14, జనవరి 2013, సోమవారం

సృష్టి లో తీయనిది....



కన్యాశుల్కం నాటకంలో గిరీశం వెంకటేశాన్ని చదువు చెప్పే మిషతో సృష్టిలో ఏమేమి వస్తువులు ఉన్నవో చెప్పమని అడిగితే దానికి తడుముకోకుండా చెగోడీలు అని ఠక్కున సమాధానమిస్తాడు వెంకటేశం.దానికి గురువు గారి ఇంగితం గ్రహించి విధవలు అని వెంకటేశం సమాధానమిస్తే,  విధవా వివాహాల గురించి పెద్ద లెక్చరు దంచాలని గిరీశం ఆశ.ఎవరి ఇష్టాలు వారివి. ఎవరి గోల వారిది.
అలాగే సృష్టిలో తీయనిది ఏది అని మనం ప్రశ్నిస్తే తడుముకోకుండా ప్రేమ  అని సమాధానమిస్తాడు ప్రేమికుడు. ప్రేమికులు ఊసుపోక కబుర్లు చెప్పుకున్నా అవి తియ్యగానే ఉంటాయి. అవి “Sweet Nothings”.
అలాగే వారు కనే కలలు కూడా తియ్యగానే ఉంటాయి.  అవి “Sweet Dreams”.
 రాజకీయుడు పదవి అంటాడు.లుబ్ధుడు ధనం అంటాడు.కన్నతల్లి నా సంతానం అంటుంది.
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నది ఒక  కవిగారి ఉవాచ. మనం సృష్టిలో తియ్యగా ఉండేదేదో చెప్పమంటుంటే అందరూ వారి వారి కిష్టమైన వస్తువుల పేర్లు చెబుతున్నారేంటి అనుకో వద్దు. అదంతే. ఆఖరుకి కొత్తావయ కాయో మిర్చిబజ్జీలో అంటే ప్రాణం పెట్టే ఆసామీలు కూడా తన ప్రాణమంటే తనకు తీపి అనే అంటారు కాని కారం అని అనరు కదా?అలా మన యిష్టాలకి తీపి పర్యాయపదమైపోయింది.
ఎవరైనా మనకు శుభ వార్త మోసుకుని వస్తే చల్లగా తీపి కబురు చెప్పావు కదయ్యా అంటూ అతడి నోట్లో ఇంత పంచదార పోయడమో బెల్లం ముక్క పెట్టడమో చేసేవారు మన పూర్వ కాలపు ఇల్లాళ్లు.ఏదో ఒకటైనా తీపివంట చేసుకోకపోతే మనకు పండుగా వెళ్లదు, శుభకార్యమూ జరుగదు కదా.ఇలా మనం కష్టపడి చేసుకునే తీపివంటల సంగతలా ఉంచితే, ప్రకృతి సిధ్ధం గా దొరికే తియ్యటి పండ్లు, చెరుకు, పాలమీగడా, తేనె వంటివి ఉండనే ఉన్నాయి. పండ్లూ చెరుకుల్లో రసం మాత్రమే తియ్యగా ఉంటుంది.పాలను కాస్తేనే కాని మీగడ కట్టదు.కాని తేనె ప్రతిబొట్టూ మధురమే.పాపం ఎన్నో వందల తేనెటీగలు ఎన్నో వేల పుష్పాలనుంచి ఎంతో దూరాలనుంచి మకరందాన్ని సేకరించి తమ గూట్లో పెట్టుకుంటే మనం అనాయాసంగా దానిని సంగ్రహిస్తాము.ప్రకృతి  సిధ్ధమైన వాటిల్లో తేనె అత్యంత మధురమైనదే కాకుండా ఆరోగ్య హేతువుకూడా అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ తేనె పట్టుల్లో లభించే తేనెగురించి అందరికీ తెలిసిందే కాని దానికన్నభిన్నమైనదీ, మధురమైనదీ, చాలామందికి తెలిసి ఉండనిదీ, అన్ని చోట్లా లభ్యం కానిదీ అయిన మరో తేనె గురించి మీకు చెప్పాలన్నదే నా కోరిక. వినండిమరి.
మన తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి తూర్పుగా ఆరు కోసుల దూరంలో తూర్పుగా ఉండే పొన్నాడ,తొండంగి, వేమవరం గ్రామాలను ఆనుకుని, వాటికీ తూర్పు సముద్రానికీ మధ్యలో పలచటి అడవి ప్రాంతం కొంత ఉంది. కోన అనే వారు దాన్ని. ఈ కోన లో పాల చెట్లనే చెట్లు ఉంటాయి..వీటి తొర్రలను గూళ్లు చేసుకుని మన తేనెటీగల్లాంటి చిన్న ఈగలు వాటిల్లో గుడ్లు పెట్టుకుంటూ కాపురముంటాయి. అలాగే ఈ కోనలో సన్నగానూ పొడుగ్గానూ ఉంటూ, జమ్మి ఆకులను పోలిన ఆకులతో ఉండే చిన్ని చెట్లు ఉంటాయి. ఈ చిన్ని చెట్లకు చిన్ని చిన్ని తెల్లని పువ్వులుంటాయి.ఆ తేనె టీగలు  చిన్ని చెట్ల పువ్వులనుండి తేనె గ్రహించి తమ గూళ్లలో పెట్టుకుంటాయి. అదే కాక  ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వరి పంట సేద్యమయ్యే కాలంలో వరి చేలు ఈనుతూ ఉండే సమయంలో వరి పువ్వారు అనే వరి పువ్వు ఉంటుంది. ఆ తేనెటీగలు చిన్ని పువ్వుల తేనెతో పాటు  వరిపువ్వారునూ సంగ్రహించి తమ గూళ్ళకు చేరుస్తాయి.తమ గుడ్లు ఎదిగి అవి పిల్లలయే సరికి వాటి ఆహారం కోసం.అయితే  ఈ తేనె మన మామూలు తేనె లాగా ఎర్రగానూ ఉండదు, ద్రవరూపంలోనూ ఉండదు.  తెల్లగా చిన్న చిన్న పలుకుల్లాగా ఉండి గడ్డకడుతుంది.ఒకొక్క గడ్డా శేరు, శేరున్నర వరకూ తూగుతుంది.ఇది అత్యంత మధురంగా ఉంటుంది. దానికోసం  అక్కడే అడవిలో పాకలు వేసుకుని కాపురముంటూ పిఠాపురం రాజావారి సేవకులు ఆ తేనె తయ్యారయ్యే సమయం చూసుకుని దానిని సంగ్రహించి రాజా వారికి చేర్చే వారు. వారు దానిని తమ ఇష్టులకీ ఆప్తులకీ ఇచ్చుకుని మిగిలినది తమ వాడుక కోసం ఉంచుకునే వారు.ఈ తేనె సంవత్సరం లో రెండుసార్లు తయారవుతుంది.అయితే ఆషాడ మాసంలోతయేరయ్యే తేనె వరిపువ్వారు ఉండదు కనుక , కార్తీక మాసంలో వరిపువ్వారుతో కూడా కలసి తయారయ్యే  తేనెలాగా అంత మధురంగా ఉండదు.కార్తీక మాసంలో తయ్యారయ్యే ఈ చిన్ని పువ్వుతేనె తియ్యదనానికి దానికదే సాటి.ఇది నడి వేసవిలోచిన్నమెత్తు స్వీకరించినా తాపాన్ని హరించి చలవ చేస్తుందట.
ఈ తియ్యటి తేనె దాని సేకరణ గురించి బ్రౌను లోకలు రికార్డులలో ఉంది. మరి ఇప్పుడు ఇది దొరుకుతోందో లేదో ఆ జిల్లా వారెవరైనా చెప్పాలి.
సంక్రాంతి పండుగ పూటా మీతో తియ్యటి కబుర్లు చెప్పుకోవాలనిపించింది. అందుకే అపురూపమైన ఈ చిన్ని పువ్వు తేనెగురించి వ్రాసేను.బ్లాగ్మిత్రులకు సంక్రాంతి శుభకామనలతో—సెలవు.

10, జనవరి 2013, గురువారం

ససేమిరా..ససేమిరా.. ఏమిటీ ససేమిరా కథ ?


ససేమిరా..కథ..ఏమిటీ ససేమిరా?
ఆ మధ్య వచ్చిన ఒక సినిమాకి టాగ్ లైన్ చిత్రంగా ఉంది. ఆ సినిమా పేరు సీతయ్య. టాగ్ లైన్ ఏమో..ఎవరి మాటా వినడు.. ఈ సినిమా వచ్చేక మా వాళ్ళలో ఎవరైనా మొండిగా ఎవరి మాటా వినని వాడిని వాడో సీతయ్య అనడం ప్రారంభించేము. మరి ఈ సినిమా రాకముందు ఆంధ్ర దేశంలో ఎవరైనా తన మాట తప్ప వేరొకరి మాట వినని వారిని ససేమిరా గాళ్లనే వారు. ఇంతకీ ఈ ససేమిరా ఏమిటి? దీనర్థం ఏమిటి?  ఇది ఎలా వాడుకలోకొచ్చింది? అంటే దీనికి చాలా పెద్ద కథుంది. అది చెబ్తాను. కొంచెం ఓపిగ్గా వినండి మరి.

పూర్వం విశాల అనే నగరాన్ని నందుడనే రాజు పాలిస్తూ ఉండేవాడట. అతని ఏకైక కుమారుని పేరు విజయపాలుడు.అతడు కడు దుర్మార్గుడు. అతడొక నాడు వేటకు పోయి కారడవి లో వేటపందిని తరుముతూ  అలసిపోయి ఒక చెరువు గట్టున  విశ్రమిస్తాడు.ఇంతలో అక్కడికి ఒక బెబ్బులి గాండ్రించుకుంటూ వస్తుంది. అతడి గుర్రం కట్టు తెంచుకుని పారిపోతుంది. అతడు పరుగెత్తి దగ్గర్లోని ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు.అంతకు ముందే ఆ చెట్టు మీద ఒక ఎలుగ్గొడ్డు ఎక్కి కూర్చుంది. కిందికి దిగి పారి పోదా మంటే పెద్దపులి అక్కడే మాటు వేసి కూర్చుంది. భయంతో వణుకుతున్న రాజకుమారుణ్ణి చూసి ఆ ఎలుగ్గొడ్డు ప్రాణ భయంతో తన వద్దకు వచ్చిన వానిని తాను చంపనని అభయమిస్తుంది. రాజకుమారుడు మనసు కుదుటపడిన వాడై, అలసిపోయి ఉన్నాడు కనుక అక్కడే చెట్టు కొమ్మమీదే నిద్ర కుపక్రమిస్తాడు.అతడు పడిపోకుండా ఎలుగ్గొడ్డు కాపలా కాస్తుంటుంది.
చెట్టు కింద నున్నపులి  రాజకుమారుడు నిద్ర పోవడం చూసి, ఎలుగ్గొడ్డుతో మనం మనుష్యులను నమ్మ వచ్చా అందులోనూ  ఈ మనిషి మహా మోసగాడులా ఉన్నాడు.ఎంతైనా మనం మనం ఒకటి. ఈ అడవిలో పుట్టి పెరిగిన వాళ్లం. కలసి బతకాల్సిన వాళ్లం. అతడ్ని కిందికి తోసేయి. చంపి చెరిసగం పంచుకు తిందాంఅన్నాది.ఎలుగ్గొడ్డు దానికి ఒప్పుకోక పోవడంతో పులి అలాగే చెట్టుకిందే తిష్ట వేసి కూర్చుంది.
కాసేపటికి రాజకుమారుడికి తెలివి వచ్చింది.ఎలుగ్గొడ్డుకి రాజకుమారుని మనసు పరీక్షించాలని బుధ్ధి పుడుతుంది. రాజకుమారుడితో ఇంతసేపు నేను నీకు కాపలా కాసేను. ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది.నీ తొడమీద కాసేపు విశ్రమిస్తాను అంటుంది.రాజకుమారుడు సరేనంటాడు.ఎలుగ్గొడ్డు అతడి ఒళ్లో తల పెట్టుకుని నిద్ర నటిస్తుంది. ఇది చూసిన పులి అతడితో ఎలుగ్గొడ్డుని ఎవరైనా నమ్ముతారా.. అది నేను వెళ్లి పోయిన తర్వాత నిన్ను చంపి తింటుంది.నా మాట వినిదానిని కిందకు తోసేయి. దానిని చంపి తినేసి నేను వెళ్లి పోతాను. ఆ తర్వాత నువ్వూ  హాయిగా వెళ్ళి పోవచ్చు అంది. దుర్మార్గుడైన  రాజకుమారుడు విశ్వాసం లేకుండా ఎలుగ్గొడ్డుని కిందకు తోయబోతాడు, కాని నిజంగా నిద్రపోని  ఆ ఎలుగు చెట్టు కొమ్మని పట్టుకుని ఉండడంవల్ల కింద పడకుండా ప్రాణాలు దక్కించుకుంటుంది.ఇంతలో తెల్లవారిపోవడంతో పులి నిరాశతో వెళ్లి పోతుంది. రాజకుమారుడింక తనకు చావుమూడిందనే అనుకుంటాడు, కాని  మంచిదైన ఆ ఎలుగ్గొడ్డు అతనితో నిన్ను చంపను, కానీ నీకు  తగిన శాస్తి జరగాలి. కనుక నీద్రోహ బుధ్ధి జనానికి తెలిసేంత వరకూ పిచ్చి వాడిలా ససేమిరా.. ససేమిరా..” అంటూ ఈ అడవిలో తిరుగుతూనే ఉండు. నీ ద్రోహ బుధ్ధి ఎవరైనా బట్టబయలు చేసి నప్పుడు నీకు శాప విముక్తి కలుగు తుంది.అంటూ శపించి అతనిని వదలి వెళ్లి పోతుంది. విజయపాలుడు ఆ అరణ్యంలోనే ససేమిరా.. ససేమిరా అంటూ పిచ్చి వాడిలా తిరుగుతూ ఉంటాడు.
రాజకుమారుడు వేటకై ఎక్కి వెళ్ళిన గుర్రం తిరిగి వచ్చినా రాజకుమారుడు రాక పోవడంతో కలవర పడ్డ రాజు గారు వానికోసం వెతికించి అడవిలో పిచ్చివానిగా తిరుగు తున్న తన కుమారుణ్ణి నగరానికి తీసుకు వస్తాడు.
ఎన్ని రకాల వైద్యాలు చేయించినా, ఎందరికి చూపించినా రాజకుమారుడు ససేమిరా అంటూ పిచ్చివాడిగానే మిగిలి పోతాడు. అప్పుడు ఆ దేశపు మంత్రిగారికి  ఈపిచ్చిని కుదర్చగల శక్తి వారి రాజగురువైన శారదా తనయునికి మాత్రమే ఉందని చెప్పి, వారిని బ్రతిమాలుతాడు. ఆ రాజగురువు తన దివ్యదృష్టితో అడవిలో జరిగిన దంతా గ్రహించిన వాడై, రాజ సభలో అందరి ముందరా,  ఆ అడవిలో జరిగిన సంఘటనను సూచించే పద్యాలు ఇలా  చదువుతాడు. మొదటి పద్యం-
సజ్జన భావము కల్గు సు
హృజ్జనులను మోసపుచ్చుటది నేరుపె నీ
పజ్జం దొడపై గూర్చిన
యజ్జంతువు జంప జూచుటది పౌరుషమే?
ఈ పద్యం వినగానే రాజకుమారుడు ససేమిరాలో వదిలేసి సేమిరాఅని మాత్రం అంటుంటాడు.
రాజగురువు చదివిన రెండవ పద్యం-
సేతువు దర్శింప మహా
పాతకములు బాసి పోవు, బ్రాణ సఖునకున్
ఘాతుకమతి నొనరించిన
పాతకమే తీర్థ సేవ బాయునె నరునిన్?
ఇది విన్నాక రాజకుమారుడు  సేమిరా లో సే వదిలేసి మిరా అని మాత్రం అంటుండేవాడు.
రాజగురువు చదివిన మూడవ పద్యం-
మిత్రద్రోహి, కృతఘ్నుడు,
ధాత్రీసుర , హేమ తస్కరుడు, సురా
పాత్రీ భూతుడు, నిందా పాత్రులు  వీరెల్ల నరక భవనా వాసుల్.
ఇదీ విన్నాక విజయ పాలుడు రా..రా ..”  అని మాత్రమే  అంటుండే వాడు.
రాజగురువు చదివిన చివరి పద్యం-
రాజేంద్ర  విజయపాలుని
రాజిత శుభ మూర్తి జేయ రతిగల దేనిన్
పూజార్హుల వీరెల్లర
బూజింపు మనూన దాన భోజన విధులన్.
స..సే..మి..రా.. అనే మొదటి అక్షరాలతో ప్రారంభమయ్యే ఈ నాలుగు పద్యాలూ వినగానే రాజకుమారునికి శాపం తొలగి పోయి తన పూర్వస్మృతి కలిగి అరణ్యం లో జరిగినది అందరికీ వివరిస్తాడు. ఈ కథ జక్కన వ్రాసిన విక్రమార్క చరిత్రం లోనిది. అంటే చాలా పాతదన్న మాట.
నేటి యువతరం కోసం, భాష లోని నుడికారం వల్ల కలిగే ప్రయోజనమేమిటో చెప్పి ముగిస్తాను.ఎవరైనా ఒక మొండి మనిషికి ఏదైనా విషయం వివరించి వానిని ఒప్పించి రమ్మని ఎవరినైనా పంపించామనుకోండి. అతడు తిరిగి వచ్చాక ఏం జవాబు చెప్పాడని  అడిగితే  ససేమిరా అంటున్నాడని అంటే,  జరిగిన దేమిటో  ఎన్నో మాటల్లో చెప్పనక్కర లేకుండా మనకి పూర్తి గా అర్థమై పోతుందికదా? భాషకి జీవమైనటువంటి ఇటువంటి నుడులు క్రమేపీ భాషలోంచి జారిపోతుండడం మన దురదృష్టం.
సెలవు.


5, జనవరి 2013, శనివారం

రాయల వారు చెప్పక చెప్పిన పిట్ట కథ...



శ్రీ కృష్ణ దేవరాయల వారి దిన చర్య  చాలా చిత్రంగా ఉండేది. దానిలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే-  రోజూ పొద్దున్న లేవగానే  నీతి పద్యాలు చదివించుకుని వింటూండే వారట. ఆ విధంగా సంజయనీతి, విదుర నీతి, చాణుక్య నీతి, భర్తృహరి నీతి శతకం మొదలైనవి రోజూ చదివించుకుని వింటూ, వాటి సారాన్ని ఒంట పట్టించుకుంటూ ఉండేవారట. అలా తాను తెలుసు కున్న నీతుల్ని ఆచరించడమే కాదు తన ఆముక్త మాల్యద కావ్యంలో కూడా అక్కడక్కడా చెబుతూ వచ్చారు. ఆయన వ్రాసిన ఆముక్త మాల్యద కావ్యం లోని ఈ క్రింది పద్యం చూడండి:
లాలన నారక్షుల గమి-నేలి తెలిసి మ్రుచ్చునాజ్ఞయిడ కతడు చెరం
బో లాతి నిడనయశమెం- తే లేవదె శూలపృథువణిజ్ఞ్న్యాయమునన్.
దీని భావం-- ప్రభుత్వంలో ఉన్న వారు, ఏదైనా నేరం జరిగి నప్పుడు వెంటనే స్పందించి, రక్షక భటులను లాలించి ఏలుకుంటూ నేరస్థులెవరో తెలుసుకుని వారిని వెంటనే శిక్షించాలి. అలాక్కాకుండా ఆలస్యం చేస్తే నేరస్థుడు తప్పించుకు పారి పోయే ప్రమాదం ఉంది. అప్పుడు రక్షక భటులు తమ ఉద్యోగాలు నిలబెట్టుకునేందుకు ఎవరినో ఒకర్ని నేరస్థులని తీసుకు రావడం ప్రభువులు శూల పృథువణిజ్ఞ్న్యాయం ప్రకారం- అంటే  లావు పాటి శూలం- లావుపాటి శెట్టి గారి కథలో లాగా ఆ అమాయకుల్ని శిక్షించడం జరుగుతుందని. రాయల వారు చెప్పకనే చెప్పిన ఈ పిట్టకథ ఏమిటో కొంచెం వివరిస్తాను.
పూర్వం పంచ మహాపాతక పట్టణాన్ని అవకతవక రాజు ఏలుతున్న రోజుల్లో ఒక పౌరుడు వచ్చి వారితో తాను మట్టిగోడ కట్టుకుంటే వర్షం కురిసి అది కూలి పోయిందని తనకు న్యాయం చేయమని మొర పెట్టుకున్నాడట.  రాజు గారు వెంటనే దానికి బాధ్యులెవరని తన అవివేకపు ప్రధానిని అడిగితే అతడు వర్షం కురిపించిన మేఘునిదే ఆ తప్పు అని చెప్పాడు. రాజుగారు మేఘుణ్ణి తీసుకు వచ్చి కొరత వేయమన్నారు. వర్షం కురిసేసిన తర్వాత మేఘ మెక్కడుంటుంది? అందుకని మేఘానికి కారణమైన వారెవరంటే పొగ అని ఒక సభ్యుడు చెబితే పొగకి కొరత వేయమన్నారు రాజుగారు. ఆ పొగా ఇప్పుడు లేదు కనుక దానికి కారణ మెవరంటే కుమ్మరి వాని ఆవము అని చెప్పారు. ఆ శిక్ష ఆవానికి వేయమన్నారు రాజుగారు. రక్షక భటులు వెళ్లి చూస్తే అక్కడ ఆవమిప్పుడు లేదు గాని, దానిని పెట్టిన కుమ్మరి ఉంటే వాడిని పట్టుకుని రాజు గారి వద్దకు తీసుకు వచ్చారు. వాడు రాజు గారితో  తన తప్పేమీ లేదనీ అయ్యవారింట్లో పెళ్లికి ఆరణి కుండలు కావాలంటే అవి కాల్చడానికే ఆవం పెట్టాననీ, కనుక ఆ శిక్షేదో ఆ పెళ్ళి కొడుక్కే వేయమని మొర పెట్టుకున్నాడు. రాజు గారు సమ్మతించి అలాగే శిక్ష వేయగా, ఆరెకులు( రక్షక భటులు) పెండ్లి కుమారుని పట్టుకు వచ్చి కొరత వేయ బోయారు. అంతలో అర్భకుడైన పెళ్లి కొడుకు తాను చాలా సన్నంగా ఉన్నానీ కొరత వేసే కొర్రు చాలా లావు గా ఉందనీ అదేమి న్యాయమనీ మొర పెట్టుకున్నాడు. ఈ విషయం ఆరెకులు రాజుగారికి విన్నవిస్తే అట్లైతే కొర్రుకు సరిపడా లావుగా ఉన్న ఎవరినైనా తీసుకు వచ్చి కొరత వేయమని అది తన తుది నిర్ణయమనీ మరి తన వద్దకు రావద్దనీ అన్నాడట. రక్షక భటులు కొర్రుకు సరిపడా లావు గా ఉన్న వర్తక ప్రముఖుడొకణ్ణి పట్టుకు వచ్చి కొరత వేసారట.
అయ్యా- ఇదీ శూల పృథువణిజ్ఞ్న్యాయమనబడే – లావుపాటి కొర్రు- లావు పాటి శెట్టిగారి కథ.
కథలో హాస్యం సంగతలా ఉంచితే- రాయల వారు చెప్పదలచుకున్నది, నేరం జరిగి నప్పుడు ప్రభువులు వెంటనే స్పందించి సత్వర న్యాయం చేయాలని.
ఇది ప్రభుత్వంలో ఉన్నవారు ఏ కాలంలో అయినా గుర్తు పెట్టకో వలసిన నీతి. మొన్ననీ మధ్య మన దేశ రాజధానిలో ఒక బస్సులో జరిగిన అమానుష కృత్యం సంగతే చూడండి.అదే బస్సులో అంతకు ముందే ఒక ప్రయాణీకుడి దగ్గరనుంచి విలువైన వస్తువులు ధనాన్ని దోచుకున్న విషయం ఆ ప్రయాణీకుడు పోలీసులకు విన్నవించుకుంటే వారు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకున్నారట. అదే వారు సత్వరమే స్పందించి బస్సువారిని నిర్భంధంలోకి తీసుకువి ఉంటే ఒక అమాయకురాలి శీలహరణం మరణం సంభవించకుండా ఆప గలిగే వారు కదా? 
(శ్రీ రాయల వారు చెప్పక చెప్పిన ఈ కథని మనకు విడమరిచి చెప్పిన వారు ఆముక్త మాల్యదకు ప్రతిభా వంతమైన వ్యాఖ్య వ్రాసిన శ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారని ఆరుద్ర గారి ఉవాచ.ఆ మహనీయుల్ని తలచుకుంటూ ఈ నీతిని మననం చేసుకుందాం. సెలవు.)    


1, జనవరి 2013, మంగళవారం

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు



అపురూపం బ్లాగ్మిత్రులందరికీ  ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
కం. జనవరి ఒకటవ తేదీ
      తనతోడనెతెచ్చుగాక తరగని సిరులన్
      మనకందరకును ఈ నూ
      తన వత్సరమిచ్చుగాక తనివిని తాల్మిన్
     Happy New Year--2013.