28, జులై 2012, శనివారం

పశ్చాత్తాపం,,బహు దొడ్డగుణం.. అవునా ? కాదా?


పశ్చాత్తాపం.. బహుదొడ్డగుణం..
తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తాము. అది మానవ సహజం. కాని చేసిన తప్పును ఒప్పుకోగలిగే దొడ్డగుణం ఏ కొద్దిమందికో ఉంటుంది. ఈ దొడ్డగుణం ఎంతో చదువుకుని సంస్కారవంతులైన వారిలోనే ఉంటుందను కోవడం పొరపాటు. చదువు సంస్కారానికీ ఈ సహజగుణానికీ ఏ సంబంధం లేదు. నిజంగా ఈ గుణం అందరిలో ఉంటే మనకిన్ని లక్షల కేసులూ ఉండేవికాదు. ఇన్ని వేల న్యాయస్థానాలూ అక్కర లేదు. ఈ విషయం గురించి ఇంకా విపులీకరించాలని ఉంది గాని ఇక్కడ స్థలం చాలదు. అందుచేత ఒక మంచి కథ మాత్రం మీకు తెలియజేస్తాను.
మెడోస్ టైలర్ సురపురం సంస్థానంలో నిజాం రాజ్య ప్రతినిదిగా ఉన్నప్పుడు 1856 లో జరిగినదిది.  రాజ ప్రతినిధి గా ఆయన న్యాయవిచారణను కూడా చేపట్టాల్సి వచ్చేది. అప్పుడు విచారణకు వచ్చిన ఒక కేసు ఇది :
ఒక భాగ్యవంతుడైన గొర్ల కాపరి ఉండేవాడు. అతడు వ్యవసాయం కూడా చేసేవాడు. అతడికిద్దరు భార్యలు. పెద్దామెకు వయసు మళ్ళినా పిల్లలు లేకపోవడంతో మరో పెళ్ళి చేసుకున్నాడు. చిన్నామె వయసులో ఉన్నది. సవతులిద్దరికీ పడకపోవడంతో వారిద్దరీనీ ప్రక్క ప్రక్కనే వేరు వేరు ఊళ్లలో ఉంచాడు. ఒక రోజు ఉదయమే అతడి చెరుకు తోటలో అతడు శవమై పడిఉన్నాడు. తల చిట్లి పోయి ఉంది. రాతితో మోది ఎవరో అతడిని రాత్రే చంపివేసారు. ముందు రోజు సాయంత్రం అతడింట్లో ఒక విందు జరిగింది. అతడి మేనల్లుడే మేకను కోశాడు. అతడు చక్కగా భోజనం చేసి పెద్దభార్యతో సరస సల్లాపాలాడి చెరుకుతోటకు వెళ్లి కాపలా పడుకున్నాడు. రాత్రి హత్య జరిగింది. ఇది అతని పెద్ద భార్య అతని మేనల్లుల పనే నని పంచాయతీ దారులు తలచి విచారణ ప్రారంభించేరు. మేనల్లుని భార్య,తన భర్త ఆరాత్రి ఇంట్లో లేడని చెప్పింది. తెల్లవారు ఝామున వచ్చి తన కంబళి ఆమెకు కప్పి పుట్టింటికి పోదాం రమ్మన్నాడట.ఆకంబళి పై రక్తం అంటి ఉన్నది. కానీ చీకట్లో ఆమె చూడలేదు. ఉదయమే పోలీసులు వచ్చి కంబళిని పట్టుకున్నారు.ఆ కంబళిని రక్త పరీక్షకై హైదరాబాదు పంపేరు కానీ అది మనిషి రక్తమో మేక రక్తమో అక్కడ నిర్ధారించలేక పోయేరు .మేనల్లుడేమో అది తను ముందు రోజు కోసిన మేక రక్తమే నంటాడు. వారి తరపు న్యాయవాది ఎంతో దక్షతతో తన క్లయింట్లు నిర్దోషులని వాదించేడు. టైలర్ సాబ్ కి వారే హత్య చేసి ఉంటారని ఎంతో నమ్మకంగా అనిపించినా సాక్ష్యం లేక పోవడం వల్ల వారిని నిర్దోషులుగా తీర్పు వ్రాయడానికి కలం పట్టేడు. ఇంతలో ఆ రైతు పెద్ద భార్య ఆగండి స్వామీ! ఆగండి తీర్పు వ్రాయకండి!! మీకు నిజం తెలియదు. తెలియక పోతే తప్పు తీర్పే ఇస్తారు. సాక్షులు చెప్పింది అబధ్ధం. మా న్యాయవాది వాదనా అబధ్ధమే. నేనే హత్య చేశాను. అతడి మేనల్లుడు తోడ్పడ్డాడు. ఇద్దరం కలిసి తల చితక కొట్టాము ”. అంది.
టైలర్ ఆమెతో అలా మాట్లాడితే ఆమెకు ఉరిశిక్ష పడుతుందనీ ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించినా ఆమె చెప్పిందంతా నిజమే స్వామీ!” అంది. మేనల్లుడు కూడా నేనే అతడి ఆస్థికి వారసుడనౌతాను కదా? మరి చిన్నామెకు బిడ్డలు పుడితే వారికి ఆస్థంతా రాసిస్తాడట. ఎలా ఒప్పకోమంటారు స్వామీ? నా గుండె మండి పోతోంది. ఇప్పుడైనా ఎప్పటికైనా అతడిని చంపే ఉండేవారముఅన్నాడు. ఆమె మేం చెప్పినదంతా వ్రాసుకుని ఉరిశిక్ష వేయించండి స్వామీ అంది.  టైలర్ వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చి ఆమోదం కోసం కలకత్తా లోని సదర్ అదాలత్     ( ప్రధాన న్యాయస్థానం ) కి పంపాడు. ఆమోదం వచ్చాక వారిద్దరూ ఉరితీయబడ్డారు.
                                           ****
ఈ విషయం తన జీవిత చరిత్ర లో వ్రాస్తూ టైలర్ న్యాయస్థానంలో తీర్పు వ్రాయవద్దు అంటూ ఆమె వేసిన కేక,ఆతర్వాత ఆమె చెప్పుకున్న ఒప్పుకోలూ నా బుర్రలో చాలా కాలం ప్రతిధ్వనిస్తూనే ఉండిపోయాయి అంటూ వ్రాసుకున్నాడు.
                                         *****
తమ మీద కేసు నిర్ధారింపబడే సాక్ష్యాలు లేకున్నా. శిక్ష నుండి తప్పించుకునే అవకాశం కళ్ళముందు కనపడుతున్నా,ఉరిశిక్షకు సిధ్ధపడి నిజాన్ని నిర్భయంగా అంగీకరించగలగడం మహా దొడ్డగుణం కాదంటారా?
                                                      ***
( టైలర్ జీవిత చరిత్రనీ అందులోని మరికొన్ని ముచ్చట్లనీ ఇంతకు ముందు "నేను చదివిన ఒక మంచి పుస్తకం..." అనే పోస్టులో పరిచయం చేసాను. కుతూహలం ఉన్నవారు చూడవచ్చు).సెలవు.