యప్రదేశ్ ల సరిహద్దుల్లోని చిత్రకూటాన్ని చేరుకున్నారు.ఈ ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమం,మాండవ్య ఆశ్రమం,భరత్ కూప్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి. శ్రీ రామ పాదుకల్ని తీసుకు వెళ్లడానికి భరతుడు వచ్చివెళ్లాక వారు చిత్రకూటాన్ని వదలి మధ్యప్రదేశ్ లోని సతానా ప్రాంతంలో ఉన్నఅత్రి ఆశ్రమాన్ని చేరుకున్నారు.ఇక్కడనుండి శ్రీ రాముడు ఇప్పటిమధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న దండకారణ్యాన్ని చేరుకున్నారు.
దండకారణ్యంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై దాదాపు పది సంవత్సరాలు విహరించాడు.ఈ అరణ్యంలోని నదీనద తటాకాలు ఫలవృక్షసంపద వారినంతగా ఆకర్షించాయేమో? సత్నా ప్రాంతంలోని శర్భంగ, సుతీక్షణ మున్యాశ్రమాలను దర్శించుకుని నర్మదా మహానదీ తీరాల వెంబడి ప్రయాణిస్తూ అనేక మైన ఇతర మున్యాశ్రమాలను దర్శించుకుని వారు తిరిగి సుతీక్షణ ముని ఆశ్రమానికి చేరుకున్నారు.ఇప్పటికీ పన్నా, రాయపూర్,బస్తర్, జగదల్ పూర్ ప్రాంతాలలో మాండవ్య ఆశ్రమం, శ్రింగి ఆశ్రమం, రామలక్ష్మణ మందిరం కోటిమాహేశ్వర దేవాలయం వంటివి ఆ స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. ఆ తరువాత అనేకమైనచిన్న చిన్న నదులూ వాగులూ సరస్సులూ కొండలూ దాటుకుంటూ శ్రీ రాముడు నాసిక్ ప్రాంతం లోని అగస్త్యముని ఆశ్రమం చేరుకున్నాడు.ఇక్కడి అగ్ని శాలలో తయారైన అనేకమైన శస్త్రాలను అగస్త్యుడు శ్రీరామునికి ఇచ్చాడని వాల్మీకి పేర్కొన్నాడు.
అగస్త్యాశ్రమం నుంచి బయల్దేరిన శ్రీ రాముడు నాసిక్ సమీపం లోని పంచవటి చేరుకున్నాడు.ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలుండడం వల్ల  ప్రదేశానికా పేరు వచ్చింది.శూర్పణఖ వృత్తాతం, ఖరదూషణుల వధ జరిగిన ప్రాంతమిదే.(ఖరదూషణుల వధ క్రీ.పూ 5077 5077 అక్టోబరు 7 వ తేదీన జరిగిందని ఇంతకుముందే చెప్పుకున్నాం). ఈ ప్రాతంలో మారీచ వధ జరిగిన చోట మృగయాధీశ్వర్ వనేశ్వర్ అనే స్మృతి చిహ్నాలిప్పటికీ ఉన్నాయి. నాసిక్ పరిసరాల్లో రామాయణ గాథకు సంబంధించిన స్మృతి చిహ్నాలు—సీతాసరోవరం రామకుండం,త్రయంబకేశ్వరం, జనస్థాన్ మొదలైనవి అనేకం ఉన్నాయి.సీతాపహరణం జరిగినదీ ప్రదేశం లోనే.సీతాపహరణం తర్వాత దారిలో తననడ్డగించిన జటాయువు రెక్కలను రావణుడు తృంచిన ప్రాంతం నేడు సర్వతీర్థమని పిలువబడుతోంది.ఇది నాసిక్ పట్టణానికి 56 కి.మీ. దూరంలోని తకేడ్ గ్రామం వద్ద ఉంది.
సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన రామ లక్ష్మణులు దారిలో జటాయువు కబంధులను కలుసుకున్నాక దక్షిణంగా పయనిస్తూ ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నారు. ఈ దారిలోనే వారు శబరి ఆశ్రమానికి రావడం, ఆమె ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. ఆ ఆశ్రమమున్న పంపాసరోవర ప్రాంతం నేడు కర్ణాటక రాష్ట్రం లోని బెల్గాం దగ్గరున్న సురేబన్ గా గుర్తించబడింది.ఈ ప్రాంతంలో ఇప్పటికీ రేగు చెట్లు అధికంగా ఉండడం విశేషం.(భక్త శబరి శ్రీ రాముని చేత తను కొరికి రుచి చూసిన రేగు పళ్ళను తినిపించిందన్నది ఐతిహ్యం). ఇక్కడినుండి మంచి మంచి గంధపు చెట్ల వనాలనూ మంచి సరస్సులనూ దాటుకుంటూ  శ్రీ రామ లక్ష్మణులు ఋష్యమూకాన్ని చేరుకున్నారు. ఈ ఋష్యమూకం, కిష్కంధ ప్రస్తుత కర్నాటక బళ్ళారి జిల్లా లోని హంపీ ప్రాంతం.ఇక్కడే వారు హనుమాన్ సుగ్రీవులను కలుసుకోవడం  వారు సీతమ్మ వారి నగలను చూపడం జరిగింది.
ఇక్కడ వాలిని సంహరించిన పిదప శ్రీ రాముడు వానర సేనతో కలసి దక్షిణ దిశగా సముద్రం వైపు ప్రయాణించాడు.మలయ పర్వతాన్నీ గంధపు వృక్షాల వనాల్నీ సరస్సులనూ దాటుకుంటూ కావేరీ తీరం చేరాడు.ఆ తర్వాత తిరుచ్చిరాపల్లి తంజావూరు రామనాథపురాల గుండా రామేశ్వరం చేరుకున్నాడు.
చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణంలో వాల్మీకి  వర్ణించిన ప్రాంతాలన్నీ  భౌగోళికం గా ఇప్పటికీ నిలిచి ఉన్న స్మృతి చిహ్నాలతో సరిగా సరి పోవడం. రామాయణంలో గంగా యమునల సంగమ ప్రాంతం గా చెప్పబడ్డ పరిసరాల్లో (కోల్డిహ్వా, ఝూసీ,హేటాపట్టి లలో) పురాతత్వ పరిశోధక శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రాతం క్రీ.పూ. ఆరు ఏడు వేల సంవత్సరాలనుంచీ జనావాసాలుగా ఉండేవని గుర్తింపబడ్డాయి..త్రివేణీ సంగమ తీరంలో అలహాబాదులోని ఆనంద భవన్ (నెహ్రూ గారిఇల్లు)  కి ఎదురుగా ఉండే ప్రాంతమే నాటి భరద్వాజ ఆశ్రమం. ఇక్కడా శృంగవేరపురాల్లోనూ జిరిపిన త్రవ్వకాల్లో రామాయణ గాథకు సంబందించిన ముఖ్య మైన ఆధారాలు లభ్యమయాయి.
రామేశ్వరం నుంచి లంకకు చేరుకోవడానికి శ్రీ రాముడు సముద్రంపై సేతువు కట్టాడా? లేదా? కట్టి ఉంటే ఎలాగ కట్టేడు? వంటి ఆసక్తి కరమైన విషయాలన్నీ మరో పోస్టులో తెలుసు కుందాం
(శాస్త్రీయమైన పరిశోధనలు చేసి ఈ అమూల్యమైన విషయాలను మనకందించిన I-SERVE,Delhi Chapter  వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ—సెలవు.)
  


8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మన భద్రాచలం రాలేదేన్టండి.
:venkat

Dantuluri Kishore Varma చెప్పారు...

గోపాలకృష్ణగారూ, రాముడు నడచిన దారుల గురించి అద్భుతంగా రాసారు.

అజ్ఞాత చెప్పారు...

చాలా గొప్ప టపా. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

కష్టే ఫలే శర్మ గారికీ, కిశోర్ వర్మ గారికీ అజ్ఞాత గారికీ కృతజ్ఞతలు.అజ్ఞాత గారూ, మన భద్రాచలానికి 500 ఏళ్ళ చరిత్ర కూడాలేదు.అది కంచర్ల గోపన్న శ్రీ రామ భక్తికి ప్రతీక మాత్రమే.

Unknown చెప్పారు...

చాలా అద్భుతమైన విషయాలని వెల్లడిస్తున్నారు. మీకు సదా కృతజ్ఞతలు.

కథా మంజరి చెప్పారు...

chaala bagundandee. meeru chadivina manchi pustakam loni manchi vishayaalanu mato panchu kunnanduku meeku naa dhanyavadaalu.

www.apuroopam.blogspot.com చెప్పారు...

పంజో గారికీ,రాజారావుగారికీ కృతజ్ఞతలు.

Lakshman .M. V. చెప్పారు...

చాలా బాగుంది. మంచి విషయం చెప్పారు. మొత్తంమీద శ్రీ రాముడు మన తెలుగు నేల కి రాలేదన్న మాట!