23, నవంబర్ 2013, శనివారం

ఒక అరుదైన ఫోటోలో మాన్యుడైన సామాన్యుడు

     

ఈ ఫోటో సుమారు 70 సంవత్స రాల క్రిందటిది.  అంత పాత ఫోటోలు మనకు చాలా అరుదు గానే లభిస్తాయి. లభించిన వాటిల్లో కూడా మనుషులను స్పష్టంగా గుర్తు పట్టే విధంగా ఉండేవి చాలా తక్కువ గానే ఉంటాయి. ఇది అటువంటి వాటిల్లో ఒకటి.
ఈ ఫోటో 1940 ప్రాంతాలది. విజయనగరం సంగీత కళాశాలకు సంబంధించినది. 

ఫోటో మధ్యలో కుర్చీలో ఆసీనులై ఉన్నవర్చస్వి శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు. వారు ఆ రోజుల్లో  సంగీత కళాశాల లో గాత్ర పండితుని గా పని చేస్తూ ఉండేవారు. ఆయన మధుర గాయకుడే కాకుండా వాగ్గేయకారుడు కూడా. కర్ణాటక సంగీతంలో దిట్ట అయినా, ఆ దాక్షిణాత్య సంగీతపు పోకడలు పోకుండా కొంత స్వతంత్రించి కమ్మటి తెలుగు మాటలు వినిపించేటట్లుగా పాడడం వలన అవి జనరంజకం గా కూడా ఉండేవి. ఉత్తరాంధ్రలో ఆ రోజుల్లో సంగీత కళా మతల్లి కి ఈయన చేసిన సేవల గురించి వివరంగా కావాలంటే  పట్రాయని వారి బ్లాగ్లో  చూడ వచ్చును.
ఇక్కడ ఈ ఫోటోలో గురువు గారికి ఎడమ ప్రక్కన క్రిందన ( ఫోటోలో క్రింద నేల మీద కూర్చున్న వారిలో ఎడమ వైపు నుండి మూడవ వారు  తరువాతి కాలంలో ఆంధ్ర దేశాన్ని తన గాన మాధుర్యంతో ముంచెత్తిన  మహా గాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు). శ్రీ ఘంటసాల గురించి నేనేం చెప్పినా చర్విత చర్వణమే అవుతుంది కనుక దానికి పూనుకోవడం లేదు. కానీ ఈ నాటి విద్యార్థులు, యువత  ఈ ఫోటోని చూసి గ్రహించ వలసిన ముఖ్య విషయమిటంటే - తామెంత ప్రతిభావంతులమైనా ఆ ప్రతిభ రాణించడానికి, విద్యాసముపార్జనకి వినయ విధేయతలతో సద్గురువులను సేవించుకోవడం అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. శ్రీ ఘంటసాలకి మధురస్వనం భగవద్దత్తమే ఐనా, తాను పెద్దవాడైన తర్వాత  కీర్తనలు పాడినా లలిత సంగీతం పాడినా ఆంధ్ర దేశాన్ని ఉర్రూత లూగించేటట్లు పాడే ఫణితి తన  గురువు గారి వద్ద నేర్చుకున్నదే. అది వారి వరప్రసాదమే. గురువుల పాదాల చెంత కూర్చోవడానికి  నేటి శిష్యులెవరైనా  సిధ్ధ పడతారా?

ఈ ఇద్దరి ప్రముఖుల గురించి చెప్పడం కాదు ఈ నా పోస్టు ఉద్దేశం. వీరి గురించి ఎక్కడో ఒక చోట అందరూ తెలుసుకునే అవకాశం ఉంది కదా? మరెందుకయ్యా మొదలెట్టావు అంటే వినండి మరి.
ఇంతకు ముందు 2011 అక్టోబరు మాసం లో నేను వ్రాసిన  రెండు గొప్ప కథలు అనే పోస్టులో శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడుగారు  విజయనగరం సంగీత కాలేజీలో పని చేస్తుండగా అప్పటి కింకా కీర్తి ప్రతిష్టలు రాక పోవడం వల్ల  ఎక్కువ గా కచేరీలు చేసే అవకాశం కాని, సరైన గౌరవ పురస్కారాలు అందు కోవడం కాని జరుగని రోజుల్లో, ఆ కాలేజీలో బంట్రోతు (ఇప్పుడు మనం ప్యూన్ అని పిలిచే చిరుద్యోగి) తన స్వంత సంపాదనతో ఒక రామాలయం కట్టించి దానిలో విగ్రహ ప్రతిష్ట చేసిన రోజున, శ్రీ నాయుడు గారి కచేరీ చేయించి వారికి అంతకు ముందెవ్వరూ ఇవ్వని విధంగా 116 రూపాయలిచ్చి సన్మానించి తన రామ భక్తినీ సంగీతాభిమానాన్నీ చాటుకున్న సంగతీ,. ఆ తర్వాత శ్రీ రామ ప్రసాదం గా పాయసాన్ని సేవించి నిద్ర లోనే దైవ సాయుజ్యాన్ని పొందిన శ్రీ రామస్వామి అనే వ్యక్తిని గురించి చదివే ఉంటారు. 

అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ కూడా  రామ భక్తి తోనూ సంగీతజ్ఞుల సేవ లోనూ తరించిన ఆ అసామాన్యుని  ఫోటో మీకూ చూపించే అవకాశం దొరకడమే ఈ పోస్టు వ్రాయడానికి కారణం. 

 పైనున్న ఫోటోలో కుడివైపు చివర వినమ్రంగా చేతులు కట్టుకుని డవాలా ధరించి నిల్చున్న ధన్యజీవి  శ్రీ రామస్వామియే.
                                              ******
(ఇంత మంచి ఫొటోని ఇంత చక్కగా భద్రపరచిన  వయో వృధ్ధులు,  శ్రీ పట్రాయని సంగీతరావుగారు (సీతారామ శాస్త్రి గారి జ్యేష్ఠ కుమారులు- అభినందనీయులు.)
                                              
                                                ****















8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఆత్మ గౌరవ యాత్ర?

   
                                 
 అయ్యా  ఈ హెడ్డింగు చూసి నేనేదో ఈ పేరుతో జరుగుతున్న రాజకీయ బస్సు యాత్ర గురించి రాస్తున్నానని భ్రమ పడి ఇటు రావద్దు. నాకూ రాజకీయాలకీ ఆమడ దూరం.  అంటే  ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలగురించి నాకు ఏ అభిప్రాయాలు లేవని కాని కలగవని కాని కాదు. వాటిని వేటినీ ఈ నా బ్లాగులో నేను చర్చించను. వాటికిది వేదిక కాదు. కాకూడదు. అయితే ఆత్మ గౌరవ యాత్ర గురించి ఎందుకెత్తుకున్నావయ్యా అంటే  ఆ పేరుతో బస్సు యాత్ర జరుగుతోందని విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఆత్మ గౌరవమంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? అసలు ఆత్మ గౌరవమంటూ ఉన్న వాడెవరైనా ఏ రాజకీయ పార్టీలోనైనా మనగలడా? రాజకీయాల్లో ఉన్న వారిని వారే పార్టీకి చెందిన వారైనా సరే  పొద్దున లేస్తే ఎవరో ఒకరు తిట్టి పోయకుండా ఒక్కరోజైనా గడవదు కదా? మరి అలాంటప్పుడు వాటినన్నిటినీ దిగ మ్రింగు కుంటూ  కాలం గడపాల్సిన రాజకీయవేత్తలకి ఆత్మగౌరమననేది ఎలా ఉంటుంది ?  Politics is the last resort of a scoundrel – ఇంకే గతీ లేని దౌర్భాగ్యులకి రాజకీయాలే గతి – అన్న నానుడి ఉండనే ఉంది కదా?  అందు చేత ఈ ఆత్మ గౌరవానికీ రాజకీయాలకీ ముడి ఎలా పడుతుంది? కావున నేను రాయబోయేది రాజకీయ ఆత్మ గౌరవ బస్సు యాత్ర గురించి కానే కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
                                 ఆత్మ గౌరవంతో జీవన యాత్ర సాగించాలంటే, అది ఏ యాత్రల వల్లా రాదు. అది ఒకరిస్తే వచ్చేది కాదు. అది మన జీవన విధానం వల్ల వస్తుంది. ఏ ప్రలోభాలకీ లోను కాకుండా, ఒకరికి తలవంచ కుండా, తాను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని  సార్లు చెప్పాల్సి వచ్చినా నిస్సంకోచంగా చెప్పగలవాడే ఆత్మ గౌరవం కలవాడు. అటువంటి ఆత్మ గౌరవంతో మన తెలుగు నాట మసలిన ముగ్గురు కవి వర్యుల గురించి ఇంతకుముందు నా కవులూ- వారి ధిషణాహంకారమూ అనే పోస్టులో వ్రాసి ఉన్నాను. అటు వంటివే ఇద్దరు సంగీతజ్ఞుల ముచ్చట్లు చెబుతాను వినండి.
                                               ***
దాదాపు నూరేళ్ళ క్రిందట ఉత్తరాంధ్ర ప్రాంతంలో  మధురాపంతుల పేరయ్య గారనే సంగీత విద్వాంసులుండే వారు. వారు కాస్త భూ వసతి కలిగిన వారేమో భుక్తికి లోటు లేదు.ఆయన  తంజావూరులో సంగీత సాధన చేసి వచ్చిన వారు. సంగీత విద్యలో ఆరి తేరిన వారు కనుక శిష్యులకు సంగీత పాఠాలు చెబుతూ కాలక్షేపం చేసేవారు. కొంచెం కోపిష్టి కూడా కావడంతో శిష్యులు ఏ తప్పు చేసినా సహించే వారు కాదట. ఆయన వద్ద సంగీతం నేర్చుకోవడమే గొప్ప కనుక శిష్యులు వారి కోపాన్ని భరిస్తూ అణకువగా జాగ్రత్తగా మసలుకునే వారట. ఈ సంగీత కళానిధి  విజయనగరాధీశుల మన్ననని కూడా పొందిన వారు. ఆయన ఒక రోజు ఒక ఊళ్ళో సంగీత కచేరీ చేస్తున్నారట. అందరూ శ్రధ్ధగా వింటూంటే సభలో ఒక చోట ఒక ప్రభుత్వాధి కారి ప్రక్కవారితో సంభాషణ పెట్టకోవడం ఆయన కళ్ళ పడ్డది. వెంటనే కచేరీ ఆపేసి కోపంగా అటువైపు చూసేరట. సంగతి గ్రహించిన ఆ అధికారి ఏదో సర్ది చెప్పుకోడానికి ప్రయత్నిస్తుంటే
ఇది నా కచేరీ. నీ కచేరీలో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు లేచి వెళ్ళాకే తిరిగి నా కచేరీ ప్రారంభమవుతుంది. అంతే అన్నారు. ఆ నాడు ఆ అధికారి నిష్క్రమించాకే తిరిగి కచేరీ జరిగిందనుకోండి. అతి తక్కువ మంది ప్రభుత్వోద్యోగులుండే ఆ రోజుల్లో వారి హుకుం నిరంకుశంగా సాగే రోజుల్లో ఇలా తమ గౌరవానికి భంగం కలుగకుండా చూసుకోగలగడం గొప్ప విషయమే కదా? ( ఈ కథ విన్నప్పుడు మీకు శంకరాభరణం శంకర శాస్త్రి గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఆయనా ఇలాంటి వాడే కదా? )
                                              ****

                                          ఈ రెండో ముచ్చట హరికథా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాలుగా ఉంటున్న రోజులలో జరిగినదీ వారికే సంబంధించినదీను. దాసు గారు కొంచెం భోజన పుష్టి కలవారు కనుక భోజనం చేయగానే భుక్తాయాసం వల్ల కొంచెం సేపు కునుకు తీయడం వారికి తప్పని సరయ్యేది. అలా ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎండ మండి పోతూ ఉండగా ( అందులో మా విజయ నగరం ఎండల సంగతి చెప్పేదేముంది )  దాసు గారు వారి ఆఫీసు ( సంగీత కాలేజీ ప్రిన్సిపాలు గది ) లో చిన్న అంగోస్త్రం మాత్రం ధరించిన వారై బెంచీ మీద కునుకు తీస్తూ ఉన్నారట. గాలి ఆడడానికి తలుపులు తీసే ఉన్నాయి. అయ్యగారు నిద్రలో ఉన్నారు కనుక బంట్రోతుకు చుట్టకాల్చుకునే ఆట విడుపు సమయమది. అతడందుకే దూరంగా పోయి ఎక్కడో తన్మయంగా చుట్ట కాల్చుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక విద్యాధికారి వచ్చి ప్రిన్సిపాలు గది తలుపులు తెరిచే ఉండడం చూసి లోపలికి ప్రవేశించాడట. దాసుగారిని ఆఫీసులో ఆ భంగిమలో చూసేసరికి ఆ అధికారికి అవమానంగా తోచి కోప కారణమయ్యిందట. ఆ అధికారి వెంటనే గద్దిస్తూ దాసుగారిని ఏదో అన్నాడట. వెంటనే దాసుగారు ఏయ్ మిష్టర్ నువ్వెవరైనా సరే. ఇది నా ఆఫీసు. ఇందులో నా యిష్టం వచ్చినట్లు ఉంటాను. నా అనుమతి లేకుండా లోపలికి రాకూడదని తెలియదా? నువ్వు ముందు బయటకు నడువు. నేను పిలిపించి నప్పుడు లోపలికి వద్దువు గానివి. అన్నారట. బయటకు నడుస్తున్న ఆ అధికారి ముఖంలో నెత్తురు చుక్కఉండి ఉండదు. ఉద్యోగాలు ఊడిపోతాయేమో నన్నభయంతో పై అధికారుల అడుగులకు మడుగులొత్తేవరెవరైనా అలా మాట్లాడగలరా? అది ఆత్మ గౌరవానికి ప్రతిరూపమైన ఆ ఆదిభట్ల దాసు గారికే సాధ్యం.
                                                ***
ఇవి విన్నాకైనా ఆత్మగౌరవమనేది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో మనకి అర్థమౌతుందా? దానికోసమేమైనా యాత్రలు చేయాలా?
                                                ***    








6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కూట గురువులూ...కొంగ జపాలూ...


ముందుగా  చిన్నప్పుడు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని ఈ  కథ విని ఉండని వారికి   కొంగజపమంటే ఏమిటో తెలియదు కనుక కొంచెం వివరిస్తాను. ఒక కొంగ వార్థక్యం చేత చేపల్ని వేటాడే శక్తి లేక ఒక యుక్తి పన్ని చెరువు గట్టు మీద ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తున్నట్లు నటిస్తూ ఉండేదట. దాని ఈ చర్యకు ఆశ్చర్య పోయిన చేపలు గట్టు దగ్గరకు చేరి ఏమి స్వామీ దేనికీ తపస్సు అని అడిగాయట. అప్పుడా కొంగ నాకిప్పుడే కోరికలూ లేవు కానీ మీగురించే నా బెంగ.కొద్ది రోజుల్లో ఈ చెరువు ఎండిపోనుంది. అప్పుడు  మీరందరూ ఎండి మాడి చచ్చి పోతారన్నదే నా దిగులు అంటూ నిట్టూర్చిందట. అప్పుడా చెరువు లోని చేపలూ పీతలూ
స్వామీ మరి మాకు దిక్కెవ్వరు . ఆ అపాయం నుంచి తప్పించుకునే మార్గం లేదా అని అడిగితే ఆ కొంగ జవాబుగా లేకేం ఉంది. కొండకి ఆవలి ప్రక్కన ఎన్నటికీ ఎండిపోని చెరువొకటుంది.అక్కడ మీరు ఎన్నాళ్ళయినా హాయిగా జీవించ వచ్చునని చెప్పింది. మరి అక్కడికి చేరే తరుణోపాయం ఏమిటని అడిగిన చేపలకు కొంగ వాటి నక్కడనుంచి రోజుకు కొన్ని చేపల చొప్పున కొండ అవతలి చెరువులోకి తానే చేరుస్తానని చెప్పి రోజూ కొన్ని చేపలను నోటకరచుకు వెళ్ళి దారిలోనే గుటకాయ స్వాహా చేస్తుండేదట. ఆ చెరువులో ఉండే ఒక పీతకెందుకో కొంగ మీద గురి కుదరలేదు. తాను తన చేతులు కొంగ మెడచుట్టూ వేసి పట్టుకుంటాననీ తనని కూడా తీసుకెళ్ళమనీ ప్రాధేయపడితే ,  కొంగ పీతనలాగే తీసుకెళ్తూ ఉండగా, దానికి దారిలో కొండ మీద అంతకు ముందు కొంగ తిని పారేసిన చేపల అవశేషాలు కన్పించి కొంగ మోసం గ్రహించినదై చటుక్కున దాని పీకను నొక్కి చంపేసిందట. అందుకే మనకొంప ముంచాలనే కోరిక తో మనకి సాయం చేస్తున్నట్లు నటించే వారిని  కొంగ జపం చేస్తున్నాడంటారు.
                                                        ****
అలా కొంగ జపం చేస్తూ నమ్మిన శిష్యుల కొంపలు కూల్చే కూట గురువులకి లోకంలో కొదవ లేదు. శిష్యుల బాధలను హరింప చేసి  శిష్యహృత్తాపహారులు కావలసిన వీరు శిష్య విత్తాప హారులైన సంఘటనలు కో కొల్లలు. సద్గురువులు లేరని కాదు కాని వారు సకృత్తుగానే ఉంటారు. మిగిలిన వారు కూటగురువులే. అంటే పామర భాషలో దొంగ సన్నాసులే. కామ, క్రోధ లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు గుణాలూ మన  అంతశ్శత్రువులనీ వాటిని జయించ కుండా మనకి ముక్తి రాదనీ నిత్యం బోధించే ఈ గురువులు వీటికి వేటికీ అతీతులు కానే  కారని వారి ప్రవర్తనే చెపుతుంది. ఇప్పుడు వార్తల్లో ఉన్న , తన పేరులో రాముణ్ణీ, మన జాతిపిత బిరుదైన బాపూనీ తగిలించుకున్న ఒక గురూజీ  మైనర్ బాలిక మీద  అత్యాచారం చేసాడనే  అభియోగాన్ని ఎదుర్కుంటూ జైలు పాలయ్యాడు.. తన ఆశ్రమం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడట. ఈయనకు పాద పూజ చేసి మనం తరించాలంటే లక్షా పాతిక వేలు కక్కాల్సిందేనట. ఈయన గారి ఆశ్రమం  వివిధ దేశాలలో ఎన్నో బ్రాంచీలతో  వందల కోట్ల సిరిసంపదలతో వర్థిల్లుతోందట. ఆ మధ్య సినీ తారతో కేళీ విలాసాలలో తులతూగుతున్న
 నిత్యానందుల్నీ మనం చూసాం. ఇలా ఎంతమందో. అయితే చాలా మంది అనుకునేదేమిటంటే  ఇటువంటి స్వాములు మునుపటి కాలంలో లేరేమోనని. మరీ పాత కాలం సంగతుల రికార్డు మనకి దొరకదు కానీ ఓ వందేళ్ళ క్రిందట ఉన్న ఇటువంటి శిష్యవిత్తాపహారుల ముచ్చటలు కొన్ని  విని తీరవలసినవి  నాకు తెలిసినవి చెబుతాను వినండి.
                                                       ****
ఓ వంద సంవత్సరాల క్రిందట పిఠాపురం ప్రభువులైన శ్రీ గంగాధర రామారావు గారు వైష్ణవ సంప్రదాయానుసారులైనందు వలన వారి గురువులైన జీయరు స్వాముల వారిని ఆహ్వానిస్తే వారు వారి జమీందారీ లోని కడియం గ్రామానికి విచ్చేసారట. రాజుగారు వారిని దర్శించుకున్నప్పుడు వారి పాద పూజ చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించమని కోరితే అందుకు పాదకట్నంగా కనీసం లక్ష రూపాయలైనా సమర్పించాల్సి ఉంటుందని స్వామి వారు సెలవిచ్చారట. అందుకు తగిన తాహతు తనకున్నా స్వామి వారి అత్యాశకు ఏవగింపు కలిగిన రాజు గారు యాభైవేలు సమర్పించుకుందుకు సిధ్ధపడ్డారట. కాని దానికి అంగీకరించని స్వాముల వారి వైఖరికి నొచ్చుకున్న రాజా వారు తన  పేరు లోనే శివ కేశవులిద్దరూ ఉన్నారు కనుక తనకు రెండు మతాల్నీ పాటించడం ధర్మమే అవుతుందని అంటూ తన వెనుకనే నిలుచుని ఉన్న తన ఆంతరంగికుని సంచీలో ఉన్న విభూది ఇమ్మని అడిగి ద్వాదశ పుండ్రాలూ ధరించారట. చెయిజారిపోయిన చేపను చూసిన కొంగ లాగా  శిష్యవిత్తాపహారులైన ఆ స్వాముల వారు అవాక్కయిపోయారట.
                                                 ****
అప్పటి కాలానికి చెందినదే మరో ముచ్చటేమిటంటే,  రాజమండ్రిలో ఓ సంపన్న గృహస్తు గృహాన్ని పావనం చేయడానికి విచ్చేసిన ఒకస్వాముల వారి ఆంతరంగికులు గృహస్తుకిచ్చిన   వారికి కావలసిన సామాన్ల లిస్టులో బ్రాందీ కూడా ఉండడం చూసిన గృహస్తు అటువంటివి తాము సేవించము కనుక తెప్పించ లేమని మనవి చేసుకుంటే ఆ స్వాముల వారు తమకే ఎదురు చెప్పేంత వాడవైనావా అంటూ అగ్రహోదగ్రులై శపించబూనితే  ఆ గృహస్తు తల్లిగారు క్షమించమని వేడుకుంటే దానికై ఓ పాతిక రూపాయలు బిల్లు వేసి శాంతించారట.
                                                ****
మరో ముచ్చట కూడా అప్పట్లోనే ఇప్పటి  శ్రీకాకుళం జిల్లా లోని ఓ గ్రామంలో  జరిగింది. ఆ చిన్న గ్రామంలో ఓ పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేదట.కుటుంబమంటే తల్లీ దండ్రులు లేని అయిదుగురు అన్నదమ్ములు పేదరికం వల్ల ఎవరికీ పెళ్ళిళ్ళు కాకపోవడంతో ఎలాగో బ్రతుకీడుస్తూ కలిసి ఉండేవారట. కన్యాశుల్కపు రోజులు కనుక ఎంతో కొంత ధనం లేకపోతే మగ వారికి పెళ్ళిళ్లు జరిగేవి కావు. ఎలాగైనా వారిలో  చిన్న తమ్ముడికైనా  పెళ్లి చేయాలని అయిదు వందల రూపాయలు కష్టపడి దాచుకున్నారట. ఇంతలో వారికో అవాంతరం వచ్చి పడింది. ఒక రోజు ఆ చిన్న వాడు కరణంగారు వీధి అరుగు మీద  కూర్చున్నప్పుడు ఆవీధిలో గేదెను తోలుకెళ్తున్నాడట. కరణంగారేదో అనడం దానికి ఈ కుర్రాడు తల తిక్కగా సమాధానం చెప్పడం లాంటిదేదో జరిగిందట. అప్పుడు కరణం గారి ప్రక్కనే నిల్చున్న వంట బ్రాహ్మడు కరణంగారికే ఎదురు చెప్తావట్రా అంటూ అడ్డురావడంతో ఈ కుర్రాడు చేతిలోని కర్రతో ఒక్క వేటు వేస్తే ఆ అర్భకుడు హరీ మన్నాడట.  ఏదో పోలీసు కేసయిందట గానీ దాని వివరాలు మనకి తెలియవు. అయితే బ్రహ్మ హత్యా దోషమని చెప్పి ఆ కుటుంబాన్ని బ్రాహ్మణ్యం వెలివేసారట. ముందు ఈ వెలినుంచి బయటపడితే కాని వివాహం జరిపించే యోగం లేనందువల్ల  ఆ దగ్గరలోని ఓ స్వాముల వారిని ఆశ్రయిస్తే  వారు ప్రాయశ్చిత్తం చేయించడానికి వెయ్యి రూపా యలు అడిగారట. ఈ పేద బ్రాహ్మలు తమ్ముని పెళ్లికై  దాచి ఉంచిన  సొమ్ము మాత్రం సమర్పించుకో గలమని తమను కృతార్థులను చేయమని వేడుకుంటే అయిష్టంగానో ఏమో ఆయన అంగీకరించి వచ్చాడట. కానీ ప్రాయశ్చిత్తం రోజున బ్రాహ్మణ్యం అంతా భోజనానికి వచ్చి కూర్చున్న తరుణంలో ఆ స్వాముల వారు ఔపోసన పట్టకుండా ఇంకా సొమ్ము కావాలని కొర్రెక్కి కూర్చున్నాడట. అప్పటికి స్వాముల వారి ప్రవర్తనతో విసుగెత్తి పోయిన ఆ బ్రాహ్మణ యువకుడు ఆయన ముందు నిల్చొని అప్పటికే వేళ మించి పోవడం వలన బ్రాహ్మణ్యం అంతా ఆకలితో ఉన్నారనీ వెంటనే ఔపోసన పట్టమనీ లేకుంటే తానిదివరకే ఒక బ్రహ్మ హత్యా పాతకాన్ని చుట్టుకొని ఉన్నాడు కనుక కొత్తగా తనకు  వచ్చే పాపమేమీ ఉండదు కనుక ఆయనను వేటు వేయడానిక వెనుకాడేదేమీ లేదనీ బెదిరించేసరికి ఆ స్వాముల వారు కిమ్మనకుండా ఔపోసన పట్టాడట.
                                                           ****
కథలో పీతకున్నపాటి తెలివితేటలూ, ఆ బ్రాహ్మణ యువకునికున్నపాటి తెగువా తెంపరితనమూ లేకపోతే  కూట గురువులూ వారి కొంగ జపాలూ శతాబ్దాలు దాటినా కొనసాగుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత. సెలవు.
                                                           ****
పై మూడు ముచ్చట్ల లో మొదటి రెండూ కీ.శే. శ్రీ చెళ్ళపిళ్ళ వారు గ్రంథస్తం చేసినవయితే, మూడవది తన చిన్నతనంలో జరిగిన సంఘటనగా విన్నానని నాకు తెలియజేసిన వారు  93 ఏళ్ళ వృధ్ధులు  మా వియ్యంకులు శ్రీ పట్రాయని సంగీత రావు గారు. వారిద్దరికీ కృతజ్ఞతలు.

                                                         **** 

27, ఆగస్టు 2013, మంగళవారం

తెలంగాణా సమస్యకు పరిష్కారం ఉందా?


తెలంగాణా సమస్య జటిలమైనదే. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఎంత జటిలమైన సమస్యకైనా పరిష్కారం లేకుండా పోదు. కాకపోతే సమస్య ఎవరిదో వారే పరిష్కరించుకోవాలి. లేదా వారికి ఉభయులకీ నచ్చిన వారు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. తెలంగాణా సమస్య తెలుగు వారి సమస్య. ఈ సమస్య పరిష్కారంలో కష్టనష్టాలేమైనా వస్తే అవి మన తెలుగువారివే. అసలు సమస్యల్లా ఇది ఒక్క అధికార పార్టీదో లేక ఆ పార్టీ అధినేత్రిదో వారే నిర్ణ యం తీసుకోలేరనీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా మనం వ్యతిరేకించి పబ్బం గడుపుకోవచ్చన్న దురాలోచన పరులైన రాజకీయుల వలన వచ్చినదే. మన తెలుగు వారికి రాజనీతిజ్ఞులైన నాయకులు ఏ పార్టీలోనూ లేరు. నిష్టురమైనా ఇది పచ్చినిజం.ఇది ఏ ఒక్క పార్టీకో కాదు తెలుగు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి వర్తిస్తుంది. ఈ సమస్య మనందరిదీ కనుక ఇరువైపుల వారూ ఒకచోట కూర్చుని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే ఏదో ఒక పరిష్కారం దొరకక పోదు. స్వల్పకాలిక ప్రయోజనాలకన్నా, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారించి సమస్యకు సత్వర శాశ్వత పరిష్కారం కనుగొనడం అత్యవసరం. అయితే అసలు సమస్యల్లా  తాము నడుస్తున్నది తప్పుదారిలోనో సరైనదారిలోనో తెలియకుండా ముందుకు సాగుతున్న జనం ముందుకు తాము ఉరికి వారిని తామే నడిపిస్తున్నామనే భ్రమకలిగించే నాయకులవల్లనే. తాము సరైన మార్గాన్ని ఎంచుకుని ప్రజల్ని అటుమళ్లించగల నాయకులే మనకు లేరు. రోజూ ఎదుటివారికి సిత్త సుద్ది లేదంటూ ఆక్రోశించడమే కాని నిజమైన చిత్తశుధ్ధి గల నాయకులే మనకీనాడు కరువయ్యారు. నాయకులంటే ఎలా ఉండాలో తెలిపే ముచ్చట ఒకటి చెబుతాను వినండి.
                                               ****
1951-52 మధ్య ఒకరోజు మన పార్లమెంటు సభలో జరిగిన ముచ్చట ఇది. సభలో ఒక సభ్యుడు లేచి నిల్చొని ఒక చిన్న కోరిక అంటూ మొదలు పెట్టి  భారత ప్రభుత్వం వారు నా సంస్థకుగాని, వేరే ఇతర సంస్థకు గాని, లేక ఏదేని యూనివర్సిటీకి గాని నాలుగుకోట్ల రూపాయలు విరాళమిస్తే నేను ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రమపడి దేశాన్ని అణుశక్తిరంగంలో అభివృధ్ధి చేస్తాను అన్నాడు. ఆ సభ్యుడు శాస్త్రవేత్త అయిన మేఘ్ నాథ్ సాహా. ఆ వెంటనే మన ప్రధాన మంత్రి  నెహ్రూ గారు లేచి అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సంపాదించుకున్న మన ప్రభుత్వం ఇటువంటి ( Foolish)  పిచ్చి తలతిక్కధోరణిని హర్షించదు అని కూర్చున్నారట. నెహ్రూ గారు అన్నమాటలకి సభలో ఎవ్వరూ ఎటువంటి అభ్యంతరం తెలుపలేదట. ఆ నిశ్శబ్దం లో సభాపతి తర్వాతి అంశాన్ని ప్రకటించారట. అప్పుడు నెహ్రూ గారు మళ్లా లేచి ఐక్యరాజ్య సమితి కార్యదర్శి మన ప్రభుత్వానికో లేఖ వ్రాసేరనీ, దానిలో ప్రపంచ పంచాంగ రచనకు మనదేశం తరఫున  సారధ్యం వహించేందుకు మేఘ్ నాథ్ సాహా వంటి శాస్త్రవేత్తను పంపాల్సిందిగా కోరారనీ, దానిని  తానుసంతోషంగా బలపరుస్తూ సాహా గారి అంగీకారాన్ని కోరుతున్నాననీ అన్నారుట. కానీ ఆ మాటలు వినడానికి సాహా గారు సభలో లేరు. ఆశ్చర్యపోయిన నెహ్రూగారు సభను నడిపిస్తూ ఉండమని  సభాపతిని కోరి, తాను సాహాగారిని తోడ్కొని వస్తానని బయటకు వెళ్లి ఆయనను వెతికి తీసుకు వచ్చారట.ఆ తర్వాత నెహ్రూ గారు సభలో తన అభ్యర్థనను మరోసారి చేయగా దానికి సాహా గారు లేచిఇంతటి మహత్తరమైన దేశానికి తనవంటి మూర్ఖుడు (Fool)  ప్రాతినిధ్యం వహించడం తగదని అంటూ కూర్చున్నాడట. నెహ్రూ గారు వెంటనే లేచి తాను ఆయనను Fool  అన లేదనీ  ఆయన ప్రతిపాదనను మాత్రం  Foolish  అన్నాననీ ఆ మాట  unparliamentary కాదనీ ఒక వేళ తన వంటి పెద్ద మూర్ఖుడు  (Greater Fool)  ఆవేశంలో ఏదో అన్నా సాహా వంటి పెద్దమనిషి దానిని పట్టించుకోవడం అన్యాయం కాదా? అన్నారుట. అప్పుడు సభాపతి గా ఉన్న శ్రీ మవ్లంకర్ గారు సాహాగారూ ఇది సభాపతి అభ్యర్థన అనడమూ దానికి వెంటనే సాహాగారు లేచి తాను దానిని శిరసావహిస్తున్నాననడమూ టకటకా జరిగిపోయాయట.
                                                                   ****
ఎన్ని సార్లు సభ వెల్ లోకి వచ్చి ఎంత గొడవ సృష్టించారో,  ఎన్ని పత్రాలు చింపిపెట్టారో, ఎన్నిమైకులు విరగ గొట్టారో అన్నది తప్ప ఆ నాటి సభవంటి  సభా దృశ్యాలను గాని  అటువంటి నాయకులని గాని మనమిప్పుడు చూడగలమా?
అందరూ అటువంటి నాయకులే అయితే ఎటువంటి సమస్య అయినా దూది పింజలా తేలిపోవలసినదే కదా?
ఇప్పుడు మనకున్నది తెలంగాణా సమస్య కాదు. మనకున్న నాయకులతో వచ్చిన సమస్య. సమస్యలు రాకుండా మంచినాయకులనే ఎన్నుకుందామా?
                                                                 ****
పార్లమెంటులో జరిగిన ముచ్చటని స్వయంగా చూసి తన స్వీయ చరిత్ర విన్నంత  కన్నంత లో రికార్డు చేసినది శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారు. వారికి  నా ధన్యవాదాలు.

                                                 ****

26, ఆగస్టు 2013, సోమవారం

కందాలూ ... మకరందాలూ ...

నా కందాలూ ... మకరందాలూ ... పుస్తక రూపంలో ఇక్కడ చదవండి. మీ అభిప్రాయం తెలియ జేస్తారు కదూ ?

4, ఆగస్టు 2013, ఆదివారం

గుడి లోని రాయిలో శివుడు లేడోయీ...

          
గుడి లోన రాయిలో శివుడు లేడోయీ
ఆడలేనీ శివుని వెదుక బోకోయీ..
బదరినాథము గాని కేదారమున గాని
యమునోత్రి గంగోత్రి ఏడనైనా గాని
గుడిలోని రాయిలో శివుడు లేడోయీ
ఆడనేడను వాని వెదుకబోకోయీ...
చపలకాంతులతోడ చదలనుండెడి గంగ
వెలికొండ వెల్వెడలి వెర్రులెత్తిన గంగ
ఉగ్ర రూపము దాల్చి ఉరికురికి రాగ
తలదాల్చి బంధించ తన చేతగాక
ఓపలేనీ శివుడు ఊరొదిలి పోయాడు.
తన దర్శనము కోరి తరలి వచ్చిన జనము
దిక్కు తోచని వేళ దీనులై భీరులై
త్రాత నీవే యనుచు యనుచు తపియించినా గాని
కావలేకా శివుడు గాయబైనాడు.
              ***
ఆడలేనీ శివుడు ఏడనున్నాడోయీ
ఆర్తులను కావంగ ఆకాశ మార్గాన
అన్నపానముల తెచ్చి ఆదుకున్నా వారి
గుండెలను గుడిగా చేసుకున్నాడోయి.
 అలుపన్నదే లేక  అహరహము శ్రమియించి
ఆర్తులందర గూర్చి ఆ కొండ పైనుండి
ఈవలొడ్డున చేర్చి ఇడుమలను బాపినా
దండు బంటుల గుండె దిటవులో కలడోయి.
                 ***
నీలోన నాలోన మనుజులందరిలోన
చిదాత్మ రూపుడై  చిత్తమందే గలడు
కరుణ గల్గిన గుండె నిండియుంటాడతడు
ఎద తలుపులను తీసి ఎలుగెత్తి పిలిచితే
లోపలుండే శివుడు ఓ యనుచు పలుకు
పూలదండలు వేసి పూజింప పని లేదు
పంచాక్షరీ మంత్ర పఠన మక్కర లేదు
అభిషేక జలములతొ అసలు పనిలేదు
కాస్తంత కరుణతో గుండె నింపిన చాలు
కరకంఠుడిచటనే కాపురమ్మై నిలచు
సర్వులను ఆతడే  సతతమ్ము కాచు.
గుడిలోని రాయిలో శివుడు లేడోయీ
ఆడనేడను వాని వెదుక బోకోయీ...
                  ***    
ఇది అపురూపం అందిస్తోన్న నూరవ పుష్పం. ఇవాళ స్నేహితుల దినోత్సవమట. ఇన్నాళ్లూ బ్లాగుని ఆదరించిన మిత్రులందరికీ అపురూపం  స్నేహాంజలి ఘటిస్తోంది.  సెలవు.
                  ***



17, జులై 2013, బుధవారం

పండితులూ..కవులూ... వారి ధిషణాహంకారమూ...


పూర్వ కాలంలో పండితులకీ కవులకీ-కాస్త భూవసతి కలిగి ఉన్నవారి కేమోగాని – మిగిలిన వారందరికీ  భుక్తికోసం  రాజాశ్రయం తప్పని సరి అయ్యేది.ఏదో ఒక రాజుగారి ప్రాపకంలో జీవించడమో లేకపోతే  దేశాటనం చేస్తూ ఎంతో మంది రాజులను సందర్శిస్తూ వారిచ్చే వార్షికాలను స్వీకరించి రోజులు వెళ్లబుచ్చడమో చేసేవారు. ఇందుకోసం వారు తగిన వారినీ తగని వారినీ ఇంద్రుడూ చంద్రుడూ అంటూ మిథ్యాస్తుతులు చేస్తూ పబ్బం గడుపుకునే వారు. అయితే ఇది సామాన్యులైన పండితులూ కవుల సంగతి కానీ ఉద్దండులైన కవి పండితులు మాత్రం  దేహీ అని యాచించక రసజ్ఞులైన రాజులను మెప్పించి వారి మర్యాదలనూ మన్ననలనూ పొంది చాలా హుందాగా జీవనం గడిపేవారు. వారి మరియాదకు లోటురాకుండా  వారి మాటే చెల్లుబడి అయేటట్లు జీవించిన తృణీకృత బ్రహ్మపురంధరు లనదగ్గ వారు కొద్ది మందే అయినా ఉండేవారు. అప్పట్లో వారి ఆభిజాత్యాన్ని, ధిషణాహంకారాన్ని మన్నిస్తూ వారిని సగౌరవంగా చూసుకున్న రసజ్ఞులైన రాజశేఖరులూ ఉండేవారు. అట్టివారిలో విజయనగర, పిఠాపురాధీశులు పేరుపడ్డవారు.ఇటువంటి సంస్థానాదీశులూ వారి మన్ననలకు పాత్రులైన కవుల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాలని పిస్తోంది. ఆసక్తి కల వారు అవధరించండి:

ఇంతకు ముందు నేను దండిభొట్ల వారి దర్జా అనే పోస్టులో దండిబొట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఎంత హుందాగా బ్రతికేరో చెప్పాను. ఆయనొక సారి పిఠాపురం సంస్థానానికి రావడం జరిగిందట. పిఠాపురం రాజు గారికి సంస్కృతంలో కొంత శ్రుత పాండిత్యం ఉందట. అందుచేత ఎవరైనా పండితులు వస్తే వారితో సంస్కృతంలో నే సంభాషించాలని ఉబలాట పడేవారట. దండిభొట్ల వారితో అలాగే సంభాషించడానికి మొదలు పెట్టే సరికి వారు "రాజా నీవు నాతో తెలుగులో మాట్లాడితేనే నేనిక్కడ ఒక్క క్షణమైనా ఉండేది. లేకపోతే నీ రాజ్యం రాసిస్తానన్నా ఒక్క నిముషం కూడా ఇక్కడ ఆగను" అన్నారట. రాజుగారు ఆయన మాట మన్నించి తెలుగులో సంభాషణ మొదలు పెట్టారట. ఇక్కడ గమనించ వలసిన మరో విషయం ఏమిటంటే పిఠాపురం రాజుగారికి కోపం వస్తే అవతలి వాడు ఎంతవాడయేది గమనించక  తానే స్వయంగావాడి పిలక కత్తిరించేవాడట. ఆతర్వాత కోపం తగ్గాక  తానే మళ్ళా వారికేదో పరిహారం సమర్పించుకునే వాడట. అటువంటి రాజు గారు కూడా దండిభొట్ల వారి మాటను మన్నించారంటే వారికి పండితులూ కవుల పట్ల ఉన్న అపార గౌరవమే కారణం కదా.

విజయనగర సంస్థానానికి సంబంధించిన ముచ్చటేమిటంటే  రాజు గారు తమ ఆస్థానానికి రమ్మని శ్రీ పరవస్తు రంగాచార్లయ్యవార్లంగారిని ఆహ్వానిస్తే తన యేర్పాటు ప్రకారం అనుమతిస్తేనే రాగలనని అన్నారుట. ఆ యేర్పాట్లేమిటంటే  1. కోటగుమ్మం వరకూ సవారీలో వెళ్లడం. 2. అక్కడి నుండి పాదుకలతో నడచి సభ వరకూ వెళ్లడం 3. అక్కడ పాదుకలు వదలి చిత్రాసనం పై కూర్చోవడం. దీనికి రాజు గారు తమకేమీ అభ్యంతరం లేకపోయినా సభలో ఆచార్యులవారు చిత్రాసనం పై కూర్చుంటే తమ పండితులకు అవమానంగా ఉంటుంది కనుక వీలు పడదన్నారట. అందుచేత  రంగాచార్యుల వారు ఆ ఆహ్వానాన్ని నిరాకరించారట. తమ ఆస్థాన పండితుల మర్యాదని కాపాడడానికి రాజుగారు ప్రయత్నిస్తే, ఆచార్యులవారు తాము తృణీకృత బ్రహ్మ పురంధరులనిపించుకున్నారు.
పెద్దాపురం ప్రభువులు మాగాపు శరభ కవిగారి పేరు వినడమేగాని ఆయననెప్పుడూ చూసిఉండలేదు. ఒకసారి ఆ రాజుగారు స్వయంగా ముమ్మిడివరం దాపున ఉన్న మాగాం గ్రామానికి వెళ్ళేసరికి అక్కడ పుట్టగోచీ పెట్టుకుని తన అరటితోటలో మొక్కలకు గొప్పులు తవ్వుతున్న శరభ కవిగారు కనిపించారట. రాజు గారికి ఏమనిపించిందో ఏమో గాని కవిగారు వినేటట్లుగానే "ఇతడేనా శరభ కవి"  అన్నాడట. ఈ ఏకవచన ప్రయోగానికి కవిగారికి మనసునొచ్చిందేమో  "వత్సవయి తిమ్మక్ష్మావిభుండీతడా..." అంటూ  తానూ ఏక వచన ప్రయోగం చేస్తూ  ఆశువుగా ఒకటి కాదు రెండుకాదు  ఏకంగా అరవై పద్యాలు చెప్పాడట. ఆ విధంగా రాజుగారు తెలిసో తెలియకో తనను ఒక్కసారి ఏకవచంలో సంబోధిస్తే, కవిగారు ఆయనను 60 సార్లు ఏకవచనంలో సంబోధించి కసి దీర్చుకున్నాడన్నమాట.ఆయన ఎంత విద్వత్కవి కాకపోతే ఉన్నపాటున అనర్గళంగా 60 పద్యాలను ఆశువుగా చెప్పగలడు ? అటువంటి కవిగారికి ధిషణాహంకారం కూడా అలంకారమేకదా.

పంతమంటే పంతమేనని పట్టుక్కూర్చున్న పండితులవారి ఉదంతం ఒకటి మాత్రం చెప్పి ముగిస్తాను.
దాదాపు నూరేళ్ళ క్రితం- 1900-1910 ప్రాంతాల్లో పిఠాపురం రాజావారికి  పండిత సభలు జరిపించి తర్కమూ- వ్యాకరణమూ- వేదాంతమూ- ఈ మూడు శాస్త్రాలలోనూ ఏటేటా పరీక్ష లు నిర్వహించి సంస్కృత పండితులకు వార్షిక సన్మానాలు చేస్తూ ఉండాలనే సదుద్దేశం కలిగింది. ఆవిధమైన పత్రికా ప్రకటన కూడా ఇచ్చారుట. అయితే ఆ విధమైన పరీక్షలు నిర్వహించడానికి సమర్థులైన పండిత శ్రేష్టులెవరని ఆలోచిస్తే ఆరోజుల్లో విజయనగరంలో ఉంటున్న ఉద్దండ పండితులైన శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారు, పేరి కాశీనాథ శాస్త్రులవారు, గుమ్మలూరి సంగమేశ్వరశాస్త్రులవారు, ఆదిభట్ల రామమూర్తి శాస్త్రులవారూ కనిపించారు. వారిని సంప్రదిస్తే వారు తమకు ఎలాంటి పరీక్షలైనా ఉండే పక్షం లో తాము రామని తెలియజేసారు. దానికి రాజుగారు అట్లాంటివేవీ ఉండవని చెప్పి ఒక రోజుముందుగానే వారిని రావలసిందని దీవాను గారి ద్వారా కబురంపేరు. వారు ఆ రీతి గా వచ్చారు. వచ్చి దివాణం హాల్లో కూర్చున్న పండితులలో మొదటగా సుబ్బరాయ శాస్త్రి గారిని లోనికి పిలిపించి రాజుగారు "అయ్యా తమరి మంగళాచరణంతోనే మా పండిత  సభా కార్యక్రమాన్ని తమరు ఆరంభించాలి"  అనగానే శాస్త్రిగారు పాణినీయంలోని  మొదటి సూత్రం " వృధ్దిరాదైచ్ " అని చదివారట. రాజుగారు శుభం అని పలికి, అలాగే గుమ్మలూరి వారినీ ఆదిభట్లవారినీ పిలిపించి అడుగగా వారూ తమ శాస్త్రం లోని మంగళకరమైన శ్లోకభాగాల్నిచదివారట. రాజుగారు భేష్ అని మెచ్చుకుని ఆఖరుగా పేరి వారిని పిలిచి తమరూ  మీశాస్త్రంలోనిది ఒక శబ్దం వినిపిస్తే  పరీక్షకవర్గ నిర్ణయం పూర్తవుతుందని అన్నారుట. దానికి పేరివారు  అది కూడా ఒక పరీక్ష లాంటిదేనని అంగీకరించలేదట. దానికి రాజుగారు "మిగిలిన ముగ్గురు పండితులూ మమ్మల్ని అనుగ్రహించేరు. వారిని పరీక్షకులుగా ఏర్పరచుకున్నాం ..తమరుకూడా తమకు తోచినదేదైనా ఒక్కముక్క చెప్పి ఈ వర్గంలో చేరితే మాకు పరీక్షల సమస్య పూర్తవుతుంది, తమముఖతః ఏదయినా ఒక్కసూత్రం వినాలనుంది" అని  అన్నారుట. దానికి పేరి వారు ససేమిరా అంటూ రాజుగారి కోరిక మరునాడైతే సరే గాని ఆ రోజు ఏంచేసినా అది తమను పరీక్షించడం క్రందే వస్తుందని చెప్పి అక్కడనుండి తిరిగి తమ బసకైనా వెళ్ళ కుండా రైల్వే స్టేషనుకు వెళ్లి అటునుంచటే బొబ్బిలి చేరుకుని తమకు పిఠాపురం లో జరిగిన ఈ అవమానం గురించి ఆ రాజుగారికి తెలియజేసారుట.బొబ్బిలి వారికీ పిఠాపురం వారికీ ఆ రోజుల్లో బధ్ధవైరమట. బొబ్బిలి రాజు గారు మరునాడు  శాస్త్రిగారిని ఏనుగ పై ఊరేగించి సభ ఏర్పాటు చేసి సన్మానించేరుట.శాస్త్రిగారికి ప్రతీ విజయదశమికీ ఏటేటా నూట పదహారు రూపాయలు వార్షికం వారి ఇంటికే పంపే ఏర్పాటు కూడా చేసేరుట. ఆ విధంగా పేరివారు తమపంతాన్ని నెగ్గించుకున్నారన్నమాట. వారి ధిషణాహంకారం వారిని రాజుల్నిసైతం లెక్కచేయనిచ్చేది కాదన్నదానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.

మనం ఈ నాడు ఆత్మ గౌరవం..ఆత్మ గౌరవం.. అని  కేవలం వల్లిస్తుంటాం.అత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించిన  మార్గదర్శులీ మహనీయులు.
                                                                    ****
 ఈ విషయాల్ని నేను శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రుల వారి గ్రంథాలనుండి గ్రహించాను. ఆ కీర్తి శేషులకు నాకృతజ్ఞతలు.
   

13, జులై 2013, శనివారం

ఒక అరుదైన పుస్తకం-- రాయవాచకం


రాయవాచకమన్న పేరు వినగానే ఎవరికైనా ఇది Royal English Reader లాంటి చిన్న పిల్లలు బడిలో చదువుకునే ఏ తెలుగు వాచకమో అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇది అలాంటి ఆషామాషీ పుస్తకం కాదు. ఏ భాషాభిమానులో భాషాధ్యయనం చేసేవారో తప్ప దీని పేరు కూడా విని ఉండక పోవచ్చు. ఇది చరిత్ర కారులకు బంగారు గని, భాషా వేత్తలకు వజ్రాల ఖని అని పేరొందిన గ్రంథం. గ్రంథమని అంటున్నానే కాని ఇది అరవై పేజీల చిన్ని పుస్తకమే. అయినా ఆంధ్ర వచన వాఙ్మయంలో దీనికొక విశిష్ట స్థానం ఉంది. ఇంతకీ ఇదేమి పుస్తకమో ఎవరు వ్రాసేరో  ఎప్పుడు వ్రాసేరో ఇందులో ఏముందో కొంచెం పరిచయం చేస్తాను.
                                             వాచకం అంటే సమాచారం. ఇది మన శ్రీ కృష్ణ దేవరాయలను గూర్చిన సమాచారాన్ని అందజేస్తుంది కనుక దీనికి రాయవాచకమని పేరు. ఇది వ్రాసిన వాని పేరు మనకు తెలియదు.  అతడు తాను శ్రీ మహా మండలేశ్వర కాశీ విశ్వనాథనాయనయ్య గారి స్థానాపతినని  మాత్రం చెప్పుకున్నాడు. ఈ విశ్వనాథయ్యను మథుర రాజ్యాన్ని క్రీ.శ. 1595 మొదలు 1602 వరకు తన అన్నతో పాటు కలిసి పాలించిన రెండవ కృష్ణప్ప తమ్ముడు విశ్వనాథనాయకునిగా గుర్తించారు. స్థానాపతి అంటే సామంత రాజులూ అమర నాయకూలూ తమ ప్రతినిథిగా తమ  రాజధాని విజయనగరం లో నియమించుకున్న రాజోద్యోగి అన్నమాట. ఇలాగ తనఉద్యోగం పేరు ( Designation ) తో మాత్రమే ఈ రచయిత మన సాహితీ లోకానికి పరిచయం. చాలా తర్జన భర్జనల అనంతరం గ్రంథంలో ఉన్న ఆథారాలను బట్టి ఇది క్రీ.శ. 1592- 1602 మధ్య కాలంలో వ్రాయబడి ఉంటుందని భావిస్తున్నారు.
స్థూలంగా ఈ పుస్తకం కర్ణాటక రాజుల దినచర్యనీ కృష్ణరాయల పట్టాభిషేకాన్నీ ఆయన నిత్యకృత్యాలనీ ఆయన ధనాగారం సైన్యం వంటి వివరాలనీ, ఆయన జైత్రయాత్రకు సంబంధించిన విషయాలనీ తెలుపుతుంది. అయితే ఇది రాయల అనంతరం ఏ అరవై డబ్భై సంవత్సరాల తర్వాతో వ్రాయబడినది కనుక ఈ విషయాలన్నీ రచయితే చెప్పుకున్నట్లు సుజనులు చెప్పగా విని వ్రాసినవి గానే మనం గ్రహించాలి. ఆ కారణంగా ఇతర చారిత్రికాధారాలకూ దీనిలోని విషయాలకూ అక్కడక్కడ కొన్ని వైరుధ్యాలున్నా దీనిని విజయనగర కాలం నాటి రాజుల చరిత్రకు ఉపయుక్త గ్రంథం గానే చరిత్రకారులు పరిగణిస్తారు. పైన చెప్పిన కారణం  వలన పూర్తిగా చరిత్రకారులకేమోగాని భాషాచరిత్రకారులకు మాత్రంఇది నిజంగా గని వంటిదే. దీని లోని భాష గురించి కొంచెం వివరిస్తాను.
ఆది కవి నన్నయ కాలం నుండి కావ్యాంతర్గతంగా అక్కడక్కడా కనిపించడం తప్ప దాదాపు 15వ శతాబ్దం వరకూ స్వతంత్రమైన వచనకావ్యమేదీ వెలువడ లేదు. అప్పుడు కూడా సింహగిరి నరహరి వచనములు శఠకోప విన్నపములు వెంకటేశ్వర వచనములు వంటి మత వేదాంత పరమైనవి పరిమితంగా ఉన్నా వాటిల్లో కూడా  ఏ ఒకటి రెండో తప్ప మిగిలినవన్నీ గ్రాంథిక బాషలో వ్రాసినవే. అందువల్లనే రాయవాచకాన్ని మనం పూర్తిగా వ్యావహారిక భాషలో వ్రాయబడ్డ తొలి వచన రచనగా గుర్తించవచ్చు. రాయవాచకం ఆనాటి వ్యావహారికంలో వ్రాసిన చక్కని వచన గ్రంథం అని పేర్కొన్నారు శ్రీ ఆరుద్ర. రాయవాచకమునందు రచయిత అవలంబించిన శైలి ఆంథ్రము నంద పూర్వమైనది అంటారు శ్రీ కులశేఖర రావుగారు. రాయవాచకంలో రచయిత వాడిన భాష ఆనాటి ద్రావిడ దేశంలో ఉన్న ఆంధ్రుల నిత్యవ్యవహారంలో ఉన్న వాడుక భాష. చిత్రమేమిటంటే, తమిళ దేశం నడిబొడ్డున ఉన్న మధుర నాయక రాజుల కాలానికి  సంబంధించిన రచన అయినా దీనిలో ఒకటి రెండు పదాలు తప్పిస్తే  తమిళ పదాలు గాని దీనిపై ఆ భాషా ప్రభావం కాని కానరావు. మరొక ముఖ్య మైన విషయం ఏమిటంటే రాయవాచక భాష నోటిమాటకూ చేతివ్రాతకూ సామరస్యము కుదిరిన భాష. అంటే ఆనాటి తెలుగు వారు  పదాలను ఎలా ఉచ్చరించారో అలా వ్రాయడం జరిగిందన్నమాట. రాయల కాలంలో రాజకీయ వ్యవహారాలకు సంబంధించినదవడం చేత దీనిలో ఆనాటి రాజకీయుల వ్యవహారాలలో చేరి ప్రాచుర్యంపొందిన ఎన్నో పార్శీ పదాలూ, కొద్దిగా బుడతకీచు పదాలూ కూడా కనిపిస్తాయి. ఇటువంటి పారిభాషిక పదాలు, పాతకాలం నాటి రచనా విధానంలో అతిదీర్ఘమైన వాక్యాలూ ఉండడం వల్ల నేడు మనకిది సులభంగా అర్థం కాక తికమక పెట్టినా పొల్లు మాటలు గాని అక్కరలేని వర్ణనలు గాని లేకుండా ఉండడం వలన అప్పటి మన వ్యావహారిక తెలుగు భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చటిస్తాను.
నేను ఇంతకు ముందు నిండుసున్న అరసున్నల గురించిన పోస్టులో చెప్పినట్లు ఆ నాటికి అరసున్న వాడుకలో లేకపోవడంతో పూర్ణానుస్వారాన్ని పలక వలసిన చోట దాని తర్వాతి హల్లును ద్విత్వంగా వ్రాసేవారు.తర్వాత హల్లును ద్విత్వంగా రాయకపోతే దానిని తేల్చి అరసున్నలా పలకాలన్నమాట. ఉదా. కూర్చుండక అని నేడు మనం వ్రాసే చోట కూర్చుండ్డక అని వ్రాసేవారన్నమాట.ఇలా వ్రాయడం ఈ పుస్తకం నిండా ఎన్నో చోట్ల కనిపిస్తుంది.
పదాదిలో వువూవొవోలు లేవన్నది నేటి మాటయితే ఆరోజుల్లో నిరభ్యంతరంగా వీటిని వాడేవారు. ఉదా. ఉంటిమి అని నేడు వ్రాస్తే నాడు వుంట్టిమి అని వ్రాసేవారు.చిన్నయ సూరి కాదన్నా ఈ కాలంలో కూడా పండితులైనవారు కూడా వుత్తరం, వున్నవి అనీ,ఇ ఏ కి యే అంటూ వ్రాయడం మనం గమనించవచ్చు.
 ఈ రచన ఉచ్చారణ కనుగుణంగా కనిపిస్తుందనడానికి నిదర్శనం చూడండి. నరసింహ అనే పదాన్ని చాలామంది నేటికీ తెలంగాణాలో నరసింహ్మ అనే ఉచ్చరిస్తారు. అలాగే సింహాసనాన్ని సింహ్మాసనం అనడం. దీనిలో ఆ రూపాలే కనపడతాయి.. అలాగే అకారాన్ని ఎకారంగా పలకడం. చలనం అనే పదాన్ని చెలనం అని పలుకుతారు. దీనిలో అదే కనిపిస్తుంది. ఒక అనే పదాన్ని వఖ అని పలికి అలాగే వ్రాసేవారన్నమాట. చేయడాన్ని శాయడం అనేవారు. పల్లెకు పల్ల్య అనీ, వాళ్ళకు అనడానికి వార్లకు అనీ. అలాగే పదం మధ్యలో అచ్చును వ్రాయడం- అయితే కి అఇతే- అని పోయినారు కి పోఇనారు- అనీ వ్రాసేవారు. ఇలా ఎన్నో. దీనిలో నేను గమనించిన మరో విశేషం ఏమిటంటే పలకరించడం అనే పదాన్ని అడగడం చెప్పడం అనే మాటల స్థానంలో వాడడం. ఉదా. శిష్యులతో చెప్పి అనడానికి శిష్యులతో పలకరించి అని వ్రాస్తారు. మరో విశేషం ఏమిటంటే సాష్టాంగపడి అనడానికి అడ్డపడి అనేవారు. ఉదా. రాయలవారి సముఖానికి అడ్డపడి చేతులుకట్టుకుని..ఇత్యాది.ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి.
వ్యావహారిక భాష నిత్యచైతన్య శీలి.ఎన్నో రాజకీయ సాంఘిక కారణాల వలన భాషలో ఎన్నో అన్యభాషా పదాలు చేరుతూ ఉండడం వ్యావహారిక భాష తన రూపు రేఖల్ని మార్చుకుని కొత్త అందాలు సంతరించుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకిష్టమైనా లేకపోయినా ఇది జరిగి పోతూనే ఉంటుంది. ఎవ్వరమూ దానినాపలేము.
పరిమితమైన పరిచయంలో నేనింతకంటే ఎక్కువ చెప్పడానికి తావు లేదుగాని శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి విశేషాలుగానీ ఆనాటి మన తెలుగు వ్యావహారిక బాషా స్వరూపాన్నిగాని తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు మాత్రం తప్పక చదవవలసిన పుస్తకం ఇది.
ఈ పుస్తకాన్నిగ్రంథరూపంలో 1933లో శ్రీ జయంతి రామయ్య పంతులుగారు పరిష్కరించగా ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రికవారు 1933లో ప్రచురించారు. వీరు చేసిన మహోపకారమేమిటంటే ఆ నాటి భాషా స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి వీలుగా ఉన్నదున్నట్లుగానే ప్రచురించారు. దీన్ని మరలా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు డా. సి.వి. రామచంద్ర రావుగారి 55 పేజీల సుదీర్ఘ మైన పీఠికతో 1982 లో ప్రచురించారు. మొత్తం 108 పేజీల ఈ  అరుదైన గ్రంథాన్ని  కేవలం అయిదు రూపాయలకే  అప్పట్లో ఏదో పుస్తక ప్రదర్శనలో  కడపలో నేను కొన్నాను. ఆయితే ఇంత అరుదైన పుస్తకం ఇప్పుడు లభించదేమో అన్నభయం సాహితీప్రియులకు అక్కర లేదు. దీనిని గుంటూరు మిత్ర మండలి ప్రచురణలవారు ఎన్నో చిత్రాలతో ప్రచురించారని దానిని  నేడే  13.7.2013 తేదీన  గుంటూరులో ఆవిష్కరిస్తున్నారని Face Book లో శ్రీ చావా కిరణ్ కుమార్ గారు తెలిపారు. అరుదైన ఈ పుస్తకం  భాషాభిమానులకు మరలా లభ్యమౌతోందని తెలిసి ఆనందంగా ఉంది. అందుకే దీని గురించి ఈ ముచ్చట. సెలవు. 
                                                       ***