21, జూన్ 2013, శుక్రవారం

ఈ బంధం ఏనాటిదో?


ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా.. అన్నారు మన పెద్దలు. ఈ ఋణం ఈ జన్మలోదో ఇంతకు ముందరి ఏ జన్మ లోదో కూడా మనకు తెలియదు. మనం ఏ జన్మలోనో చేసుకున్న పాప పుణ్యాల ఫలితం గానే  ఈ జన్మలో మనకు  భార్యా బిడ్డలు కానీ ఇల్లూ వాకిలి గానీ పశు సంపద కానీ ఒనగూరుతాయన్నది దీని  తాత్పర్యం. పూర్వకాలంలో పశువులనే సంపద గా భావించిన రోజులలో చెప్పినది కనుక పశు పత్నీ సుతాలయా అని మాత్రమే అన్నా, దీని విస్తృతార్థం ఏమిటంటే మనకు లభించే సమస్త సంపదలూ స్నేహితులూ ఇరుగూ పొరుగూ బంధు వర్గం పరిచయస్తులూ పని మనుషులూ..ఒకటేమిటి సమస్తమూ ఈ ఋణానుబంధ రూపేణా మాత్రమే ఏర్పడతాయని. ఈ విషయాన్ని తేటపరిచే ఈ కథ చదవండి.
                                                                             ***
గుజరాత్ లోని అహ్మదాబాదు నగరంలో నివసిస్తున్న నిరంజన్ భగత్ గారికి ఇప్పుడు 88 ఏళ్ళు. ఇతడు
ఆజన్మబ్రహ్మచారి. స్వతహాగా కవి. స్థితిమంతుడు. దయార్ద్ర హృదయుడన్నూ. దాదాపు 30 సంత్సరాల క్రితం ఈయన ఇంట్లో పనిచేసే పనిమనిషి ద్వారా ఆమె ఊరికి చెందిన ఓ 8 ఏళ్ళ కుర్రాడు ఊళ్లో తిండికి గడవక ఈయన ఇంటికి వచ్చి చేరాడు. తనకు చేతనైనంత పని చేస్తూ భగత్ గారి అభిమానాన్ని చూరగొన్నాడు.భగత్ గారు కూడా ఈ అబ్బాయి- పేరు జగత్- ని పని వాడుగా కాకుండా ఇంట్లో మనిషి గానూ- ఇంకా చెప్పాలంటే తన స్వంత కొడుకు లాగే చూసుకున్నాడు. వారి ఈ బంధం బాగా గట్టి పడే సందర్బం 2000 సంవత్సరం లో తటస్థించింది. అప్పుడు భగత్ గారి తల్లి గారికి విపరీతమైన జబ్బు చేసి మరణ శయ్యమీద ఉంటే  ఆమెకు జగత్ చేసిన సేవ ఏ పని మనిషి గాని ఆఖరుకు కన్న కొడుకు గాని చేసి ఉండరంటాడు భగత్ గారు. ఈ విధంగా జగత్ తన యజమాని కుటుంబానికి మరచిపోలేని సేవ చేస్తుంటే, భగత్ గారు మాత్రం తక్కువ తిన లేదు. జగత్ పిల్లలిద్దరూ-15 ఏళ్ళ అమర్, 11 ఏళ్ల జయధీర్ లకు చదువు చెప్పించాడు. జగత్ కి తన స్వంత ఊరు దుంగార్ పూర్ లో ఉన్న స్వంత ఇల్లు బాగు చేయించు కోవడానికి తగిన ఆర్థిక సహాయం చేసాడు. తమ అమ్మ గారికి జగత్ చేసిన సేవ మరచిపోలేని భగత్, జగత్ కోసం ఏమైనా చేస్తానంటారు. అనడమే కాదు ఆయన జగత్ పై చూపించే ప్రేమాభిమానా లెటువంటి వంటే వేసవి కాలంలో జగత్ కుటుంబం అహ్మదాబాదులో గడపడానికి వచ్చి నప్పుడు తన ఫ్లాట్ లోని ఏర్ కండిషన్డ్ మాస్టర్ బెడ్ రూమ్ ని ఖాళీ చేసి వారిని వాడుకోమంటారు.

88 ఏళ్ళ భగత్ తాను నూరేళ్ళు బ్రతకాల్సి వచ్చినా నిశ్చింతగా బ్రతుకుతానని తనని చూసుకోవడానికి కొడుకు కంటె ఎక్కువైన జగత్ ఉన్నాడన్నదే తన ధైర్యమని అంటారు.

 తమ కెంత సంపదలున్నా-నలుగురు కొడుకులున్నా వారందరూ కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాకూడా –తమ జీవిత చరమాంకం ఎట్లా గడుస్తుందో నని సతతం దిగులు చెందుతూ బిక్కు బిక్కుమంటూ జీవితాలు గడిపే వృధ్ధ జంటలు లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ రోజుల్లో పై మాటలనగలిగే దైర్యం ఎవరికుంది?
అయితే ఈ కథకు కొస మేరుపేమిటంటే- కవిగారు- శ్రీ నిరంజన్ భగత్ గారు  తన యావదాస్తి నీ- అంటే అహ్మదాబాద్ లోని శ్రీ మంతుల పేట లోని కోటి రూపాయలకు పైగా విలువ జేసే తన ప్లాట్ నీ, 9 లక్షల రూపాయల బాంక్ డిపాజిట్లనీ- ఇంకా ఇన్స్యూరెన్స్ పాలసీలనూ తనతదనంతరం జగత్ కి చెందేటట్లు వీలునామా వ్రాసేరట. ఆయనకు ఇద్దరు మేనల్లుళ్లున్నాసరే.

వీరి ఈ బంధానికి మూలం ఏ జన్మ లోదో ?


ఈ కథలో మనం తప్పక గమనించాల్సిన మరొక కోణం- యజమానులూ పనివారల సంబంధం ఎలా ఉండాలన్నది.మరీ ముఖ్యంగా ఇళ్ళల్లో పనిచేసేవారి విషయంలో మనవైఖరి ఎలా ఉండాలన్నది ప్రతి స్త్రీ గమనించాలి. మనం ఏదో వెయ్యి రూపాయలిస్తున్నాం కదా ఏ నాగాలు పెట్టకుండా పని చెయ్యవచ్చు కదా అనే అమ్మలే ఎక్కువ మంది. నిజానికి మనమిచ్చే డబ్బులు రోజూ వాళ్లయింటినుండి మన యింటికి రావడానికయ్యే బస్ ఛార్జీలకు కూడా సరిపోవు.వారికి గడవక వేరే పనులు చేతకాక మన యిళ్ళలో పని చేస్తుండవచ్చు.మన ఆర్థిక పరిస్థితుల బట్టి వారికి మనం ఎక్కువ ఇవ్వలేక పోయినా వారి కష్టం సుఖం గమనిస్తూ తోటి మనుష్యులకివ్వాల్సిన గౌరవాన్ని వారికిస్తూ మన గౌరవాన్ని నిలుపుకుందాం. సెలవు.

ఈ కథనానికి మూలం నేటి- 21 జూన్ -  టైమ్స్  దిన పత్రిక లోని వ్యాసం.  పత్రిక వారికి కృతజ్ఞతలు.    

16, జూన్ 2013, ఆదివారం

టెలిగ్రాం సార్....

.
కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేసిందని తెలుగులో సామెత. ఏటిలోనూ నదుల్లోనూ నిలచి ఉన్న నీటిని నిత్యం వచ్చి చేరే కొత్త నీరు తొలగించి నట్లే, కాల ప్రవాహంలో కూడా సమాజంలో పెను మార్పులు  జరుగుతూ ఉంటాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన పురోభివృధ్ధి వల్ల జనుల నిత్యజీవితంలో కూడా నిరంతరం ఎన్నో కొత్త కొత్త విషయాలు చోటు చేసుకుంటుంటాయి. మిక్సీలు గ్రైండర్లు వచ్చి రుబ్బురోళ్ళూ పచ్చడి బండలూ మాయమైనట్లే, మన సమాచార రంగంలో కూడా పెను విప్లవం వచ్చిమన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేసింది.
ఆది మానవుడు  నివసించిన అనాగరిక సమాజాల్లో సమాచారాన్ని ఒక చోటినుండి వేరొక చోటికి చేర వెయడానికి ఎత్తైన ప్రదేశాలనుండి జెండాలు ఎగుర వేయడం డప్పులు కొట్టి రకరకాల ధ్వనులు చేయడం ద్వారా ఒక ఊరి నుండి ప్రక్క ఊరికి సందేశాలను అందించేవారట.ఇంకా ఎక్కువ  ముఖ్యమైన సమాచారాన్ని పంపాలంటే వార్తా హరులు దూతలే శరణ్యం.ఇంకా కొంచం నాగరికత సంతరించుకున్నాక తాటాకులమీదో భూర్జ పత్రాల మీదో మరికొన్నాళ్లకి కాగితాల మీదో వ్రాయడం నేర్చుకున్నాక  లేఖలను పంపడం మొదలైంది. పోస్టల్ వ్యవస్థ రూపు దిద్దుకున్నాక సమాచారం పంపడం సులువై ప్రజాసామాన్యానికి కూడా అందుబాటులోకి వచ్చింది.1950 లలో వచ్చిన సంసారం సినిమాలో అనుకుంటాను సూర్యకాంతమ్మ ఎన్నో ఊళ్లు తిరిగొచ్చిన దానినని గొప్పలు పోతుంటే, దాన్దేముందత్తా మూడు కాన్ల కార్డు ముక్క కూడా ఆ పని చేస్తుందంటాడు నాగేశ్వర్రావు. తోక లేని పిట్ట తొంభై ఊళ్లు తిరిగిందనే మన పొడుపు కథ లోని తోక లేని పిట్ట ఈ కార్డు ముక్కే.  అయితే ఆనాటికి కూడా మన పల్లె టూళ్ల పరిస్థతి ఎలాగుండేదంటే కార్డులో ఉన్న విషయాలు కూడా ఉత్తరం బట్వాడా చేయడానికి వచ్చిన పోస్ట్ మేన్ కాని వేరే చదువు వచ్చిన వాళ్లని వెతుక్కుని వాళ్ల చేత చదివించుకోవలసిన దుర్భరమైన పరి స్థితులుండేవి. ఆ కార్డు చదవ గల మనిషి దొరికే వరకూ వాళ్లకి దానిలోని వర్తమానం తెలిసేది కాదు. అయితే,  పిల్లలు  పుట్టడమో వివాహాది శుభ కార్యాలకో సంబంధించినవైతే వాటికి పసుపు బొట్లు పెట్టే వారు కనుక అది మోసుకొచ్చింది శుభ వార్తే అని స్థిమిత పడేవారు. ఏ మరణ వార్తో అయితే ఆ కార్డుకు  నలు మూలలా సిరాతో నల్లగా పూసే వారు కనుక అది దుర్వార్తే అని గ్రహించే వారు. ఈ ఉత్తరాలు కూడా చిరునామా దారునికి చేరడానికి కొన్ని రోజులూ అప్పుడప్పుడూ కొన్ని వారాలు కూడా పట్టేవి. టెలిఫోన్లు ఉపయోగం లోకి రాక ముందు, ఉత్తరాల బట్వాడాలో జరిగే ఆలస్యాన్ని అధిగమించడానికి  సత్వర సమాచారాన్ని అందించడానికి 1844 లో మోర్స్ మహానుభావుడు కనిపెట్టిన మోర్స్ కోడ్, తర్వాత ఉపయోగం లోకి  వచ్చిన టెలిగ్రాములే గతి అయ్యేవి.
ఈ కాలపు పిల్లలకి పోస్టలు డిపార్టుమెంటు ఎట్లా పని చేస్తుందో తెలియనట్లే, ఈ టెలిగ్రాము అంటే ఏమిటో అదెలా పని చేస్తుందో కూడా తెలియక పోవడంలో ఆశ్చర్యం లేదు. టెలి ఫోన్ లో లాగే దీనిలో కూడా శబ్ద తరంగాలను  విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి తీగెల ద్వారా ప్రసరింప జేసి  తిరిగి రెండో కొసలో వాటిని శబ్ద తరంగాలు గా మార్చడం ద్వారా వర్తమానాల్ని ప్రసారం చేసేవారు. అయితే ఫోన్ లో లాగా మన మాటల్ని యథాతథంగా ప్రసారం చేయడానికి అప్పటికి అవకాశం లేక పోవడంతో వార్తల్ని మోర్స్ కోడ్ లో ప్రసారం చేసేవారు.టెలిగ్రాముల్ని ప్రసారం చేసే విధానం తమాషాగా ఉంటుంది. ఒక చిన్న బల్ల చెక్కమీద ఇత్తడి రాడ్ ని స్ప్రింగుతో అమర్చబడి ఉంటుంది. అది నొక్కి వదలి నప్పుడల్లా కట్ట..కడ.. అనే శబ్దాలు చేస్తుంటుంది. వీటినే డాట్.. డాష్..గా వ్యవహరిస్తారు. చుక్క ఒక ఇంగ్లీషు అక్షరానికి సంకేతమైతే గీత మరొక అక్షరానికి సంకేతమన్న మాట. అలాగే కొన్ని గీతలూ కొన్ని చుక్కలూ ఒక్కొక్క ఇంగ్లీషు అక్షరానికి  సంకేతమై ఉండి ,  ఇంగ్లీషులో వ్రాసిన వార్తలను  ఈ మోర్స్ కోడ్ ద్వారా పంపిస్తారన్నమాట. మా చిన్నప్పుడు రైల్వే లో పని చేసే మా బాబాయి తీసుకు వస్తే ఈ టెలిగ్రాఫ్ పరికరం ద్వారా మోర్స్ కోడ్ లోకి వార్తల్నిఅనువదిచడం కొంచెం నేర్చుకున్నాను.ఆ పరికరం ఇలా ఉండేది.



కార్డులూ ఇతర ఉత్తరాలకంటె సత్వరమే వార్తల్ని చేరవేయడానికి టెలిగ్రాఫ్ ఉపయోగంలోకి వచ్చినా చాలా ఎక్కువ మంది పేదవాళ్లుండే మన దేశంలో మాత్రం ఇది అత్యవసరమైన  సమాచారం పంపవలసి నప్పుడు మాత్రమే ఉపయోగించే వారు.  మా చిన్నతనం లో  ఎవరికైనా టెలిగ్రామ్  వచ్చిందంటే కంపించి పోయే వారు  అది ఏ దుర్వార్తో  మోసుకు వచ్చిందమోనని. అదీ ఇంగ్లీషు లోనే ఉండడంతో ఆ భాష తెలిసిన వారు చదివి విషయం చెప్పే వరకూ  ఉత్కంఠ తోనే ఉండే వారు.ఎవరో ఒకరు మరణించారనో, మరణ శయ్య మీద ఉన్నారనో వెంటనే బయల్దేరి రావాల్సిందిగా వచ్చే టెలిగ్రాములే అధికంగా ఉండేవి. కొంచెం నాగరికుల్లోనూ ధన వంతుల్లోనూ శుభ వర్తమానాలకి కూడా టెలిగ్రాములను ఇచ్చుకునే వారు. ఈ వ్యవస్థ బాగా ప్రాచుర్యం లోకి వచ్చేక గ్రీటింగ్ టెలిగ్రాములని ఉండేవి. సందర్భానికి తగిన సందేశాలు ఆంగ్లంలో ఉండేవి. వాటి నంబర్లను మాత్రం మనం టెలిగ్రాములో పంపిస్తే  అవతలి వారికి అది పూర్తి సందేశంగా టైపు చేసి గ్రీటింగ్ కవర్లలో బట్వాడా చేసే వారు. ఆ రోజుల్లో ఏ పెళ్లిళ్ళకు వెళ్లడానికి వీలు కుదరక పోయినా గ్రీటింగ్ టెలిగ్రామ్ ఇవ్వడం తప్పని సరి. పదానికింత రుసుమని ఛార్జి చేసే వారు కనుక సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా పని జరిగి పోయేది. గ్రీటింగులే కాదు మిగిలిన టెలిగ్రాముల్లో కూడా ఎంత సంక్షిప్తంగా సందేశాన్ని పంపగలమో అని  ప్రయత్నించేవారు. ఈ రోజుల్లో సెమ్మెస్ భాష లాగే ఆరోజుల్లో టెలిగ్రాముల భాష కూడా క్రియలు లేకుండా  "Arriving 16th Godavari  receive station"  అంటే పదహారవ తారీఖు గోదావరి రైల్లో దిగుతాను. స్టేషనుకు వచ్చి తీసుకెళ్ళమని ..  తమాషాగా ఉండేది.  అత్యంత సంక్షిప్తమైన టెలిగ్రామంటే ఆస్కార్ వైల్డ్ అనే రచయిత  తన పబ్లిషరుకి పంపించిందనే చెప్పుకోవాలి. తన కొత్త పుస్తకం విక్రయాలు ఎలాగున్నాయని పబ్లిషరుని అడగడానికి అతడు   ?    అని టెలిగ్రామిచ్చాడట.  దానికి ఆ పబ్లిషరు మహాశయుడు  “   !  అని సమాధానం ఇచ్చేడట.. బాగుందా?
 నేను మరిచి పోలేని టెలిగ్రాము  నేను 1968 జనవరి లో ఒక అర్థరాత్రి అందుకున్నాను. అది మా అమ్మ గారి
అకాల మరణ వార్త. నేను మూడవ రోజుకి కాని మాఊరు చేరుకో లేక పోయాను. ఇలాంటి దుర్వార్తలను కాని శుభ వార్తలను కాని ఆ రోజుల్లో సత్వరమే జనానికి చేరవేస్తూ - 160 సంవత్సరాలు బ్రతికిన-- ఈ టెలిగ్రాఫు వ్యవస్థ మరి కొద్ది (ఒక నెల) రోజుల్లోనే మూత పడబోతోందని వార్త. మనుషులకే మరణం తప్పనప్పుడు అతడు సృష్టించిన పరికరాలు మరణిండంలో విశేషం ఏముంది?

.

     

7, జూన్ 2013, శుక్రవారం

ఏమిటీ జీవిత పరమార్థం?

ఏమిటి జీవిత పరమార్థం....?
ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ మరి యాలజాతికిన్ తిన్నది పుష్టి..”
 తిరుపతి వేంకట కవుల ఈ పద్యం అందరికీ సుపరిచితమే. గోవుల వంటి పశుజాతికి కడుపు నిండితే చాలు అవి సంతృప్తి పడతాయి. మళ్ళా కడుపు నకనకలాడే వరకూ వాటికి ఏ చింతా ఉండదు.హాయిగా బ్రతికేస్తాయి. మరి అన్ని జన్మలలోనూ ఉత్కృష్టమైనది మా మానవ జన్మే అని విర్రవీగే మానవుడు మాత్రం తన తిండికే కాదు తానూ తన కుటుంబమూ జీవితాతం సుఖంగా కాలం గడపడానికి కావలసినంత ఉన్నా కూడా తనివి తీరక ఇంకా ఇంకా సంపాదిచాలనే కోరికతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు. ఎన్నడూ తృప్త్యాస్మి అనడు. ఉన్నంతలో సంతృప్తి చెందుతూ మనశ్శాంతితో హాయిగా గడిపేవారు చాలా అరుదు. నప్రతిగృహీత్వం-అంటే ఊరికే ఎవ్వరేమిచ్చినా అదెంత తమకు అవసరమైనదైనా స్వీకరించకుండా ఉండడం ఒక వ్రతంగా పాటిస్తూ జీవితాల్ని గడిపిన కొద్ది మంది గురించి ఇంతకు ముందు నా పోస్టులలో ప్రస్తావించి ఉన్నాను. తాము జీవిస్తున్న పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, ఎన్నో  ప్రలోభాలను అథిగమించి,  అనాయాచితంగా వస్తున్న సిరులను తృణ ప్రాయంగా భావించి వద్దనగలగడం సామాన్యమైన విషయంకాదు. అయితే జీవితంలో ఐహిక సుఖాలకంటే విలువలకోసం జీవించ దలచుకున్న స్థిరచిత్తులకు మాత్రం ఇది  అసాధ్యంకాదు. ఈ విషయం రుజువు చేసే రెండు కథలను చెప్తాను వినండి.
                                                         ***
చాలా కాలం క్రితం కోనసీమలో అయిన పల్లి అనే గ్రామంలో బులుసు అచ్చయ్యగారనే మహా పండితుడు ఉండేవారుట.వారి తండ్రులూ తాతలూ కొమాళ్ళూ అందరూ మహా పండితులే. అచ్చయ్యగారు వేద శాస్త్ర శ్రౌతాలలో నిష్ణాతుడు.ఆయన ఒకరోజు ఉదయాన్నేగుమ్మం అలుకుతూ ఉన్న తమ అర్ధాంగిని ఈ వేళ శాక పాకా లేమిటోయ్ అని సరదాగా ప్రశ్నించారట. అంతటి మహా పండితుడై ఉండీ ఎంతో ధనాన్ని అవలీలగా ఆర్జించగల దక్షత కలిగిన వాడై కూడా ఆ  విషయంలో ఈ షణ్మాత్రమైనా శ్రధ్ధ చూపని తన భర్తగారి ప్రవర్తనతో ఏ కొంచెమైనా విసిగిపోయి ఉందేమో ఆ ఇల్లాలుఆఁ ఏముందీ..ఇత్యర్థలు పులుసూ..ఇతిభావలూ కూరానున్నూ.. అందట. భార్య మాటల్లోని వ్యంగ్యం గ్రహించిన ఆయన  “ నీకేదో ధనాశ ఉన్నట్లుంది.  ఎంత తెస్తే చాలునో చెపితే ఆ ప్రయత్నం చేస్తానన్నాడు. అన్నాడు కాని ఈయన అటువంటి ప్రయత్నమేమీ చేసేవాడనే నమ్మకమేమాత్రం లేని ఆవిడ తాను అప్పుడు గుమ్మం  అలకడానికి  నీళ్లు తెచ్చుకున్న నిలువు చెంబు చూపిస్తూ దీనెడు వరహాలు చాలన్నట్టు సంజ్ఞ చేసిందట. అచ్చయ్యగారు ఆ పట్టునే ఆ చెంబు తీసుకుని బయల్దేరి ఊళ్లు తిరుగుతూ హైదరాబాదు చేరుకున్నారట.అక్కడ ఒక బ్రాహ్మడు యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ శ్రౌతులిద్దరు ప్రాయశ్చిత్తం ఎలా చేయించాలనే విషయమై వాదులాడుకుంటున్నారట. అప్పుడు అచ్చయ్యగారు కలుగ జేసుకుని ఇదీ శాస్త్రీయ మైన పద్ధతి అని వివరించేరట.అప్పుడు ఆ వాదనలో ఓడిపోయిన శ్రౌతి మధ్యలో నీవెవడవయ్యా కలుగజేసుకుని తీర్పివ్వడానికి ..నీ వేమైనా బులుసు అచ్చయ్యగారి ననుకుంటున్నావా అని హేళనగా మాట్లాడాడట.అందుకాయన అలాగే అనుకోండి అని మాత్రం అన్నాడట. తొందరలోనే ఆయనే బులుసు అచ్చయ్యగారనే నిజం గ్రహించిన అక్కడి పెద్దలు వారికి నమస్కరించి సగౌరవంగా అప్పటి హైదరాబాదు నవాబు వద్ద దివాన్జీగా ఉన్న చందూలాల్ గారి దగ్గరకు తీసుకు వెళ్లారట. అప్పటికే అచ్చయ్యగారి ప్రజ్ఞా విశేషాలు ఎరిగి ఉన్నవాడైనందు వల్ల చందూలాల్ గారు అచ్చయ్యగారిని అంత దూరం నుండి వచ్చిన పనేమిటని అడిగారట. విషయం తెలుసుకుని అచ్చయ్యగారికి జాగీరు ఇవ్వడానికి కూడా చందూలాల్ సిధ్ధ పడ్డా, దానిని నిరాకరిస్తూ తన చెంబుతో చెంబెడు వరహాలు మాత్రం పుచ్చుకుని అచ్చయ్యగారు ఇల్లు చేరారట. కేవలం భార్య కోరిక తీర్చడానికైనా సరే, ఏదో నాలుగు చోట్ల యాచించుకోకుండా తన ప్రజ్ఞను గుర్తించి అడక్కుండానే తన అభీష్టాన్ని నెరవేర్చగల యోగ్యుడైన దాత కోసమే అచ్చయ్యగారు ఇంత దూరం రావలసి వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఆయన తన శేషజీవితాన్ని నప్రతిగృహీతలు గానే గడిపారట.
                                                              ***
ఇది వింటే మనలో కొందరికైనా ఆ రోజుల్లో కనుక అలా గడప గలిగారు కాని ఇప్పటి పరిస్థితుల్లో ఎవరికైనా అలా జీవించడం సాధ్యమా? అనే శంక కలిగి తీరుతుంది. నిజమే. ఆ రోజుల్లో ఏ కొద్ది మంది భాగ్యవంతులో తప్పిస్తే మిగిలిన వారందరూ చాలా సాదా సీదా జీవితాల్ని గడిపే వారు కనుక వారి మధ్య ఈ రకమైన నిష్టతో బ్రతకడం ఇప్పటికంటె కొంచెం సులభమే అయి ఉండవచ్చు. కాని అసలు కారణం అది కాదు. మనిషై పుట్టాక మన జీవితం ఎలా గడపాలి జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని మనం నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో వచ్చే సాధక బాధకాల్ని లెక్కచేయకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగగలగడం అనేవి వ్యక్తులకు సంబంధించినవి. కాలానికి సంబంధించినవి కాదు. ఈ విషయాన్ని రుజువు చేసే కథ చెబుతాను వినండి.
                                                                 ***
మనం ఉంటున్న ఈ కాలంలోనే ఢిల్లీలో ఘాజీ పూర్ ప్రాంతంలో రవి సక్సేనా అనే ఆసామీ టీ అమ్ముకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. అలా టీ అమ్ముకుంటూ నెలలో 20 రోజులలో దాదాపు రూ. 8,000  వరకూ సంపాదిస్తాడట. అంతే మరి. ఆ మిగిలిన 10 రోజులూ టీ అమ్మడం బంద్. ఆ పది రోజులూ ఢిల్లీకి చికిత్స నిమిత్తమై   ఎక్కడెక్కడనుంచో వచ్చే వారికి సహాయం చేయడంలో  తలమునకలై ఉంటాడట. అలా ఢిల్లీకి దూర ప్రాంతాలైన పల్లె టూళ్ళనుండి వచ్చి హాస్పిటల్స్ లో ఎలా చేరాలో తెలియక అట్టాడుతున్న రోగుల్ని తీసుకెళ్లి హాస్పిటల్స్ లో చేర్పించడం వారి అవసరాల్ని బట్టి రోజుల తరబడి  వారికి తోడుగా ఉండడం  సేవ జేయడం లాంటివి చేస్తాడట.ఇలా ఆయన ఆరేళ్ళ బట్టి సేవ జేస్తున్నాడట. ఈ పని మానేసి హాయిగా టీ అమ్ముకుంటూ మరికొంచెం సంపాదించుకోవచ్చు కదా అని అతడి కుటుంబ సభ్యులూ స్నేహితులూ ఎవరెన్ని చెప్పినా వినకుండా అతడీ సేవలో అంకితమై పోతున్నాడట. ఢిల్లీ లాంటి మహా నగరంలో 8000 రూపాయల సంపాదనతో బ్రతుకు వెళ్లదీయడం ఎంత కష్టమో మనమెరుగనిది కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక బ్రతికుంటేనే ఏమైనా సాధించగలం కనుక జీవికకు సరిపడా సంపాదించుకుంటూనే ఈ జీవితానికి సార్థకత చేకూర్చుకోవాలనుకున్న రవిసక్సేనా ధన్యజీవియే కదా?
                                                                ***
బులుసు అచ్చయ్య గారిగురించి చెప్పిన వారు శ్రీ చెళ్ళ పిళ్ళ వేంకట శాస్త్రి గారైతే, రవి సక్సేనాను గురించి జూన్ 6, టైమ్స్ ఆఫ్ ఇండియా దిన పత్రికలో చదివాను. ఇలాంటి ముచ్చట్లు వినడం మన జీవితాల్ని సంపూర్ణంగా మార్చి వేయక పోయినా  జీవిత పరమార్థాన్ని గ్రహించడంలో ఏ కొంతైనా సాయపడి ప్రశాంత జీవన సరళిని ప్రసాదిస్తాయేమోనని ఆశ. సెలవు.
                                                               ***