4, మే 2014, ఆదివారం

అయిదు మార్కుల తమాషా కథ




ఇదేమో నిజంగా జరిగిన కథ. నాకు చాలా తమాషాగా అనిపించింది. మీరూ వినండి. సరదాగా ఉంటుంది. కథంతా విన్నాక ఎక్కడ జరిగిందో చివర్లో చెబుతాను.
                                           *****
ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ ఇంట్లోకి ప్రవేశించడం వాళ్ళ నాన్న చూసేడు. ఆయనో పెద్ద మోతుబరి రైతు. 200 ఎకరాల ఆసామీ. చిన్నప్పుడు అమరము, బాల రామాయణము, పెద్ద బాలశిక్ష దాకా చదువుకున్నాడు. ఏడుస్తున్న కొడుకును కారణం అడిగితే తనకు  కేవలం అయిదు మార్కులు తక్కువ వచ్చినందున  పరీక్ష  ఫెయిల్  చేశారని  చెప్పాడు. వాడిని కాసేపు సముదాయించి, ఛర్నాకోల తీసుకుని తానే స్వయంగా గుర్రం బండి తోలుకుంటూ స్కూలు చేరుకుని ఎక్కడయ్యా హెడ్మాస్ట్రుఅంటూ ఒక గావుకేక పెట్టాడు. ప్యూను దారి చూపించగా హెడ్మాస్టరుగారి రూము చేరుకుని బయటే నిలబడి ఏవఁయా హెడ్మాస్ట్రూ..ఐదు మార్కులు..అనావస్యం ( అంటే After all అని అర్థంట) ఐదు మార్కులు తక్కువొస్తే మావాణ్ణి ఫెయిల్ చేశావట? అని గట్టిగానే అడిగాడు.( లేక అరిచాడు).
ఆ హెడ్మాస్టరు గొప్ప చాకచక్యము, సమయ స్ఫూర్తి కలవాడేమో, తన కుర్చీ లోంచి లేచి వచ్చిపెద్దయ్య గారు ఎండలో పడి వచ్చారు. ఈ కుర్చీలో కూర్చోండి తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ ప్యూనుని పిలిచి మన డ్రిల్లు మాస్టారి రూములో కొబ్బరి  బోండాలున్నాయి కదా ఒకటి తీసుకురా. అలాగే వస్తూ వస్తూ మన సైన్సు మాస్టార్ని కూడా వీళ్ళబ్బాయి కొశ్చను పేపరు ఆన్సరు పేపరు కూడా పట్టుకుని రమ్మను. అన్నారు.
మోతుబరి మాత్రం హెడ్మాస్టరు గారు తనకిచ్చిన గౌరవానికి పొంగి పోకుండా నేనిక్కడ కూర్చోడానికి రాలేదు. అనావస్యం అయిదు మార్కులు తక్కువొచ్చాయని మా వాడి గొంతు కోశావు కదా? అదేంది సంగతని అడగడానికొచ్చాను అన్నాడు.
హెడ్మాస్టరు గారేమీ కంగారు పడకుండా పెద్దయ్యగారు అలసి పోయున్నారు. కాస్తంత స్థిమిత పడండి. తర్వాత మాట్లాడుకుందాం అంటూ ప్యూను తెచ్చిచ్చిన కొబ్బరి బోండాన్ని ఆయన చేతికందించారు. ఆ మోతుబరి ఇంకా అసహనం గానే ఆ బోండాంలో ఉన్న స్ట్రాని అవతల విసిరేసి  కొబ్బరి బోండాన్ని ఎత్తి పట్టుకుని దాన్లోని నీళ్ళన్నీ ఒక్క గుక్కలో తాగేసి అక్కడ పడేసి ఛర్నాకోలని హెడ్మాస్టరు టేబిలు మీద పడేసి ఇప్పుడైనా  చెప్పవయ్యా సంగతేంటన్నట్లు హెడ్మాస్టరు వైపు చూసేడు.
హెడ్మాస్టరు ఆ మోతుబరి  పక్కనే స్టూలు మీద కూర్చుంటూ సైన్సు మాస్టరు తెచ్చిచ్చిన ప్రశ్నా పత్రాన్ని ఆయనకు చూపిస్తూ ఇది మీవాడి కొశ్చన్ పేపరు. దీని మీద కుడివైపున ఏమి వ్రాసి ఉందో మీరో చూడండి అంటూ చూపించారు. చదవడం వచ్చిన మోతుబరి గారు మొత్తం 100 మార్కులు అంటూ చదివాడు ”. అప్పుడు హెడ్మాస్టరుగారు చూసేరు కదా 100 మార్కులకీ మీవాడికి ఎన్నొచ్చేయో మీరే చూడండి. అంటూ ఆ అబ్బాయి ఆన్సరుషీటుని ఆయనకు చూపిస్తూ  మీ వాడికి వచ్చినవి ఎన్ని? తొంభై తొమ్మిదా? తొంభై ఎనిమిదా? తొంభయ్యా?  పోనీ 80..70...60...50...40.. ఇవేవీ కావు కదా?  కేవలం 30 మార్కులు. మీరే చూసేరు కదా?  మీ వాడికి తక్కువొచ్చింది 100 లో 30 పోతే 70. డభ్భయి మార్కులు తక్కువ వొచ్చిన వాణ్ణి ఎలా  పాసు చెయ్యమంటారో మీరే చెప్పండి? అన్నాడు.
హెడ్మాస్టరు చెప్పింది విన్నాక మోతుబరి ముఖంలో కోపమంతా మాయమైంది. గుబురు మీసాల వెనుక చిరు నవ్వు కూడా మెరిసింది.  ఔను మరి ..రెండో మూడో మార్కులు తక్కువైతే నువ్వే ఎట్టాగో అట్టా నువ్వే సర్దేసి ఉండేటోడివి కదా?  ఏకంగా డభ్భై మార్కులు తక్కువొస్తే నువ్వు మాత్రం ఏం జేస్తావులే సామీ? అంటూ మళ్ళా కోపంగా  మరి మా దొంగ నాయాల అయిదే తక్కువైనాయని చెప్పేడే...డభ్భై మార్కులు తక్కువ తెచ్చుకునింది కాక నాతో అయిదే మార్కులు తక్కువొచ్చినయ్యని అబధ్ధాలు కూడా చెబుతాడా?  వాని వీపు  ఇప్పుడే సాపు జేస్తా.. అంటూ కుర్చీ లోంచి లేచి బయటకు నడిచాడు. హెడ్మాస్టరు గారు ఇదిగో ఇది మర్చిపోయారు అంటూ మోతుబరి తన టేబిలు మీద పెట్టిన ఛర్నా కోలను తీసి అందిస్తే తీసుకుంటూ మా బాగా గుర్తు చేశావు . ఇప్పుడు దీనితోనే గదా పని బడేది అంటూ తన బండి వైపునడిచాడు.
                                                            ****
ఆ తర్వాతేమయ్యిందో నాకు తెలీదు. ఎందు చేతనంటే ఈ ముచ్చటని తన చిన్నతనంలో తాను తొమ్మిదో తరగతి చదువుతుండగా జరిగిందనీ, ఆ అబ్బాయి తన క్లాసుమేటేననీ చెప్పిన ప్రముఖ రచయిత డా. కేశవరెడ్డిగారు ఆ తర్వాతేమయిందో చెప్పలేదు. (అయినా అది మన ఊహకందని విషయం కాదుకదా?)  ఆ హెడ్మాస్టరుగారి పేరు  తనకి స్పష్టంగా గుర్తుందనీ వారు శ్రీ బి. పద్మనాభ రెడ్డిగారనీ మాత్రం చెప్పారు.
                                                  ****
ఈ ముచ్చటని రికార్డు చేసిన డా. కేశవ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సరదా ముచ్చటనాకు నచ్చింది. మరి మీకు కూడా నచ్చితే సంతోషమే. సెలవు.
                                                  ****