17, జులై 2013, బుధవారం

పండితులూ..కవులూ... వారి ధిషణాహంకారమూ...


పూర్వ కాలంలో పండితులకీ కవులకీ-కాస్త భూవసతి కలిగి ఉన్నవారి కేమోగాని – మిగిలిన వారందరికీ  భుక్తికోసం  రాజాశ్రయం తప్పని సరి అయ్యేది.ఏదో ఒక రాజుగారి ప్రాపకంలో జీవించడమో లేకపోతే  దేశాటనం చేస్తూ ఎంతో మంది రాజులను సందర్శిస్తూ వారిచ్చే వార్షికాలను స్వీకరించి రోజులు వెళ్లబుచ్చడమో చేసేవారు. ఇందుకోసం వారు తగిన వారినీ తగని వారినీ ఇంద్రుడూ చంద్రుడూ అంటూ మిథ్యాస్తుతులు చేస్తూ పబ్బం గడుపుకునే వారు. అయితే ఇది సామాన్యులైన పండితులూ కవుల సంగతి కానీ ఉద్దండులైన కవి పండితులు మాత్రం  దేహీ అని యాచించక రసజ్ఞులైన రాజులను మెప్పించి వారి మర్యాదలనూ మన్ననలనూ పొంది చాలా హుందాగా జీవనం గడిపేవారు. వారి మరియాదకు లోటురాకుండా  వారి మాటే చెల్లుబడి అయేటట్లు జీవించిన తృణీకృత బ్రహ్మపురంధరు లనదగ్గ వారు కొద్ది మందే అయినా ఉండేవారు. అప్పట్లో వారి ఆభిజాత్యాన్ని, ధిషణాహంకారాన్ని మన్నిస్తూ వారిని సగౌరవంగా చూసుకున్న రసజ్ఞులైన రాజశేఖరులూ ఉండేవారు. అట్టివారిలో విజయనగర, పిఠాపురాధీశులు పేరుపడ్డవారు.ఇటువంటి సంస్థానాదీశులూ వారి మన్ననలకు పాత్రులైన కవుల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాలని పిస్తోంది. ఆసక్తి కల వారు అవధరించండి:

ఇంతకు ముందు నేను దండిభొట్ల వారి దర్జా అనే పోస్టులో దండిబొట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఎంత హుందాగా బ్రతికేరో చెప్పాను. ఆయనొక సారి పిఠాపురం సంస్థానానికి రావడం జరిగిందట. పిఠాపురం రాజు గారికి సంస్కృతంలో కొంత శ్రుత పాండిత్యం ఉందట. అందుచేత ఎవరైనా పండితులు వస్తే వారితో సంస్కృతంలో నే సంభాషించాలని ఉబలాట పడేవారట. దండిభొట్ల వారితో అలాగే సంభాషించడానికి మొదలు పెట్టే సరికి వారు "రాజా నీవు నాతో తెలుగులో మాట్లాడితేనే నేనిక్కడ ఒక్క క్షణమైనా ఉండేది. లేకపోతే నీ రాజ్యం రాసిస్తానన్నా ఒక్క నిముషం కూడా ఇక్కడ ఆగను" అన్నారట. రాజుగారు ఆయన మాట మన్నించి తెలుగులో సంభాషణ మొదలు పెట్టారట. ఇక్కడ గమనించ వలసిన మరో విషయం ఏమిటంటే పిఠాపురం రాజుగారికి కోపం వస్తే అవతలి వాడు ఎంతవాడయేది గమనించక  తానే స్వయంగావాడి పిలక కత్తిరించేవాడట. ఆతర్వాత కోపం తగ్గాక  తానే మళ్ళా వారికేదో పరిహారం సమర్పించుకునే వాడట. అటువంటి రాజు గారు కూడా దండిభొట్ల వారి మాటను మన్నించారంటే వారికి పండితులూ కవుల పట్ల ఉన్న అపార గౌరవమే కారణం కదా.

విజయనగర సంస్థానానికి సంబంధించిన ముచ్చటేమిటంటే  రాజు గారు తమ ఆస్థానానికి రమ్మని శ్రీ పరవస్తు రంగాచార్లయ్యవార్లంగారిని ఆహ్వానిస్తే తన యేర్పాటు ప్రకారం అనుమతిస్తేనే రాగలనని అన్నారుట. ఆ యేర్పాట్లేమిటంటే  1. కోటగుమ్మం వరకూ సవారీలో వెళ్లడం. 2. అక్కడి నుండి పాదుకలతో నడచి సభ వరకూ వెళ్లడం 3. అక్కడ పాదుకలు వదలి చిత్రాసనం పై కూర్చోవడం. దీనికి రాజు గారు తమకేమీ అభ్యంతరం లేకపోయినా సభలో ఆచార్యులవారు చిత్రాసనం పై కూర్చుంటే తమ పండితులకు అవమానంగా ఉంటుంది కనుక వీలు పడదన్నారట. అందుచేత  రంగాచార్యుల వారు ఆ ఆహ్వానాన్ని నిరాకరించారట. తమ ఆస్థాన పండితుల మర్యాదని కాపాడడానికి రాజుగారు ప్రయత్నిస్తే, ఆచార్యులవారు తాము తృణీకృత బ్రహ్మ పురంధరులనిపించుకున్నారు.
పెద్దాపురం ప్రభువులు మాగాపు శరభ కవిగారి పేరు వినడమేగాని ఆయననెప్పుడూ చూసిఉండలేదు. ఒకసారి ఆ రాజుగారు స్వయంగా ముమ్మిడివరం దాపున ఉన్న మాగాం గ్రామానికి వెళ్ళేసరికి అక్కడ పుట్టగోచీ పెట్టుకుని తన అరటితోటలో మొక్కలకు గొప్పులు తవ్వుతున్న శరభ కవిగారు కనిపించారట. రాజు గారికి ఏమనిపించిందో ఏమో గాని కవిగారు వినేటట్లుగానే "ఇతడేనా శరభ కవి"  అన్నాడట. ఈ ఏకవచన ప్రయోగానికి కవిగారికి మనసునొచ్చిందేమో  "వత్సవయి తిమ్మక్ష్మావిభుండీతడా..." అంటూ  తానూ ఏక వచన ప్రయోగం చేస్తూ  ఆశువుగా ఒకటి కాదు రెండుకాదు  ఏకంగా అరవై పద్యాలు చెప్పాడట. ఆ విధంగా రాజుగారు తెలిసో తెలియకో తనను ఒక్కసారి ఏకవచంలో సంబోధిస్తే, కవిగారు ఆయనను 60 సార్లు ఏకవచనంలో సంబోధించి కసి దీర్చుకున్నాడన్నమాట.ఆయన ఎంత విద్వత్కవి కాకపోతే ఉన్నపాటున అనర్గళంగా 60 పద్యాలను ఆశువుగా చెప్పగలడు ? అటువంటి కవిగారికి ధిషణాహంకారం కూడా అలంకారమేకదా.

పంతమంటే పంతమేనని పట్టుక్కూర్చున్న పండితులవారి ఉదంతం ఒకటి మాత్రం చెప్పి ముగిస్తాను.
దాదాపు నూరేళ్ళ క్రితం- 1900-1910 ప్రాంతాల్లో పిఠాపురం రాజావారికి  పండిత సభలు జరిపించి తర్కమూ- వ్యాకరణమూ- వేదాంతమూ- ఈ మూడు శాస్త్రాలలోనూ ఏటేటా పరీక్ష లు నిర్వహించి సంస్కృత పండితులకు వార్షిక సన్మానాలు చేస్తూ ఉండాలనే సదుద్దేశం కలిగింది. ఆవిధమైన పత్రికా ప్రకటన కూడా ఇచ్చారుట. అయితే ఆ విధమైన పరీక్షలు నిర్వహించడానికి సమర్థులైన పండిత శ్రేష్టులెవరని ఆలోచిస్తే ఆరోజుల్లో విజయనగరంలో ఉంటున్న ఉద్దండ పండితులైన శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారు, పేరి కాశీనాథ శాస్త్రులవారు, గుమ్మలూరి సంగమేశ్వరశాస్త్రులవారు, ఆదిభట్ల రామమూర్తి శాస్త్రులవారూ కనిపించారు. వారిని సంప్రదిస్తే వారు తమకు ఎలాంటి పరీక్షలైనా ఉండే పక్షం లో తాము రామని తెలియజేసారు. దానికి రాజుగారు అట్లాంటివేవీ ఉండవని చెప్పి ఒక రోజుముందుగానే వారిని రావలసిందని దీవాను గారి ద్వారా కబురంపేరు. వారు ఆ రీతి గా వచ్చారు. వచ్చి దివాణం హాల్లో కూర్చున్న పండితులలో మొదటగా సుబ్బరాయ శాస్త్రి గారిని లోనికి పిలిపించి రాజుగారు "అయ్యా తమరి మంగళాచరణంతోనే మా పండిత  సభా కార్యక్రమాన్ని తమరు ఆరంభించాలి"  అనగానే శాస్త్రిగారు పాణినీయంలోని  మొదటి సూత్రం " వృధ్దిరాదైచ్ " అని చదివారట. రాజుగారు శుభం అని పలికి, అలాగే గుమ్మలూరి వారినీ ఆదిభట్లవారినీ పిలిపించి అడుగగా వారూ తమ శాస్త్రం లోని మంగళకరమైన శ్లోకభాగాల్నిచదివారట. రాజుగారు భేష్ అని మెచ్చుకుని ఆఖరుగా పేరి వారిని పిలిచి తమరూ  మీశాస్త్రంలోనిది ఒక శబ్దం వినిపిస్తే  పరీక్షకవర్గ నిర్ణయం పూర్తవుతుందని అన్నారుట. దానికి పేరివారు  అది కూడా ఒక పరీక్ష లాంటిదేనని అంగీకరించలేదట. దానికి రాజుగారు "మిగిలిన ముగ్గురు పండితులూ మమ్మల్ని అనుగ్రహించేరు. వారిని పరీక్షకులుగా ఏర్పరచుకున్నాం ..తమరుకూడా తమకు తోచినదేదైనా ఒక్కముక్క చెప్పి ఈ వర్గంలో చేరితే మాకు పరీక్షల సమస్య పూర్తవుతుంది, తమముఖతః ఏదయినా ఒక్కసూత్రం వినాలనుంది" అని  అన్నారుట. దానికి పేరి వారు ససేమిరా అంటూ రాజుగారి కోరిక మరునాడైతే సరే గాని ఆ రోజు ఏంచేసినా అది తమను పరీక్షించడం క్రందే వస్తుందని చెప్పి అక్కడనుండి తిరిగి తమ బసకైనా వెళ్ళ కుండా రైల్వే స్టేషనుకు వెళ్లి అటునుంచటే బొబ్బిలి చేరుకుని తమకు పిఠాపురం లో జరిగిన ఈ అవమానం గురించి ఆ రాజుగారికి తెలియజేసారుట.బొబ్బిలి వారికీ పిఠాపురం వారికీ ఆ రోజుల్లో బధ్ధవైరమట. బొబ్బిలి రాజు గారు మరునాడు  శాస్త్రిగారిని ఏనుగ పై ఊరేగించి సభ ఏర్పాటు చేసి సన్మానించేరుట.శాస్త్రిగారికి ప్రతీ విజయదశమికీ ఏటేటా నూట పదహారు రూపాయలు వార్షికం వారి ఇంటికే పంపే ఏర్పాటు కూడా చేసేరుట. ఆ విధంగా పేరివారు తమపంతాన్ని నెగ్గించుకున్నారన్నమాట. వారి ధిషణాహంకారం వారిని రాజుల్నిసైతం లెక్కచేయనిచ్చేది కాదన్నదానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.

మనం ఈ నాడు ఆత్మ గౌరవం..ఆత్మ గౌరవం.. అని  కేవలం వల్లిస్తుంటాం.అత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించిన  మార్గదర్శులీ మహనీయులు.
                                                                    ****
 ఈ విషయాల్ని నేను శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రుల వారి గ్రంథాలనుండి గ్రహించాను. ఆ కీర్తి శేషులకు నాకృతజ్ఞతలు.
   

13, జులై 2013, శనివారం

ఒక అరుదైన పుస్తకం-- రాయవాచకం


రాయవాచకమన్న పేరు వినగానే ఎవరికైనా ఇది Royal English Reader లాంటి చిన్న పిల్లలు బడిలో చదువుకునే ఏ తెలుగు వాచకమో అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇది అలాంటి ఆషామాషీ పుస్తకం కాదు. ఏ భాషాభిమానులో భాషాధ్యయనం చేసేవారో తప్ప దీని పేరు కూడా విని ఉండక పోవచ్చు. ఇది చరిత్ర కారులకు బంగారు గని, భాషా వేత్తలకు వజ్రాల ఖని అని పేరొందిన గ్రంథం. గ్రంథమని అంటున్నానే కాని ఇది అరవై పేజీల చిన్ని పుస్తకమే. అయినా ఆంధ్ర వచన వాఙ్మయంలో దీనికొక విశిష్ట స్థానం ఉంది. ఇంతకీ ఇదేమి పుస్తకమో ఎవరు వ్రాసేరో  ఎప్పుడు వ్రాసేరో ఇందులో ఏముందో కొంచెం పరిచయం చేస్తాను.
                                             వాచకం అంటే సమాచారం. ఇది మన శ్రీ కృష్ణ దేవరాయలను గూర్చిన సమాచారాన్ని అందజేస్తుంది కనుక దీనికి రాయవాచకమని పేరు. ఇది వ్రాసిన వాని పేరు మనకు తెలియదు.  అతడు తాను శ్రీ మహా మండలేశ్వర కాశీ విశ్వనాథనాయనయ్య గారి స్థానాపతినని  మాత్రం చెప్పుకున్నాడు. ఈ విశ్వనాథయ్యను మథుర రాజ్యాన్ని క్రీ.శ. 1595 మొదలు 1602 వరకు తన అన్నతో పాటు కలిసి పాలించిన రెండవ కృష్ణప్ప తమ్ముడు విశ్వనాథనాయకునిగా గుర్తించారు. స్థానాపతి అంటే సామంత రాజులూ అమర నాయకూలూ తమ ప్రతినిథిగా తమ  రాజధాని విజయనగరం లో నియమించుకున్న రాజోద్యోగి అన్నమాట. ఇలాగ తనఉద్యోగం పేరు ( Designation ) తో మాత్రమే ఈ రచయిత మన సాహితీ లోకానికి పరిచయం. చాలా తర్జన భర్జనల అనంతరం గ్రంథంలో ఉన్న ఆథారాలను బట్టి ఇది క్రీ.శ. 1592- 1602 మధ్య కాలంలో వ్రాయబడి ఉంటుందని భావిస్తున్నారు.
స్థూలంగా ఈ పుస్తకం కర్ణాటక రాజుల దినచర్యనీ కృష్ణరాయల పట్టాభిషేకాన్నీ ఆయన నిత్యకృత్యాలనీ ఆయన ధనాగారం సైన్యం వంటి వివరాలనీ, ఆయన జైత్రయాత్రకు సంబంధించిన విషయాలనీ తెలుపుతుంది. అయితే ఇది రాయల అనంతరం ఏ అరవై డబ్భై సంవత్సరాల తర్వాతో వ్రాయబడినది కనుక ఈ విషయాలన్నీ రచయితే చెప్పుకున్నట్లు సుజనులు చెప్పగా విని వ్రాసినవి గానే మనం గ్రహించాలి. ఆ కారణంగా ఇతర చారిత్రికాధారాలకూ దీనిలోని విషయాలకూ అక్కడక్కడ కొన్ని వైరుధ్యాలున్నా దీనిని విజయనగర కాలం నాటి రాజుల చరిత్రకు ఉపయుక్త గ్రంథం గానే చరిత్రకారులు పరిగణిస్తారు. పైన చెప్పిన కారణం  వలన పూర్తిగా చరిత్రకారులకేమోగాని భాషాచరిత్రకారులకు మాత్రంఇది నిజంగా గని వంటిదే. దీని లోని భాష గురించి కొంచెం వివరిస్తాను.
ఆది కవి నన్నయ కాలం నుండి కావ్యాంతర్గతంగా అక్కడక్కడా కనిపించడం తప్ప దాదాపు 15వ శతాబ్దం వరకూ స్వతంత్రమైన వచనకావ్యమేదీ వెలువడ లేదు. అప్పుడు కూడా సింహగిరి నరహరి వచనములు శఠకోప విన్నపములు వెంకటేశ్వర వచనములు వంటి మత వేదాంత పరమైనవి పరిమితంగా ఉన్నా వాటిల్లో కూడా  ఏ ఒకటి రెండో తప్ప మిగిలినవన్నీ గ్రాంథిక బాషలో వ్రాసినవే. అందువల్లనే రాయవాచకాన్ని మనం పూర్తిగా వ్యావహారిక భాషలో వ్రాయబడ్డ తొలి వచన రచనగా గుర్తించవచ్చు. రాయవాచకం ఆనాటి వ్యావహారికంలో వ్రాసిన చక్కని వచన గ్రంథం అని పేర్కొన్నారు శ్రీ ఆరుద్ర. రాయవాచకమునందు రచయిత అవలంబించిన శైలి ఆంథ్రము నంద పూర్వమైనది అంటారు శ్రీ కులశేఖర రావుగారు. రాయవాచకంలో రచయిత వాడిన భాష ఆనాటి ద్రావిడ దేశంలో ఉన్న ఆంధ్రుల నిత్యవ్యవహారంలో ఉన్న వాడుక భాష. చిత్రమేమిటంటే, తమిళ దేశం నడిబొడ్డున ఉన్న మధుర నాయక రాజుల కాలానికి  సంబంధించిన రచన అయినా దీనిలో ఒకటి రెండు పదాలు తప్పిస్తే  తమిళ పదాలు గాని దీనిపై ఆ భాషా ప్రభావం కాని కానరావు. మరొక ముఖ్య మైన విషయం ఏమిటంటే రాయవాచక భాష నోటిమాటకూ చేతివ్రాతకూ సామరస్యము కుదిరిన భాష. అంటే ఆనాటి తెలుగు వారు  పదాలను ఎలా ఉచ్చరించారో అలా వ్రాయడం జరిగిందన్నమాట. రాయల కాలంలో రాజకీయ వ్యవహారాలకు సంబంధించినదవడం చేత దీనిలో ఆనాటి రాజకీయుల వ్యవహారాలలో చేరి ప్రాచుర్యంపొందిన ఎన్నో పార్శీ పదాలూ, కొద్దిగా బుడతకీచు పదాలూ కూడా కనిపిస్తాయి. ఇటువంటి పారిభాషిక పదాలు, పాతకాలం నాటి రచనా విధానంలో అతిదీర్ఘమైన వాక్యాలూ ఉండడం వల్ల నేడు మనకిది సులభంగా అర్థం కాక తికమక పెట్టినా పొల్లు మాటలు గాని అక్కరలేని వర్ణనలు గాని లేకుండా ఉండడం వలన అప్పటి మన వ్యావహారిక తెలుగు భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చటిస్తాను.
నేను ఇంతకు ముందు నిండుసున్న అరసున్నల గురించిన పోస్టులో చెప్పినట్లు ఆ నాటికి అరసున్న వాడుకలో లేకపోవడంతో పూర్ణానుస్వారాన్ని పలక వలసిన చోట దాని తర్వాతి హల్లును ద్విత్వంగా వ్రాసేవారు.తర్వాత హల్లును ద్విత్వంగా రాయకపోతే దానిని తేల్చి అరసున్నలా పలకాలన్నమాట. ఉదా. కూర్చుండక అని నేడు మనం వ్రాసే చోట కూర్చుండ్డక అని వ్రాసేవారన్నమాట.ఇలా వ్రాయడం ఈ పుస్తకం నిండా ఎన్నో చోట్ల కనిపిస్తుంది.
పదాదిలో వువూవొవోలు లేవన్నది నేటి మాటయితే ఆరోజుల్లో నిరభ్యంతరంగా వీటిని వాడేవారు. ఉదా. ఉంటిమి అని నేడు వ్రాస్తే నాడు వుంట్టిమి అని వ్రాసేవారు.చిన్నయ సూరి కాదన్నా ఈ కాలంలో కూడా పండితులైనవారు కూడా వుత్తరం, వున్నవి అనీ,ఇ ఏ కి యే అంటూ వ్రాయడం మనం గమనించవచ్చు.
 ఈ రచన ఉచ్చారణ కనుగుణంగా కనిపిస్తుందనడానికి నిదర్శనం చూడండి. నరసింహ అనే పదాన్ని చాలామంది నేటికీ తెలంగాణాలో నరసింహ్మ అనే ఉచ్చరిస్తారు. అలాగే సింహాసనాన్ని సింహ్మాసనం అనడం. దీనిలో ఆ రూపాలే కనపడతాయి.. అలాగే అకారాన్ని ఎకారంగా పలకడం. చలనం అనే పదాన్ని చెలనం అని పలుకుతారు. దీనిలో అదే కనిపిస్తుంది. ఒక అనే పదాన్ని వఖ అని పలికి అలాగే వ్రాసేవారన్నమాట. చేయడాన్ని శాయడం అనేవారు. పల్లెకు పల్ల్య అనీ, వాళ్ళకు అనడానికి వార్లకు అనీ. అలాగే పదం మధ్యలో అచ్చును వ్రాయడం- అయితే కి అఇతే- అని పోయినారు కి పోఇనారు- అనీ వ్రాసేవారు. ఇలా ఎన్నో. దీనిలో నేను గమనించిన మరో విశేషం ఏమిటంటే పలకరించడం అనే పదాన్ని అడగడం చెప్పడం అనే మాటల స్థానంలో వాడడం. ఉదా. శిష్యులతో చెప్పి అనడానికి శిష్యులతో పలకరించి అని వ్రాస్తారు. మరో విశేషం ఏమిటంటే సాష్టాంగపడి అనడానికి అడ్డపడి అనేవారు. ఉదా. రాయలవారి సముఖానికి అడ్డపడి చేతులుకట్టుకుని..ఇత్యాది.ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి.
వ్యావహారిక భాష నిత్యచైతన్య శీలి.ఎన్నో రాజకీయ సాంఘిక కారణాల వలన భాషలో ఎన్నో అన్యభాషా పదాలు చేరుతూ ఉండడం వ్యావహారిక భాష తన రూపు రేఖల్ని మార్చుకుని కొత్త అందాలు సంతరించుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకిష్టమైనా లేకపోయినా ఇది జరిగి పోతూనే ఉంటుంది. ఎవ్వరమూ దానినాపలేము.
పరిమితమైన పరిచయంలో నేనింతకంటే ఎక్కువ చెప్పడానికి తావు లేదుగాని శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి విశేషాలుగానీ ఆనాటి మన తెలుగు వ్యావహారిక బాషా స్వరూపాన్నిగాని తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు మాత్రం తప్పక చదవవలసిన పుస్తకం ఇది.
ఈ పుస్తకాన్నిగ్రంథరూపంలో 1933లో శ్రీ జయంతి రామయ్య పంతులుగారు పరిష్కరించగా ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రికవారు 1933లో ప్రచురించారు. వీరు చేసిన మహోపకారమేమిటంటే ఆ నాటి భాషా స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి వీలుగా ఉన్నదున్నట్లుగానే ప్రచురించారు. దీన్ని మరలా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు డా. సి.వి. రామచంద్ర రావుగారి 55 పేజీల సుదీర్ఘ మైన పీఠికతో 1982 లో ప్రచురించారు. మొత్తం 108 పేజీల ఈ  అరుదైన గ్రంథాన్ని  కేవలం అయిదు రూపాయలకే  అప్పట్లో ఏదో పుస్తక ప్రదర్శనలో  కడపలో నేను కొన్నాను. ఆయితే ఇంత అరుదైన పుస్తకం ఇప్పుడు లభించదేమో అన్నభయం సాహితీప్రియులకు అక్కర లేదు. దీనిని గుంటూరు మిత్ర మండలి ప్రచురణలవారు ఎన్నో చిత్రాలతో ప్రచురించారని దానిని  నేడే  13.7.2013 తేదీన  గుంటూరులో ఆవిష్కరిస్తున్నారని Face Book లో శ్రీ చావా కిరణ్ కుమార్ గారు తెలిపారు. అరుదైన ఈ పుస్తకం  భాషాభిమానులకు మరలా లభ్యమౌతోందని తెలిసి ఆనందంగా ఉంది. అందుకే దీని గురించి ఈ ముచ్చట. సెలవు. 
                                                       ***


10, జులై 2013, బుధవారం

ఈ కవి గారి కలానికి రెండు వైపులా పాళీలే..


ఘటనాఘటన సమర్థులని కొందరుంటారు. అంటే వారు ఏపనినైనా చేయించాగలరు, లేకపోతే పని జరుగకుండా ఆపనూ గలరన్నమాట. ఇలాంటి వారి విషయంలోనే వారి కత్తికి రెండువైపులా పదునే అనే నానుడి వచ్చింది. శూరుల విషయంలో కత్తి ఎటువంటిదో  కవుల విషయంలో కలం అటువంటిదే కదాతన కలం పోటుతో ఒక పని జరిగేటట్లుకాని జరుగకుండా ఆపేటట్లు గాని చేసే కవిగారి కలానికి కూడా రెండువైపులా పదునే కదాఇలాంటి  ఘటనా ఘటన సమర్థుడైన ఒక కవిగారి ముచ్చట ఒకటి మీకు చెప్పాలనిపిస్తోంది. వినండి.
                                                                        ****
భగవదనుగ్రహం వలన  ఆగ్రహానుగ్రహ శక్తిని పొందిన పొందిన కవులు కొందరుండేవారు. వారిలో అందరికీ తెలిసి తిట్టు కవిగా  ప్రఖ్యాతి పొందిన వాడు  వేములాడ భీమకవి కాగా,  అంతగా కాకపోయినా అటువంటి శక్తి కలిగిన వాడుగా పేరుపొందిన మరొక కవి శ్రేష్టుడు తురగా రామకవి. ఈయన స్వగ్రామం  తూర్పు గోదావరి జిల్లా లోని తుని లేక దగ్గర లోని ఏదో గ్రామం. తరచుగా దేశాటనం వెళ్లి వస్తూ ఉండేవాడు. అతడికి అక్కడి చాలా ఆస్థానాల్లో వార్షికాశనాలు ఉండేవి. వార్షికాశనాలంటే  యేడాదికొక్కసారి   సంస్థానానికి వెళ్లి  అయిదో పదో రోజులు రాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన ధనాదికములను స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట. కవి గారొక సారి పిఠాపురాన్ని ఏలుతున్న వత్సవాయి తిమ్మరాజు గారి దర్శనం కోరి వారి కోటకు వచ్చాడట. అంతకుముందే అతడు వచ్చి తన వార్షికాన్ని స్వీకరించి వెళ్లి ఉండడం చేత, మళ్ళీ ఏం కోరి వచ్చాడోనని, రాజు గారు దర్శనమివ్వక అనాదరించారట. అందుకు కోపగించిన కవిగారు ఆతని కోట గోడమీదో తలుపు మీదో  మసి బొగ్గుతోపెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్.. అని వ్రాసేడట. పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మి లక్ష్మీ దేవి  అదృష్ట దేవతైతేఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట. కవిగారు అగ్రహించి చేసిన పని గురించి తెలుసు కున్న రాజుగారు, కవిగారి ఆగ్రహానుగ్రహ శక్తి  ఎరిగిన వాడు కనుక  స్నానం చేస్తున్న వాడు కాస్తా తడి బట్టలతోనే వచ్చి కవిగారిని శాంతింపజేసి, వారు వచ్చిన కార్యం కనుక్కున్నారట. కవిగారి కోరిక సమంజసమైనది కాక పోయినప్పటికీ రాజుగారు ఎంతో కొంత సంతృప్తి పరచడంతో మోమోటం చెందిన కవిగారు తన పద్యం లో ముందు భాగాన్ని ఇలా పూరించారట.
అద్దిర, శ్రీ , భూ, నీళలు
ముద్దియలా హరికి గలరు, ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడెను
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్
చూడండి కవి గారి చాతుర్యం. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది కదా? అయితే మొదట కవిగారికి జరిగిన నిరాదరణ వల్ల కవి వాక్కు పూర్తిగా వృథా పోలేదనీ  తిమ్మరాజు గారి కాలంలో కాకపోయినా ఆయన మనుమల కాలంలో జమీందారీ కష్టాలపాలై నశించిందన్నదీ ఐతిహ్యం.
                                                                         ****
తా..- అంటే తాజా కలమన్న మాటకు ఇవి  పొడి అక్షరాలన్నమాట. ఇది ఇంగ్లీషు భాషలోని  Post Script కి సమానమైనది. ముందు వ్రాసిన వ్రాతలో మరచి పోయిన విషయాన్నో మరీ ముఖ్యమైన దాన్ని గుర్తు చేయడానికో చివర్లో తాజా కలం  అంటూ వ్రాసేవారు. అయితే నేనీ తా.. అనే తోక ని తగిలించడానికి కారణం అది కాదు. బాల్ పెన్నులు తప్ప సిరాతో వ్రాసే కలాలగురించి ఈనాటి యువతలో కొందరికైనా తెలిసి ఉండక పోవచ్చునన్నసంశయమే. మేము మరీ చిన్నగా ఉన్నప్పుడు సిరా బుడ్డి కలం విడి విడిగా పట్టుకుని పాఠశాలలకు వెళ్ళే వారు. సిరా బుడ్డిలో కలం ముంచి వ్రాయాల్సి వచ్చేదన్న మాట.కరక్కాయతో చేసిన సిరా అయితే ఎన్నటికీ చెరగకుండా ఉండేది. అయితే మేము స్కూల్లో చేరినప్పటికే ఫౌంటెన్ పెన్నులు వాడుకలోకి రావడం వల్ల మాకా బాధ తప్పింది. ఇలాంటి ఇంకు పెన్నులు చూచిన వారైనా రెండు వైపుల నుంచి రెండు రంగుల సిరా పోసుకుని వాడుకునే వీలున్న Fancy కలాలలని చూసి ఉండక పోవచ్చు. సకృత్తుగా నైనా ఇలాంటివీ ఉండేవి. ఒకవైపు నీలం సిరా రెండవ వైపు ఎర్రరంగు సిరా  పోసుకునే వారు. నీలం సిరాతో వ్రాయడానికీ ఎర్రసిరాతో తప్పులు దిద్దడానికీ వాడే వారు. మరి మన కవిగారి కలం అలాంటిదే కదా? అయన కలానికి రెండు వైపులా పాళీలే.

                                                                          ****