27, డిసెంబర్ 2012, గురువారం

మన తెలుగు భాష చిరంజీవి..


.
ఈ మధ్య మన బ్లాగుల్లోనూ, ఇతరత్రా కొన్ని చోట్లా తెలుగు భాష అంతరించి పోయే దశలో ఉందనీ భాషాబిమానులందరం దానిని నివారించడానికి నడుంకట్టుకోవాలనీ  పదే పదే  వ్రాయడం వాపోవడం చూస్తున్నాము.నిజంగా తెలుగు భాష అట్లాంటి అవసాన దశకు చేరుకుందా?  అనతి కాలంలోనే ఇంత మధురమైన మన భాష అంతరించి పోబోతున్నాదా?ఇంతకుముందు లేనిది కొత్తగా వచ్చిన ముప్పు ఏమిటి?ఈ భయాలకు కారణాలేమిటి? కొంచం నిదానంగా పరిశీలిద్దాము.
చాలా మంది చెప్పే ముఖ్యమైన విషయం ఈ తరం యువత ఇంగ్లీషు భాషా వ్యామోహంలో పడి మన తెలుగు భాషని అశ్రధ్ధ చేస్తున్నారని. నేను దీనిని ఇంగ్లీషు వ్యామోహం అనను.ఈ రోజుల్లోయువతకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పని సరి.అది లేక పోతే వారికి మనుగడే కష్టమౌతుంది.నిజానికి పల్లెటూళ్లలో చదువుకుని వచ్చే యువకుల్లో చాలా మందికి ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడడం రాకపోవడం వారికి శాపమే అవుతోంది. వారు పట్టణాల్లోమంచి స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకంటె తెలివైన  వారైనా కూడా ఈలోపం వారికి సరైన అవకాశాలు రాకుండా చేస్తోంది. వారిని కృంగదీస్తోంది.అందుచేత ఇంగ్లీషుని పణంగా పెట్టి              మనతెలుగుని ప్రోత్సహించాలని పూనుకోవడం సరికాదు.అటువంటి ప్రయత్నం ఎన్నటికీ సఫలం కానేరదు.ఇంగ్లీషుకివ్వాల్సిన సముచిత స్థానం ఇస్తూనే మన తెలుగు భాషాభివృధ్ది ఎలా చేయగలమో ఆలోచించుకోవాలి. కొంతమంది ఇంగ్లీషు స్థానంలో తెలుగును ప్రథమ భాషగా చేయాలనీ  విద్యాలయాల్లో తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి చేయాలనీ సూచిస్తున్నారు. ఇదీ సమంజసమైనది కాదు.ఈ రోజుల్లో అనేక ప్రాంతాలకు చెందిన వారు అనేక భాషలు మాట్లాడే వారు ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో దేశం నలుమూలలా విస్తరించి ఉన్నారు.ఎక్కడెక్కడనుంచో వచ్చిన ఇతర ప్రాంత విద్యార్థులను తెలుగు తప్పని సరిగా నేర్చుకోవాలనడం సమంజసం కాదు. మన తెలుగు పిల్లలే వేరే రాష్ట్రాలలో చదువుకోవలసి వచ్చినప్పుడు అక్కడి భాష నేర్చుకు తీరాలంటే ఎంత కష్టమో ఊహించుకుంటే ఈ వాదనలోని అసమంజసత్వం బోధ పడుతుంది.తెలుగు రెండవ భాషగా ఎక్కువమంది నేర్చుకోవడం అభిలషణీయమే అయినా,విద్యార్థులకు కలిగించే కష్టాలను దృష్టిలో పెట్టుకుంటే  నిర్బంధం మంచిది కాదని చెప్పక తప్పదు.
భాషాభిమానులైన మరికొందరు మిత్రులు బాధ పడే విషయం తెలుగు మాట్లాడే వారు తరచుగా ఎక్కువగా ఇంగ్లీషు పదాల్ని కలిపి మాట్లాడడం.దీనికి అనేకమైన కారణాలున్నాయి.
ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లోనూ వెలసిన టీవీల్లో స్వఛ్ఛమైన తెలుగు స్థానంలో కలగా పులగపు తెలుగింగ్లీష్ వినిపించడం ఒక కారణం.బళ్లో చేరక ముందునుంచే టీవీ చూడడంనేర్చుకున్న ఈ కాలం పిల్లలు దానినే నేర్చుకుంటున్నారన్నది సత్యం.తెలుగు భాష పట్ల తమకున్న బాధ్యతను టీవీ ఛానెళ్లు విస్మరిస్తున్నాయని చెప్పక తప్పదు. చక్కటి తెలుగు మాటలు చెప్పగలిగే చోట కూడా వారు తమ ప్రసారాల్లో ఇంగ్లీషుని జొప్పిస్తున్నారు.( మన ప్రసార మాధ్యమాల నిర్లక్ష్యాన్నిగురించి చెప్పాలంటే ప్రత్యేక వ్యాసమే వ్రాయాల్సి ఉంటుంది).
పాత రోజుల్లో, స్త్రీలు ఉద్యోగాలు చేయకుండా బయట తిరగకుండా ఉండే రోజుల్లో వారి నోటంట స్వఛ్ఛమైన తెలుగు భాష నుడికారంతో పాటు వినిపించేది. అందువల్ల పిల్లలకూ చక్కటి తెలుగు మాట్లాడడం వచ్చేది.కాని ఈ రోజుల్లో స్త్రీలూ చదువుకుని ఉద్యోగాలు చేస్తుండడంతో  వారి భాషలో కూడా ఇంగ్లీషు పదాలు జొరబడ్డాయి.అందువల్లనే వారు పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇంగ్లీషు పదాలు దొర్లడం అవి పిల్లలకు ఒంటబట్టడం జరిగి పోతున్నాయి. పాతకాలంలో పిల్లలకు అయిదేళ్లు దాటే వరకూ బడిలో వేయకుండా ఇంట్లోనే ఉంచే వారు.ఆసమయంలో వారికి ఇంటిలో పెద్దలు తెలుగు పద్యాలో పాటలో నేర్పించేవారు. ఆ తర్వాత కూడా  వారు చదువుకున్నది తెలుగు బళ్ళలోనే.మరి ఈ రోజుల్లో పిల్లలకు 3 సంవత్సరాలు నిండకుండానే కాన్వెంటు బడుల్లో వేసి, వాళ్లు వచ్చీరాని ఇంగ్లీషు రైమ్స్ చెబుతుంటే మురిసి పోతున్నాము. ఇది ఇంటింటి కథే. మనకి భాషాభిమానం ఉంటే పిల్లలకు చిన్న చిన్న శతక పద్యాలు  ఇంట్లోనే నేర్పించాలి.తెలుగు పద్యాల్లోని మాధుర్యంవారికి ఆ విధంగా ఒంటబడితే పెద్దయ్యాక వారు తప్పకుండా సాహితీ ప్రియులౌతారు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే-తెలుగులో అసలు అన్యభాషాపదాలు చేరకూడదని అందువల్ల తెలుగు మైల పడిపోతుందని భావించడం పెద్ద పొరపాటు. కవులూ భాషాభిమానులూ,రచయితలూ, పాత్రికేయులూ, టీవీల వారూ ఇంగ్లీషు భాషని వీలయినంత పరిహరించి చక్కటి తెలుగు పదాలనే వాడుతూ ఉండాలి. ఆ విధంగా వాడుకలో ఉన్న తెలుగు మాటలు మూలబడిపోయి వాటి స్థానంలో ఇంగ్లీషు పదాలు చోటు చేసుకోకుండా వారు భాషాసేవ చేయవచ్చును. కానీ జన సామాన్యం నిత్య వ్యవహారంలో ఇంగ్లీషు పదాలు దొర్లకుండా మాట్లాడాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది.దీనిని పూర్తిగా ఆపలేము.
ఇవాళ ఇది తెలుగుకి కొత్తగా వచ్చిన ముప్పుకాదు.అధికారంలో ఉన్న భాషల ప్రభావం మిగిలిన భాషల మీద పడడం సర్వత్రా సర్వకాలాల లోనూ ఉన్నదే. తెలుగు భాషకు పెద్ద దెబ్బ సంస్కృతం తోనే వచ్చింది.అదీ ఈ మధ్యన కాదు. వెయ్యేళ్ల కిందటే.ఇవాళ మన తెలుగుభాషలో మన పదకోశాల్లో ఉన్నవి ఎనభై శాతం సంస్కృత పదాలే.నన్నయ మొదలుకొని మన తెలుగు కవులందరూ సంస్కృత  సమాస పద భూయిష్టమైన కవిత్వమే చెప్పారు.రాజాశ్రయం తప్ప వేరే మనుగడలేని పరిస్థితుల్లో అది వారికి తప్పని సరై ఉండవచ్చు. అటువంటి కవిత్వం రాజ్యమేలుతున్నప్పుడు అచ్చతెలుగు కావ్యాలు కనుమరుగవడంలో ఆశ్చర్యమేముంది. 
ఈ రోజు మనకు అచ్చతెలుగు కావ్యాలు చదివితే అర్థంకాని పరిస్థితి నెలకొంది.మంచో చెడో గడచిపోయిన దానిని గురించి విచారించడం (గతజల సేతుబంధనం) నిష్ప్రయోజనం.
సంస్కృతమే కాదు పార్శీ ఉర్దూ పదాలు కూడా మన బాషలో లెక్కకు మిక్కిలిగా చేరాయి.తన కాలంలో జన బాహుళ్యంలో వాడుకలో ఉన్న అనేకమైన పార్శీ  ఉర్దూ పదాలను  శ్రీనాధ మహాకవి నిస్సంకోచంగా ధారాళంగా తన కవిత్వంలో ప్రయోగించాడు.అలాగే మరికొందరు కవులు కూడా. మన తిరుపతి వేంకట కవులు కూడా అన్య దేశ్యాలను (ఇంగ్లీషు పదాలను)  తమ కవిత్వంలోవాడడానికి వెనుదీయ లేదు.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంత మంది ఇంకా ఛాందసంగా కొత్తగా వచ్చి వాడుకలో ఉన్న పరికరాలకు కూడా జనానికి అలవాటైపోయిన ఇంగ్లీషు పేర్లను పరిహరించి తెలుగు పేర్లను సృష్టించి వాడుక లోకి తేవాలని తాపత్రయపడడం, ఆచరణ యోగ్యం కాని ప్రయత్నాలు చేస్తుండడమే.ఇంగ్లీషు మాటలనే మన భాష పధ్ధతిలో అజంతాలుగా మార్చుకుని వాటిని మన తెలుగు పదాలు గానే భావించి స్వీకరించడమే ఉత్తమ పధ్దతి.ఇది నా మాట కాదు. ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు  తెలుగు, ఇప్పటి –భవిష్యత్ అవసరాలను తీర్చే ఆధునిక భాషగా ఎదగాలంటే – సాంకేతిక పదాలను అన్ని భాషలనుంచీ తీసుకుని విస్తృతంగా వాడాలి అన్నారు. ఇంగ్లీషు ప్రపంచ భాషగా ఎదిగిన తీరు అదే.మనం మాత్రం మడిగట్టుక్కూర్చుని ప్రయోజనం లేదు.మనభాష మౌలిక స్వరూపం చెడగొట్టకుండా అవసరమైన అన్యదేశ్యాలను తెలుగు ఉచ్చారణకి అనువుగా మలచుకుని వాడుకో వచ్చు. చిన్న ఉదాహరణ చెబుతాను.మన టీవీ ఏంకర్లు వారికి ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ నుండి కాల్చేస్తున్నారు?” అంటూ ఉంటారు.ఈ కాల్చడం ఎక్కడినుంచి వచ్చింది? ఈ కాన్వెంటు చదువుల అమ్మాయిలు అలా మాట్లాడితే తప్పు అర్థం వస్తుందని సరిదిద్దే వారే ఆ ఛానెళ్లలో లేరా? మీరు ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు?” అనో కనీసం ఎక్కడినుంచి ఫోను చేస్తున్నారు?” అనో అనవచ్చుకదా.మరీ చాదస్తానికి పోయి ఫోను అనే మాటకు శబ్దగ్రహణ యంత్రం అని అనాలని పట్టుబడితే అసలుకే మోసం వస్తుంది. అలాగే ఏంకర్ అనే పదానికి ప్రత్యామ్నాయం వెదుక్కోవడం కూడా. అర్థ శతాబ్దం కిందట, సరదాకే అనుకోండి, తన డిటెక్టివ్ నవల ఒకదానిలో Hearing Aid అనే పరికరానికి విన వీలు పరికరము అని వాడాడు ఆరుద్ర.తెలుగు దేశంలో ఎవరైనా దానిని ఆ పేరుతో పిలవడం ఎన్నడైనా చూడగలమా?కిందటి ఉగాది నాడు ఒక టీవీ ఛానెల్లో కవి వెన్నెలకంటి గారు కంప్యూటర్ కి అన్నీ అని నామకరణం చేస్తున్నానన్నారు.ఇది ఎన్నడైనా వాడుకలోకి వస్తుందా?  భేషజాలకు పోకుండా ఆ ఆంగ్ల పదాలనే మన ఉచ్చరించే రీతిలో వ్రాసుకోవడం ఉత్తమం కదా?
ఈవిధంగా చేస్తే తెలుగు భాషకు ఇప్పట్లో వచ్చే ముప్పేమీ లేదు.ఇంత విశాలమైన భారత దేశంలో హిందీ తరువాత అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే తెలుగు భాష  కనుమరుగైపోయే అవకాశాలు దాదాపు మృగ్యం. తెలుగు భాష ఇప్పుడున్నట్లే ఉండక పోవచ్చు. ఉండదు కూడా.ఏనాడూ వాడుక భాష ఒకే రూపంలో ఉండదు.ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.ఇది వరలో కూడా అలాగే జరిగింది.(దీనిని గురించి మరెప్పుడైనా వివరంగా వ్రాస్తాను). మార్పులూ చేర్పులూ జరిగినా మన భాష మరణించదు. దానికి కారణం మన భాష విస్తారమైన ప్రదేశంలో ఎక్కువ మంది మాట్లాడడమే కాదు, మన ఆంధ్ర దేశం ముప్పాతిక మువ్వీసం గ్రామీణ ప్రాంతంతో అలరారుతోంది.మన పల్లెటూళ్ళు, రైతాంగం, పచ్చగా ఉన్నన్నాళ్ళు తెలుగు బావుటా ఎగురుతూనే ఉంటుంది. మనతెలుగు భాష చిరంజీవి.
ఎనీ డౌట్స్?


















                                                                                                                                                                    

21, డిసెంబర్ 2012, శుక్రవారం

తడీ...పొడీ... మడీ...


తడీ..పొడీ..మడీ..
ఈ మూడూ మూడు పొడి ముక్కల లాగే కన్పిస్తున్నా వీటిల్లో చాలా అర్థముందండోయ్.తడిగా అంటే నీటిలో తడిసిన లేక చెమ్మగా ఉందనేది మామూలు అర్థమైతే దీన్ని వేర్వేరు చోట్ల వేర్వేరుగా ప్రయోగించవచ్చు.మచ్చుకు  కంట తడిపెట్టడం అంటే కన్నీరు కార్చడం.ఇది మనకు కలిగిన బాధ వల్లనో ఇతరుల బాధకు మన ప్రతిస్పందనో అయి ఉంటుంది. అదే గుండె తడి అంటే ఎవరి బాధకో మన మనస్సుకరిగి పోవడమన్న మాట.
పొడి అంటే పప్పులు మొదలైన వాటిని బాగా దంచితే వచ్చే పదార్థం. మిరప పొడి కందిపొడి మొదలైనవి. అయితె పొడిగా ఉంది అన్నప్పుడు ఈ అర్థమే కాకుండా తడిగా లేకుండా ఉందనే అర్థం కూడా వస్తుంది.
మరి మడి అనే మాటకి ఈ రెండింటితోనూ సంబంధం ఉందండోయ్. ఊరికే పొడిగా ఉన్నదేదీ మడి కాదు.ఏదైనా బట్ట మడికి కావాలంటే దానిని తడిపి ఆరవేసి పొడిగా అయ్యేక స్నానం చేసి మడిగా ఉన్న వాళ్లు ముట్టుకుని కట్టుకుంటేనే అది మడి అవుతుంది.తడి బట్ట అయితే మడికి మరీ శ్రేష్టం.
ఈ మడి కాదు కాని మడికి (పొలానికి) నీరు పెట్టడం కూడా తడి పెట్టడమనే  వ్యవహరిస్తారు వ్యవసాయదారులు. రెండు , మూడు తళ్లు (తడికి బహువచనం) పెట్టామంటారు.
ఇవన్నీ సామాన్యార్థాలే . వీటి విశేషార్థాలు చూడండి. తడి అనే దానికి ఎలాగొచ్చిందో కాని డబ్బు అనే అర్థం కూడా అది సంతరించుకుంది. దీన్ని కొంచెం వివరిస్తాను.
ఆఫీసుల్లో మన పని జరగాలంటే ఎవరినో ఒకరిని తడిపితే కాని మన పని జరగదంటారు.ఇలా అన్నారు కదా అని మనం అమాయకంగా వారికి జలాబిషేకం చేస్తే అంతే సంగతులు.అసలుకే మోసం వస్తుంది. ఇక్కడ తడపడమంటే ఆమ్యామ్యా లివ్వడమన్న మాట. లంచమనే పదానికి ప్రత్యామ్నాయంగా ఈ ఆమ్యామ్యా అన్న పదం అందాల రాముడు సినిమాలో అల్లు వారి నోట్లోనుంటి వచ్చి ఆంధ్ర దేశమంతా అల్లుకుంది. లంచం కావాలంటూ బహిరంగంగా అడగలేక నీళ్లునములుతూ మాట్లాడినట్లు వినిపించే ఈ పదం ముళ్లపూడి వారి అపూర్వ సృష్టి.అదలా ఉంచి దీనికి తడపడమని ఎందుకు పేరు వచ్చిందో చెబుతాను. మన సంస్కృతిలో ఏ దానమైనా ఇచ్చేటప్పుడు దాత గ్రహీత చేతిలో నీళ్లు పోసి ఇవ్వడం ఆచారం.అఖరుకు కూతుర్ని అల్లుడికి కన్యాదానం చేసినప్పుడు కూడా కాళ్లు కడిగి కన్య ధార పోస్తాము.(అంతే కాదు ముందు మాట్లాడుకున్నవన్నీ ఇచ్చి వరుని తండ్రి చేతులు తడిపితే కాని ఆ మూడు ముళ్లూ పడవు) పెళ్లితంతు ముగిసే ముందు పిల్లని అత్తవారింట్లో అందరికీ పేరు పేరునా ఒప్పజెప్పినప్పుడు కూడా కన్యాదాతలు తమ చేతులు పాలలో ముంచి అవతలివారి చేతులకి తాకించి  వారి చేతులు తడిచేసి( వారికి బట్టలూ గట్రా పెట్టి) మరీ అప్పజెప్తాము.ఈ విధంగా మన సొమ్ము ఇతరులకి దానం చేసినప్పుడు వారి చేతులు తడపక తప్పదు. ఈ ఆచారం వల్లనే లంచం సొమ్ము ఇవ్వడానికి కూడా తడపడమనే రూఢ్యార్థం వచ్చింది. ఇలా లంచం పుచ్చుకోవడానికి ఇష్టపడని వాడిని మరీ మడికట్టుక్కూర్చున్నాడంటారు.ఇవ్వమని మనం మడికట్టుక్కూర్చున్నా పనులు అవవు.ఇంట్లో అయితే ఏ పనీ చేయడానికి ఇష్టం లేక పోతే మడికట్టుకుని హాయిగా ఓ మూల కూర్చోవచ్చు.
తడి అనే దానికి డబ్బుతో ఉండే లింకేమిటో   ఒ ముచ్చట చెబుతాను వినండి.
ఒక రోజు నేను ఏదో ఊరికి వెళ్తూ స్టేషనులో ఆగి ఉన్న రైలు ఎక్కి కూర్చున్నాను. రైలు బయలు దేర బోతుండగా ఒక పెద్దామె ఆమె ఇద్దరూ కూతుళ్లూ హడావుడిగా రైలెక్కారు. రైలు సాగి పోతుండగా వారి తమ్ముడు రైలెక్కలేదని గమనించిన ఒక అమ్మాయి గాభరా పడింది. ఇంకో పెట్లో ఎక్కి ఉంటాడు లేవే అంది రెండో ఆమె. గాభరా పడుతున్న అమ్మాయి వాడి దగ్గర సెల్లుంది కదా. ఫోన్ చేయవచ్చుకదా అంది. దానికి వాళ్ళమ్మ ఆడి సెల్లో తడుందో నేదో అంది.( వాళ్లు మా విశాఖ పట్నం వేపు వాళ్లు). నా పక్కన కూర్చున్న అబ్బాయి సెల్లులో తడేమిట్రా తడిస్తే సెల్లు గతి అంతే కదా అని విస్తు పోతుంటే, అంతకు ముందు అలాంటి మాట విని ఉండక పోయినా సంగతి అర్థమైన వాణ్ణి కనుక ఇక్కడ తడి అంటే సెల్లులో బాలన్సు అని విడమరిచి చెప్పాను.
ఇంక తడిలో ఎంత డబ్బుందో బాగా ఎరిగిన వారు మన సినిమా వారు.అవసరం ఉన్నా లేక పోయినా వాన పాటల్లోనూ, స్విమ్మింగ్ పూల్లోనూ హీరోయిన్ను తడిపి తడిపి తమను తాము కనక వర్షంలో తడుపు కుంటారు.హీరోయిన్సు ఎంత తడిస్తే నిర్మాత కంత డబ్బన్న మాట.
తడికీ పొడికీ ఉన్న తేడా గ్రహించేరుగా. తడి అంటే డబ్బే కాదు.ప్రేమా అభిమానమున్నూ. ఇవి ఉన్న చోటే ఆర్ద్రత ఉంటుంది. మనకిష్టం లేని వారొస్తే రెండు పొడి పొడి ముక్కలు మాట్లాడి పంపించి వేస్తాము కదా.
మన మానవ మాత్రుల సంగతలా వదిలేయండి. ఆ మహాదేవుడికి కూడా మనం తడిపితేనే ఇష్టం.అభిషేకమో  అభిషేకమో అని పలవరిస్తుంటాడట. మంచి తీర్థం కాకుండా పంచామృతాలైతే మరీ మంచిది.మనపై తన కరుణారసవృష్టి కురిపించి మనల్నికూడా తడుపుతాడు. మనకి కూడా అలా తడవడమే ఇష్టం కదా?
ఈ తడీ పొడీ అనే మాటల్ని మహాకవి శ్రీ శ్రీ వేరే అర్థంలో ఎలా ఉపయోగించుకున్నాడో చెప్పి ముగిస్తాను.
మనకు స్వాతంత్ర్యం వచ్చేక కాంగ్రెసు వారు ప్రొహిబిషను అమలు చేస్తూ తనకు మందుదొరక కుండా చేస్తున్నారని చిన్న చురక.
పొడిచేస్తామని చెప్పిన
 మనకాంగ్రెసువారు
తడి రాష్ట్రాలన్నిటినీ
 పొడి చేస్తున్నారు.
(మొదటి పాదంలో పొడిచేయడమంటే ఏదో ఎక్కబొడుస్తామని సాధిస్తామని చెప్పడమైతే నాలుగో పాదంలో పొడి చేయడమంటే ప్రొహిబిషను పెట్టడం. మూడో పాదంలో తడి రాష్ట్రాలంటే ప్రొహిబిషను అమలు లో లేని రాష్ట్రాలన్నమాట.మందు దొరకని కసిలో మహాకవి ఇలా శ్లేషించాడన్నమాట.)
                                                  ***

   

19, డిసెంబర్ 2012, బుధవారం

ఎవరీ బుడతకీచులు? వారితో మనకేఁవిటి సంబంధం?



బుడత కీచులనగానే ఉడతల్లాంటి ఏవో చిన్ని జంతువులై ఉంటాయనిపించవచ్చు. కాని కాదు. బుడతకీచులని తెలుగువారు ముద్దుగా పిలుచుకునే  వారు మనుష్యులే. వారితో మన సంబంధం తెలుసుకునే ముందు ఈ కథ వినండి.
                                                *****
యూరపు ఖండం నైరుతి దిశలో ఐబీరియా ద్వీప కల్పం పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాని కెదురుగా ముఫ్ఫై ఐదు వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఐదు వందల మైళ్ల సముద్ర తీరంతో విస్తరించిన ప్రాంతం ఈ నాడు మనం పోర్చుగల్  అని పిలుచుకునే దేశం. ఓ ఎనిమిది వందల ఏళ్లక్రితం  ఈ పేరుతో ఈ దేశం లేదు. ఐతిహాసిక యుగంలోఈ ప్రాంతానికి లూసితేనియా అని వాడుక. అక్కడ కెల్టు-బాస్కు భాషలు మాట్లాడే అనాగరిక తెగల వారు నివసించేవారు. క్రీ.పూ.3వ శతాబ్దం నాటికి  పరిసర ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం కూడా రోమన్-లాటిన్ భాషలు మాట్లాడే వారి హస్తగతమైంది.ఆతరువాత క్రీ.శ 8వ శతాబ్దిలో ఇస్లాము మతస్థులైన అరబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ప్రాంతాన స్థిర నివాసమేర్పరచుకుని దాదాపు నాలుగు వందలేళ్ళ పాటు అధికారం చెలాయించారు. క్రీ.శ 11, 12 శతాబ్దులలో స్థానికులు హెన్రీ నాయకత్వంలో విజయవంతంగా తిరుగు బాటు చేసి 1143 లో పోర్చుగల్ రాజ్యాన్ని స్థాపించుకున్నారు.
వీరిని పోర్చుగీసు వారని, వీరి భాషను  పోర్చుగీసు భాష అని నేడు పిలుస్తున్నాము. పోర్చుగల్ కి పక్కనే ఉండే స్పెయిన్ దేశానికీ దీనికీ వాస్తవానికి సరియైన భౌగోళిక సరిహద్దులేమీ లేవు.అందు వల్లనూ, స్పానిష్ పోర్చుగీసు భాషలు రెండూ లాటిన్ భాషా శాఖా జన్యములు కావడం వల్లనూ ఈ రెండు భాషలూ మన తమిళ మలయాళ భాషలంత దగ్గర దగ్గర భాషలు. అలాగే ఫ్రెంచి ఇటాలియను భాషలు కూడాదీనికి సోదర భాషలే. పదమూడవ శతాబ్దము ఆరంభం లో పోర్చుగీసు రాజబాషగా అవతరించే వరకూ వరకూ, పోర్చుగల్ లో లాటిన్  భాషే రాజభాషగా చెలామణీ అయ్యేది.
15వ శతాబ్ది నాటికి పట్టుమని పది లక్షల జనాభా లేని అతి చిన్న దేశీయులైన ఈ పోర్చుగీసులు కొత్త కొత్త ప్రాంతాలను కనుక్కోవడంలో చూపించిన చొరవ సాహసాలు అత్యంత ఆశ్చర్యకరమైనవి.పోర్చుగీసు చక్ర వర్తులు ఓడల నిర్మాణానికి కావలసిన కలపని ప్రభుత్వ అడవులనుండి ఉచితంగా ఇచ్చి,ఎగుమతి దిగుమతి సుంకాలను సడలించి,ఆర్థిక సహాయము చేసి, ఉత్తమ బిరుదులిచ్చి అనేక విధాల నూతన రాజ్యాన్వేషణని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే పోర్చుగీసు వారు వాస్కోడ గామా నాయకత్వంలో1498 లో భారత దేశపు పశ్చిమ తీరమందున్న కోజికోడ్ లో అడుగుపెట్టారు.అక్కడ వారికి ఆగర్భ శత్రువులైన అరబ్బుల ప్రతి ఘటన ఎదురయ్యింది.అరబ్బులు అక్కడి రాజైన జామొరిన్ తో సఖ్యంగా  ఉంటూ పోర్చుగీసు వారిని కాలూనుకోకుండా చేయాలని ప్రయత్నించారు. వారిని జయించడానికి, పశ్చిమ తీరంలో స్థిరపడి వ్యాపారం కొనసాగించుకోవడానికీ, వారికి హిందూ మతావలంబులూ పశ్చిమ సముద్ర తీరం వరకూ విస్తరించిన సామ్రాజ్యాధి పతులూ అయిన విజయనగరాధీశుల సహాయం అవసరమైంది. పశ్చిమ తీర ప్రాంతమైన బత్కల్లులో గిడ్డంగిని కట్టుకోవడానికి  రాయల వారి అనుమతిని కోరితే అది అంత తొందరగా వారినుండి లభించ లేదు. ఈ లోగా 1509 లో పోర్చుగీసు నాయకుడైన అల్బూకర్కు, విజయనగరాధీశుని సామంతుడైన తిమ్మోజు అండదండలతో గోవా రేవును స్వాధీన పరచుకున్నాడు. ఆ సంవత్సరం ఒకటి రెండుసార్లు చేతులు మారినా అప్పటినుంచి దాదాపు నాలుగున్నర శతాబ్దాల పాటు(1961 లో భారత దేశంలో విలీనం అయ్యే వరకూ) గోవా ఈ పోర్చుగీసు వారి అధీనం లోనే ఉండింది.పశ్చిమ సముద్ర తీరంలో సహజమైన రేవు పట్టణం కావడంతో గోవాకి ఆ రోజుల్లో విశేషమైన ప్రాముఖ్యం ఉండేది.(మొదట్లో బిజాపుర సుల్తానుల ఏలుబడిలో ఉండిన ఈ పట్టణం ఇమ్మడి హరిహర రాయల కాలం (1375-1404)లో విజయనగర చక్రవర్తుల పాలన లోకి వచ్చింది.కానీ మళ్లా అది  విరూపాక్ష రాయల కాలంలో 1468 లో తిరిగి బహమనీ సుల్తానుల హస్తగతమై వారినుంచి 1509 లో పోర్చుగీసు వారి వశమైంది). దీనితో పాటుగా మెల్ల మెల్లగా పశ్చిమ తీర ప్రాంతంలో ఉండే కీలకమైన రేవు పట్టణాలన్నీ పోర్చుగీసువారు ఆక్రమించుకున్నారు.పాశ్చాత్య సీమలతో వ్యాపారం ఈ రేవు పట్టణాల ద్వారా ముఖ్యంగా గోవా ద్వారా జరుగుతూ ఉండడంతో మన దేశపు రాజకీయాలలో నాడు పోర్చుగీసువారి ప్రాముఖ్యత హెచ్చింది. ఆ రోజుల్లో రాజులు యుధ్ధాలలో పటిష్టమైన అశ్విక దళం ప్రాముఖ్యతను గుర్తించిన వారు కావడం వల్ల  వివిధ దేశాలనుంచి మేలురకం జాతి గుఱ్ఱాల దిగుమతి కొనుగోలు  గోవా రేవు ద్వారా జరుగుతూ ఉండేది. ఈ గోవా విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్న రోజుల్లో మూర్ లనే మహమ్మదీయ వర్తకులు అరబ్బీ పారశీక దేశాలనుంచి మేలుజాతి గుఱ్ఱాలను దిగుమతి చేసుకుని వాటిని మత పక్షపాతంతో బహమనీ సుల్తానులకు మాత్రమే విక్రయించేవారట.కొన్నాళ్లకు ఏరకం గుఱ్ఱాలనైనా విజయనగరం వారికి అమ్మడం మానివేశారట.తన రాజ్యంలో ఉండే రేవులో దిగుమతి చేసుకున్నగుఱ్ఱాలను తన శత్రురాజులకు అమ్ముతున్నారన్న కోపంతో విరూపాక్షరాయలు పది వేలమంది మూరులను చంపించాడట.ఈ ఘోరం జరిగాక బహమనీ సుల్తానులు కొంకణంపై దాడి చేసి గోవాను హస్తగతం చేసుకున్నారు. ఆతర్వాత మళ్లీ అది విజయనగరాధీశుల చేతికి రాలేదు. ఈ బహమనీ సుల్తానులనుంచే పోర్చుగీసు వారు గోవాను 1509 లో స్వాధీనం చేసుకున్నది. పోర్చుగీసువారు విజయనగరం రాజ్యాధీశులతో స్నేహ పూర్వకంగా మెసలుతూ తగిన ఒడంబడికలు చేసుకుని వ్యాపారాబివృధ్ధి చేసుకున్నారు. గోవా విజయనగరాల మధ్య రహదారులన్నీ వర్తకుల బిడారులతో తీర్థ ప్రజలాగా కిటకిటలాడేవట.వ్యాపారంతో పాటు రోమన్ కాథలిక్కు మత ప్రచారం కూడా చేస్తూ ఉండేవారు.   తూర్పు తీరం వరకూ వారి వ్యాపారాలు విస్తరించినా కొంతమంది మదరాసులోని శాంతోము , మైలా పూరుల్లోనూ నాగ పట్టణంలోనూ నివాసాలు ఏర్పరచుకున్నా, మన ప్రాతంలో వారు రాజ్యం స్థాపించుకున్న దాఖలాలు లేవు.గుంటూరు సీమ లోని  పెదగంజాము సమీపం లోని ఫరంగి దిబ్బ మాత్రం ఒకప్పుడు వీరి వాసస్థానం గా ఉండేదట.(మొదట్లో ఈ పోర్చుగీసు వారినే మనవారు పరంగీలని పిల్చుకున్నా తరువాతి కాలంలో అది ఇతర దేశస్థులందరికీ కూడా పర్యాయపదమై పోయింది).మన దేశంలో పోర్చుగీసు వారు ఏర్పరచుకున్న స్థావరాల వైశాల్యం 1500 చదరపు మైళ్లగానూ జనసంఖ్య తొమ్మిది లక్షలు గానూ ఉండేది. మన దేశం లోనే కాదు, అస్ట్రేలియా లోతప్ప ప్రపంచం నలుమూలలా విస్తరించిన పోర్చుగీసువారి వలసలలో ఆ భాష మాట్లాడే వారు ఏడెనిమిది కోట్లకు చేరింది. 12వ శతాబ్దం వరకూ తమకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం లేని పోర్చుగీసులు నౌకా వ్యాపారం చేసుకుంటూ ప్రపంచం నలుమూలలా విస్తరించి వలసలు ఏర్పాటు చేసుకోగలగడం అబ్బురపరచే విషయమేకదా?
                                       ****
ఏదో బుడకీచుల గురించి చెబుతానంటూ ప్రారంభించి ఎక్కడో ఉన్న పోర్చుగీసుల గురించి ఎందుకు చెబుతున్నావయ్యా అని మీరడగవచ్చు.అదే చెబుతున్నాను. ఈ పోర్చుగీసు వారినే  మనవారు పురతగీజులనీ పుడతకీజులనీ వ్యవహరిస్తూ ఆఖరుకు బుడతకీచులని పిలువనారంభించారు.అది సరే వీరితో మనకేమిటి సంబంధం అని కదూ మీ ప్రశ్న. అదీ చెబుతాను. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ బుడత కీచులు, వారు కాలు పెట్టిన చోట లభ్య మయ్యే కొత్త కొత్త వస్తువులను సేకరించి అవి లేని చోటికి తీసుకు పోయే వారు. ఆ రకంగానే వారు ఆఫ్రికా, పనామా, పెరూ, బ్రెజిల్, మలయా మెక్సికో,మొదలైన ప్రాంతాలనుండి రక రకములైన ఫలవృక్షాలనూ మన దేశానికి తీసుకు వచ్చారు. వీటిలో అనాస, జామి(గొయ్యా) కాబేజీ(గోబి) చిలగడదుంప, జీడి మామిడి,పొగాకు,బొప్పాయి, బంగాళాదుంప, మిరప, మొక్కజొన్న,టొమేటో,రామా ఫలం వంకాయ, వేరుసేనగ,సీతాఫలం మొదలైనవి ఉన్నాయి.బొప్పాయిని ఈ పరంగీలు తెచ్చిన గుర్తుగా కొన్ని చోట్ల దానిని  పరంగీ కాయ అని పిలవడం కూడా ఉంది. అలాగే అనాస, గోబి,గొయ్యా అనే పేర్లు బుడతకీచులనుంచి వచ్చినవే. మిగిలినవి  మనం మన భాషలో పెట్టుకున్న పేర్లు. వీటిలో చాలా మట్టుకు వారు దక్షిణ అమెరికా నుంచి తెచ్చినవే. వంకాయ వంటి కూరయు..అని మనం కవిత్వంలో కూడా పొగడుకునే  వంకాయ మనది కాదన్న మాట. తెలంగాణాలో ఆలుగడ్డ అనీ రాయల సీమలో ఉర్లగడ్డ అనీ పిలుచుకో బడుతున్న పొటాటోను మొదటగా బెంగాల్లో దిగుమతి చేసుకుని అక్కడ బాగా వేళ్లూనిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరింపజేయడం వల్ల ఉత్తరాంధ్రలో దానిని బంగాళా దుంప అని పిల్చుకుంటున్నా అది కూడా బుడతకీచుల భిక్షే. పొగాకు, జీడిమామిడి, మిరప వేరుశెనగ వంటి వ్యాపార పంటలను మనకు తెచ్చి యిచ్చిన వారూ బుడతకీచులే. ఇవాళ మన వంటల్లో కారం కోసం విస్త్రృతంగా మిరపకాయలు వాడుతున్నా 15 వ శతాబ్దినాటికి మనకు అవేమిటో తెలియదు.అంతకుముందు వంటల్లో కారం కోసం మిరియాలనే వాడే వారం. అందుకే కొత్తగా వచ్చిన ఈ కారం కాయలను మిరియంపు కాయలనీ మిరపకాయలనీ పిలవడం మొదలు పెట్టాం.మామిడి పండ్లు మన దేశపు ఫలాలే అయినా  రకరకాల అంట్లు కట్టి కొత్త కొత్త రకాలను సృష్టించడం నేర్పించింది మాత్రం బుడతకీచులే.
మన ప్రాంతంలో వారు స్థావరాలు ఏర్పరచుకోకపోయినా తూర్పు కోస్తా వరకూ వారి వాణిజ్యం విస్తరించడంతోనూ, మత ప్రచారంకొసం వారి ఫాదిరీలు ఆంధ్ర పాంతమంతా తిరుగాడడం చర్చిలు నెలకొల్పుకోవడంతోనూ, వారి నుడులు కొన్ని మన భాషలో వచ్చి చేరాయి. అదే కాక సముద్ర ప్రయాణానికి అనువు గాని సమయాల్లో వారు పశ్చిమ తీరపు రేవుల్లో ఓడలమరమ్మత్తులు, కొత్త పడవలు  తెప్పలు కట్టుకోవడం ఇళ్లు కట్టుకోవడం వంటివి చేసేవారు.ఈ పనుల కోసం ఎందరో మనదేశస్థులు తెలుగువారు వారి వాడల్లో పనిచేయడం వల్ల కూడా వారి మాటలు కొన్ని మన తెలుగు లో వచ్చి చేరాయి. వాటిలో కొన్ని చూడండి.
ఏలము,కుంపిణీ, కోస్తా,గిడ్డంగి, గోదాము, బంకు , అల్పీ , పేనా పీపా, బాల్టీ, మేజా, సబ్బు ఇస్తిరీ , కబాయి, కమీజు, కాజా , తువ్వాలు,బొత్తాముకానా, గమేలా,(తాళం) చెవి పరంజా,బొరిగ, మేస్తిరీ, పటాలము మొదలైనవి. ఇవే కాదు ఒకనాటి పేకాటలో వ్యవహారంలో ఉండిన బేస్తు కుదేలు, తురుఫు కూడా వీరి భాషనుంచి వచ్చి చేరినవే.మా తాతగారు నా చిన్నప్పుడు తన చొక్కాని కమీజు అనే అనే వారు. కళింగ సీమ (ఉత్తరాంధ్ర) మాండలికంలో వంటయింటిని కుసిని అంటారు.ఇది మనకు బుడతకీచులనుంచి వచ్చినదే.(ఇంగ్లీషు భాషలో కూడా అన్ని రకాల వంటలూ దొరుకుతాయి అనే అర్థంలో- Multi cuisine- అని అంటారు.)
ఇదీ బుడతకీచుల కథ. వారు మన దేశం విడిచి పెట్టి వెళ్లిపోయి అర్థ శతాబ్దం గడచి పోయినా నేటికీ పశ్చిమ సముద్ర తీర ప్రాంతపు రేవు పట్టణాల్లో మరీ ముఖ్యంగా గోవా, దయ్యు, దమన్ వంటి ప్రదేశాల్లో వారి సంస్కృతీ  పరిమళాలు ఇంకా కొంచెమైనా గుబాళిస్తూ ఉన్నాయి.
                                                   *****  
(నా ఈ పోస్టుకి కీ.శే.శ్రీ తూమాటి దొణప్ప గారి వ్యాసం ప్రధానాధారం కాగా, కీ.శే. ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యంనుంచి కూడా కొంత సమాచారం సంగ్రహించాను. వారిరువురకూ నా కృతజ్ఞతలు.)
                                                 *****