29, అక్టోబర్ 2012, సోమవారం

శ్రీ రాముని వంశావళి..


శ్రీ రాముడు సూర్య వంశానికి చెందిన మహారాజని మనందరికీ తెలుసు.శ్రీ రాముని వంశానికి చెందిన అతని పూర్వీకుల గురించి కాని, అతడి తర్వాత అయోధ్యనేలిన ఆ వంశీకుల గురించి కాని ఏమైనా తెలుసా?
అయోధ్యనేలిన సూర్యవంశపు రాజులలో శ్రీ రాముడు 64వ వాడని అంతకు ముందు ఆ రాజవంశీకులు 63రు అయోధ్యనేలారని ఇప్పటికి దాదాపు 80 ఏళ్లక్రితం ప్రచురించిన తన రామాయణ్ కా ఇతిహాస్ అనే గ్రంథంలో శ్రీ రాజ్ బహదూర్ సీతారామ్ గారు తెలియజేసారు.వీరిలో చాలామంది గురించి వాల్మీకే తన రామాయణంలో వశిష్టమహర్షి ద్వారా జనక మహారాజుకు చెప్పించాడు.
అమెరికా లోని లూసియానా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ కాక్ తన అస్ట్రోనామికల్ కోడ్ ఆఫ్ ది రుగ్వేదా అనే గ్రంథంలో రామునికి ముందర అయోధ్యనేలిన ఆ వంశపు 63రు రాజుల పేర్లూ, శ్రీ రాముని తర్వాత అతని కొడుకు కుశునితో ప్రారంభించి మరొక 29 మంది రాజులనుగురించి ప్రస్తావించాడు.
ఆ పట్టిక ఈ దిగువన చూడండి.
శ్రీ రాముని వంశావళి.          
1.మనువు 2.ఇక్ష్వాకు .వికుక్షి4..కకుత్స5.అనినాశ6.పృథు7.విశ్టారశ్వ8.ఆర్ద్ర9.యవనాశ్వ(1)10.శ్రావత్స
11.బృహదాశ్వ12.కువలాశ్వ13.ధృడాశ్వ14.ప్రమోద15.హర్యాశ్వ(1)16.నికుంబ17.సంహతాశ్వ18.అక్రశాశ్వ19.ప్రసేనజిత్
20.యవనాశ్వ(2)21.మాంధాత22.పురుకుత్స23.త్రసద్స్యు24సంభూత25.అనారణ్య 26.త్రసద్స్వ27.హర్యాశ్వ(2)28.వసుమత29.త్రిధన్వ30.త్రయ్యారుణ
31.త్రిశంకు32.సత్యవ్రత33.హరిశ్చంద్ర34.రోహిత35.హరిత36.విజయ 37.రురుక38.వ్రక39.బాహు40.సగర
41.అసమంజస42.అంశుమంత 43.దిలీప(1)44.భగీరథ45.శ్రుత46.నభగ47.అంబరీష48.సింధుద్వీప49.అయుతాయు
50.ఋతుపర్ణ51.సర్వకామ52.సుదాస53.మిత్రసహ54.అస్మాక55.ములక56.శతరథ57.అయిదావిద58.విశ్వసాహ(1)
59.దిలీప(2)60.దీర్ఘబాహు61.రఘు62.అజ63.దశరథ64.శ్రీ రామ65.కుశ 66.అతిథి67.నిశాధ68.నల69.నభస
70.పుండరీక71.క్షేమధన్వ72.దేవానిక73.అభినాగు74.పరిపత్ర75.బల76.యుక్త77.వజ్రనాభ78.శంఖ79.వ్యుశిత్సవ
80.విశ్వసాహ(2)81.హిరణ్యభ82.పుష్య83.ధృవసంధి84.సుదర్శన85.అగ్నివర్ణ86.శీఘ్ర87.మరు88.ప్రసుశ్రృత89.సుసంధి90.అమర్ష
91.మహశ్వత92.విశ్రుతవంత93.బృహద్బల94.బృహత్క్సాయ.
పై పట్టికలో మొదట పేర్కొన్నమనువు వైవస్వత మనువు.ఇతడి కొడుకైన ఇక్ష్వాకుడే అయోధ్యనేలిన మొదటి ఇనవంశపు రాజు.అందుకే అది ఇక్ష్వాకు వంశంగా పేరుగాంచింది.ఆ తరువాత ఈ వంశంలో20వ వాడైన, రెండవ యవనాశ్వుని కొడుకు మాంధాత చక్రవర్తి పేరు బడసిన మహారాజు.ఆతరువాత 31వ వాడైన త్రిశంకుడు, 33వ వాడైన హరిశ్చంద్రుని కథలు మనకు
పరిచయమైనవే.ఈ వంశంలో 40వ వాడైన సగరుడు అతనికొడుకు అసమంజసుడు,మనుమడు అంశుంతుడు,ముని మనుమడు దిలీపుడూ, అతనికొడుకు భగీరథుడూ మనకు గంగావతరణం గాథ ద్వారా సుపరిచితులే. ఆ తర్వాత 61వ రాజైన రఘువు వలననే  వంశానికి రఘువంశమని పేరువచ్చింది.ఈ రఘు మహారాజు మనుమడే శ్రీ రామచంద్రుని కన్నతండ్రియైన దశరథ మహారాజు.
శ్రీ రాముని తర్వాత అతనికొడుకు కుశుడు పట్టాభిషిక్తుడౌతాడు.ఆ తర్వాత రఘువంశంలోని రాజులెవరూ ప్రసిధ్ధులైనట్లు తోచదు.
స్థూలంగా శ్రీ రాముని ముందూ వెనుకా అయోద్య నేలిన సూర్య వంశపురాజుల కథ ఇది.
సరదాగా ఇక్కిడొక ముచ్చట చెప్పి ముగిస్తాను.
శ్రీ రాముని తరువాత అయోధ్య గద్దెనెక్కిన రాజుల్లో 21 వ వాడు అగ్ని వర్ణుడు.ఇతడు భోగ లాలసుడు, విషయలోలుడై రాజ్య పాలన ఏ మాత్రం పట్టించుకునే వాడు కాదట.అయినా అతనికి చాలా సమర్థవంతమైన మంత్రి వర్గం ఉండడంతో రాజ్య పరిపాలన సజావుగానే సాగుతూ ఉండేది.ప్రజలు ఎంత సుఖశాంతులతో వర్థిల్లుతున్నప్ప టికీ వారికి తీరని కోరిక ఒకటి మాత్రం ఉండిపోయిందట. వారికి ఏనాడూ రాజ దర్శనం అయ్యేదికాదట.ఎంతటి ముఖ్యమైన సందర్భమైనా రాజుగారు సభా భవనానికి రాక పోవడంతో జనంలో అనుమానాలు మొలకెత్తడం ప్రారంభించాయట. రాజుగారు మరణించినా ఆవిషయం ప్రజలకు తెలియనివ్వకుండా మంత్రులే తమని మోసగించి పరిపాలిస్తున్నారేమోనని గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారట.ఇది రాజ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని గ్రహించిన మంత్రులు, ఒక్కసారి ప్రజలకు దర్శనం దయచేయమని ప్రాధేయపడగా పడగా అందుకు రాజుగారు తాను సభకు రాననీ  తాను తన అతఃపుర గవాక్షంనుంచి కాళ్లు బయట పెడతానని ప్రజలు వాటిని దర్శించుకుని మ్రొక్కుకుని వెళ్లిపోవచ్చనీ సెలవిచ్చారట.చెరకుతుద వెన్ను పుట్టి చెరకులోని తీపినంతా చెరిచినట్లు ఇంత పేరుగాంచిన రఘువంశంలో ఇటువంటి వారు ఉద్భవించిన తర్వాత ఆ వంశం ఎన్నాళ్లు మనగలదు?  ఆతర్వాత పట్టుమని పది మంది రాజులు అయోధ్యనేలినట్లు లేదు.
( ఈ కథ రఘువంశంలో ఎక్కడైనా ఉందేమో? నాకు తెలియదు. ఈ కథ నేను పాతిక ముఫ్ఫై ఏళ్లక్రితం ఆంధ్రప్రభ వార పత్రికలో చదివాను.శ్రీరాముని గురించి నేను వ్రాసిన పోస్టులలో ఇది 5వదీ ఆఖరుదీను.మనకీ మంచి సమాచారాన్ని అందించిన  I-SERVE Delhi వారికి మరో సారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ- సెలవు. )