26, మే 2012, శనివారం

నవనీత మనస్కుడు.. కవితాంతరంగుడు....శ్రీ విశ్వనాథ..


  “ శ్రీ విశ్వ సత్యనాథాయణ అగ్గి మీద గుగ్గిలం….”. అంటాడు మహాకవి శ్రీశ్రీ. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి మాట పెళుసు. అయితే అయి ఉండ వచ్చు.ఆయనది ఎవరినీ లక్ష్య పెట్టే స్వభావం కాకపోవచ్చు.అనదలుచుకున్నమాట ఏదో ఎదుటివారి ముఖం మీదే అనేసే తత్వం ఆయనది.నిర్మొహమాటి. ఈ విషయంలో మనం ఆయన ప్రవర్తనను హర్షించలేక పోవచ్చును.  అయితే చాలా మందికి తెలియని దొడ్డ గుణాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి.మంచి కవిత్వాన్ని చదివితే మైమరిచిపోవడం,తానే ఒక మహాకవి ఐనా కూడా ఇతరుల కవిత్వాన్ని తన కవిత్వం కంటె బాగుందని నిస్సంశయంగా మెచ్చుకోవడం గొప్ప విషయాలు.వారి సహృదయతకు అద్దం పట్టే సంఘటనలు చాలానే ఉన్నాయి.మచ్చుకు ఒకటి చూడండి:

ఒకసారి బీర్నీడు ప్రసన్న అనే కవి శ్రీ విశ్వనాధ వారిని సందర్శించుకోవడానికి వచ్చాడు. ఆయన నిమ్నకులానికి చెందనవాడూ క్రైస్తవమతానికి చెందిన వాడూను.ఆయన తాను ఒక కావ్యం వ్రాశాననీ దాని మీద విశ్వనాథ వారి అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చాననీ విన్నవించుకున్నాడు. ఏదో చికాకుల వలన మనసు బాగా లేని విశ్వనాథ వారు నీకూ పుట్టిందీ ఈ రోగం. సరే కానీ ఏం వ్రాశావు అని అడిగారు. దానికతడు అది పృధ్వీరాజు రాణీ సంయుక్తల వివాహ గాథ అనీ పుస్తకం పేరు పృధ్వీభాగవతమనీ చెప్పి పుస్తకాన్ని తన చేతి సంచీ లోంచి తీసి విశ్వనాథ వారి కాళ్ల దగ్గర ఉంచబోయాడు. విశ్వనాథ వారు వెనక్కి తగ్గి పుస్తకాన్ని అక్కడ బల్లమీద పెట్టి ఒక పదిరోజులాగి కనపడుఅని అన్నారు. సరిగ్గా పదిరోజులాగి పదకొండోరోజు ప్రసన్నగారు వచ్చారు విశ్వనాథ వారు “ చదవలేదయ్యా నాలుగు రోజులాగి రాగలవా?” అన్నారు. “ చిత్తమండీ అంటూ అతను వెళ్లిపోయాడు. సరిగ్గా నాలుగు రోజులాగి మళ్లా వచ్చాడు. ఏమిటోనయ్యా చదవడం కుదర లేదు. రెండురోజులాగి రాగలవా? ”అని విశ్వనాథవారంటే అతడు తప్పకుండా అంటూ వెళ్లిపోయి రెండురోజులాగి మళ్లా వచ్చాడు. ఏదో పనిమీద పోతున్నానయ్యా రేపురాఅని విశ్వనాథ వారంటే సరేనని ప్రసన్న గారు వెళ్లిపోయి మర్నాడు సాయంత్రం విశ్వనాథ వారు చాలా చికాకుగా ఉన్న సమయంలో మళ్లా వచ్చారు.విశ్వనాథ వారు కోపంతో “ ప్రతీవాడూ కవిత్వం వ్రాసేవాడే! నాప్రాణం తీసే వాడే! వ్రాస్తే వ్రాసుకో వచ్చుకాని నా అబిప్రాయం ఎందుకూనేనెవర్నైనా అభిప్రాయాలడిగానా? వ్రాసిన దేదో అచ్చేసుకేవచ్చు. చదివే వాడు చదువుతాడు. లేనివాడు లేదు.నీ పుస్తకం చదవడం నా వల్లకాదు తీసుకుని ఫోఅంటూ విసుక్కున్నారు.ఆ ప్రసన్నగారు కళ్లనీళ్ల పర్యంతమై అట్లాగే నండయ్యా పుస్తకమిప్పించండయ్యా! అగ్గిలో పారే స్తానుఆన్నారు. దానికి ఆశ్చర్య పోయిన విశ్వనాథ వారుఏమిటీ ఏమిటంటున్నావు....నిజంగానే అంటున్నావా అని అడిగితే నిజమేనండయ్యా,మీరు చదవని కాడికి ఈ పుస్తకమెందుకండయ్యా..మీ ముందరే అగ్గిలో పడేస్తాను అన్నారు ప్రసన్న గారు. ఆయనను మర్నాడు రమ్మన్నారు విశ్వనాథ వారు.
ఆ రాత్రి భోజనాలయేక ప్రసన్నగారిచ్చిన వ్రాత ప్రతిని తీసుకుని చదవడమారంభించిన విశ్వనాథ వారు రాత్రి ఒంటి గంట సమయంలో తమ మేడ మీద నిద్రిస్తున్నమల్లాది లక్ష్మీ నారాయణ గారిని కేకేసి రమ్మని పిలిచి పృద్వీ బాగవతం లోని పద్యాలను వరుసగా కొన్ని చదివి వినిపించిఎంత బాగా వ్రాసాడండీ అసలీయన లాగా నేను వ్రాయగలనుటండీఅని మెచ్చుకున్నారు.
మర్నాడు పుస్తకం కోసం వచ్చిన ప్రసన్నగారిని లక్ష్మీనారాయణ గారు బాబూ ఈ పుస్తకమె వరికి అంకిత మిద్దామనుకుంటున్నావు అని అడిగారు.ఆయన మానవ మాత్రుడెవరికీ ఇవ్వదలచుకోలేదండీ అని సమాధానమివ్వడంతో లక్ష్మీ నారాయణ గారు
అదికాదయ్యా నువ్వు అంకితమిస్తే తీసుకుందామని మాస్టరుగారు అనుకుంటున్నారు, కానీ నీవు మానవ మాత్రుడికి ఇవ్వనంటున్నావే మరీ అని అన్నారు.ఆశ్చర్యపోయిన ప్రసన్న గారు అది వేళా కోళం కాదనీ నిజమేననీ రూఢి చేసుకుని తాను ఏనాడూ ఆయనను మానవ మాత్రునిగా తలచ లేదంటూ విశ్వనాథ వారి కాళ్లమీద పడి లేచి అప్పటికప్పుడు అంకితం  పద్యాలు వ్రాసి ఇచ్చారు.
ఆ తర్వాత ఆగ్రంథం సాహిత్య అకాడెమీ వారి ధన సహాయంతో ముద్రింపబడింది.
పుస్తకం అంకితం సభలో ప్రసన్నగారు శ్రీవారు ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవులైతే నేను వారి ఆస్థాన కవినిఅని చెప్పుకుని మురిసిపోయారు.
బ్రాహ్మణేతరుల కవిత్వాన్ని కేవలం వారి కులం కారణంగా ఈసడించుకుంటున్న పండితమ్మన్యులు వెలిగి పోతున్న రోజులలో నిజమైన కవిత్వం ఎక్కడున్నా తలదాల్చిన కవిసమ్రాట్టుకి జేజేలు పలుకు తున్నాను.
ఈ వైనాన్ని మనకు తెలిపిన ( శ్రీవిశ్వనాథ సత్య నారాయణ గారి కుమారులు) శ్రీ విశ్వనాథ పావని శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఇటువంటిదే ఇంకొక ముచ్చట మరోసారి.. ఇప్పటికి సెలవు.)